అనుమతి లేని కేంద్రాలపై కేసులు పెట్టండి..
Ens Balu
2
Vizianagaram
2021-02-05 20:14:06
రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్న స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్.వి.రమణకుమారి తెలిపారు. శుక్రవారం ఆమె ఛాంబరులో గర్భస్థ పిండ లింగ నిర్థారణ నిషేద చట్టంపై జిల్లా సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు చదలవాడ ప్రసాదు మాట్లాడుతూ జిల్లాలో అనుమతిలేని స్కానింగ్ కేంద్రాలు నడుపుతున్నట్లు తన దృష్టిలో వుందని తెలుపగా అలాంటి సెంటర్లను వెంటనే రద్దు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. జిల్లాలో 14 ప్రభుత్వ స్కానింగ్ సెంటర్లు, 69 ప్రైవేటుస్కానింగ్ సెంటర్లు వున్నాయని, మరో 4 దరఖాస్తులు ఆన్ లైన్ లో అందాయని తెలిపారు. ఎవరైనా స్కానింగ్ సెంటరు కోసం ఆన్ లైన్ లోనే తగు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని వాటిని పరిశీలించి అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం అందిన 4 దరఖాస్తులను ఆమోదించడం అయినదని, త్వరలోనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. కమిటీ సభ్యులు న్యాయవాది ఉపాధ్యాయుల రవిశంకర్ మాట్లాడుతూ అన్ని స్కానింగ్ కేంద్రాలు, సభ్యులను కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తే ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయుటకు వీలవుందన్నారు. గర్బస్థ లింగ నిర్థారణ చట్టంపై ప్రజలకు, వైద్యులకు అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచారం గావించాలన్నారు. ఏ ఒక్క కేంద్రంలోగాని లింగ నిర్థారణ పరీక్షలు జరిగిన, వెల్లడించిన ఆ కేంద్రాన్నిరద్దు చేయడంతో పాటు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో సభ్యులు డిప్యూటి డిఎం అండ్ హెఓ డా. చామంతి, పిఎన్డిటి కౌన్సిలరు పవన్ ఆశిష్, ఘోష ఆసుపత్రి స్త్రీల వైద్యలు డా. ఉషారాణి, డివిజనల్ పౌర సంబంధాల అధికారి ఎస్. జానకమ్మ, పిల్లల వైద్యులు డా. అప్పలనాయుడు, నేచర్ కౌన్సిలరు దర్గ, డెమో సబ్బలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.