రేపే 2వ విడత ఎన్నికలకు నోటిఫికేషన్..
Ens Balu
1
Vizianagaram
2021-02-05 20:18:32
విజయనగరం జిల్లాలో రెండో దశ పంచాయతీ పోరుకు నేడు నగారా మోగనుంది. రెండో విడత ఎన్నికలకు సంబంధించి శనివారం నుంచి నామినేషన్ల పర్వం మొదలుకానుంది. విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఉన్న మొత్తం 248 గ్రామ పంచాయతీలకు జిల్లా ఎన్నికల అధికారులు నేడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ఫేజ్-3 ప్రకారం జిల్లాలోని విజయనగరం డివిజన్లో ఈ నెల 17న గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరగనున్నాయి. విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఉన్న 9 మండలాల్లోని 248 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. సంబంధిత గ్రామ పంచాయతీలకు సంబంధించి శనివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రతీ నాలుగైదు పంచాయితీలకు కలిపి నిర్దేశించిన క్లస్టర్లలో నామినేషన్లను స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు. రెండో దశ ఎన్నిక జరిగే ప్రాంతాన్ని 38 జోన్లుగా, 82 రూట్లుగా విభజించారు. స్టేజ్- 1లో మొత్తం 89 మంది ఆర్ఓలు, 89 మంది ఏఆర్ఓలు, స్టేజ్-2లో 248 ఆర్వోలు, 2643 మంది పిఓలు, 3459 మంది ఓపిఓలు ఎన్నికల విధులు పాల్గొంటారు. వీరంతా దశల వారీగా ఇప్పటికే శిక్షణ పొందారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
రెండో దశలో ఎన్నిక జరగనున్న మండలాల పరిధిలో 2,402 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 66 సమస్యాత్మక, 56 అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు 122 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. అలాగే ఆయా ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియతోపాటు, ప్రచారం, ఓటింగ్ మొదలగు వివిధ దశలను 87 మంది వీడియో గ్రాఫర్లద్వారా వీడియో రికార్డింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రక్రియ సాగేది ఇలా _..!
6వ తేదీ నుంచి రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటలు వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 8వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది_ . 9వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. అభ్యర్థులు అప్పీల్ చేసుకొనేందుకు 10వ తేదీ సాయంత్రం 5 గంటలు వరకు గడువుంది. అప్పిలేట్ అధికారి వారి అప్పీళ్లను 11వ తేదీన పరిశీలిస్తారు. 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలు వరకూ నామినేషన్లను ఉపసంహరించుకొనే అవకాశం ఉంది. ఆ తరువాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ 9 మండలాల్లో 2,402 పోలింగ్ కేంద్రాల ద్వారా 17వ తేదీ ఉదయం 6.30 నుంచి 3.30 గంటలు వరకూ ఎన్నిక జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, విజేతను ప్రకటిస్తారు. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. ఈ 248 పంచాయితీల్లో మొత్తం 4,13,508 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,07,278మంది కాగా, మహిళా ఓటర్లు 2,06,208 మంది, ఇతరులు 22 మంది ఉన్నారు.
మండలాల వారీగా బరిలో నిలిచే పంచాయతీలు
1. భోగాపురం-22
2. చీపురుపల్లి-19
3. డెంకాడ-27
4. గరివిడి-31
5. గుర్ల-42
6. మెరకముడిదాం-29
7. నెల్లిమర్ల-28
8. పూసపాటిరేగ-28
9. విజయనగరం-22