ఆంధ్రప్రదేశ్ లో 72 రైల్వే స్టేషన్లకు మహర్ధశ
Ens Balu
19
New Delhi
2023-02-12 14:23:46
‘అమృత్ భారత్ స్టేషన్స్’ పథకం కింద దేశంలో 1,275 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ సహా 72 రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అభివృద్ధి చేయనుంది. ఈ పథకం కింద రైల్వే స్టేషన్లలో 53 రకాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. దానికోసం ప్రతి స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ప్లాన్ రూపొందిస్తారు. దానికోసం నిపుణుల కమిటీలను నియమిస్తామని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. అనంతరం బడ్జెట్ను రూపొందించి దశలవారీగా పనులు ప్రారంభించనున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా వరకూ రైల్వే స్టేషన్లు కొత్త అభివ్రుద్ధి శోభను సంతరించుకోనున్నాయి. అంతేకాకుండా ప్రాధాన్యత కలిగిన లైన్లలో రైళ్ల పెంపుపైనా ప్రకటన వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
రాష్ట్రంలో అభివృద్ధి చేయనున్న రైల్వే స్టేషన్లు ఇవే..
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం, విజయనగరం, తెనాలి, గుంటూరు, ఆదోని, అనకాపల్లి, అనపర్తి, అరకు, బాపట్ల, భీమవరం టౌన్, బొబ్బిలి, చీపురుపల్లి, చీరాల, చిత్తూరు, కడప, కంభం, ధర్మవరం, డోన్, దొనకొండ, దువ్వాడ, యలమంచిలి, ఏలూరు, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గూడురు, గుణదల, హిందూపూర్, ఇచ్ఛాపురం, కదిరి, కాకినాడ టౌన్, కొత్తవలస, కుప్పం, కర్నూలు సిటీ, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లి రోడ్, మంగళగిరి, మార్కాపూరం రోడ్, మంత్రాలయం రోడ్, నడికుడి, నంద్యాల, నరసరావుపేట, నరసాపూర్, నౌపడ, నెల్లూరు, నిడదవోలు, ఒంగోలు, పాకాల, పలాస, పార్వతీపురం, పిడుగురాళ్ల, పీలేరు, రాజంపేట, రాజమహేంద్రవరం, రాయనపాడు, రేణిగుంట, రేపల్లె, సామర్లకోట, సత్తెనపల్లి, సింహాచలం, సింగరాయకొండ, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం రోడ్, సూళ్లూరుపేట, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తుని, వినుకొండ.
స్టేషన్లలో కల్పించనున్న సౌకర్యాల్లో మచ్చుకు కొన్ని..
ప్రతి స్టేషన్లో భవనాలు, ఫ్లోరింగ్ ఆధునిక శైలిలో నిర్మాణం , ప్రస్తుతం ప్లాట్ఫామ్లు 600 మీటర్ల పొడవుతో ఉన్నాయి. వాటి పొడవు 760 మీటర్ల నుంచి 840 మీటర్ల వరకు పెంచనున్నారు. స్టేషన్ల వద్ద ట్రాక్ల శుభ్రత, సులభమైన నిర్వహణ కోసం ‘బ్యాలస్ట్ట్లెస్ ట్రాక్’ల ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే ఎన్ఎస్జీ 1 – 4, ఎస్జీ 1– 2 కేటగిరీ స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటుతోపాటు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చెయిర్లు, ప్రత్యేక ప్రవేశ మార్గాలు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు వెయిటింగ్ హాల్స్, వాటికి అనుబంధంగా కేఫెటేరియా, స్థానిక ఉత్పత్తుల విక్రయానికి కనీసం రెండు స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ప్రతి స్టేషన్ మొదటి అంతస్తులో ప్రత్యేకంగా రూఫ్ ప్లాజా, సమావేశ మందిరాలు, స్టేషన్కు రెండు వైపులా అప్రోచ్ రోడ్లు, పార్కింగ్ ఏరియా, పాదచారులకు ప్రత్యేక దారులు నిర్మిస్తారు. ల్యాండ్ స్కేపింగ్, ఆధునిక లైటింగ్ తోపాటు వేగవంతమైన వైఫై సేవలకు 5జీ టవర్లు నిర్మించనున్నారు. ఇంకా మరికొన్ని అభివ్రుద్ధి పనులు చేపట్టనున్నారు. కాగా నిపుణుల కమిటీ త్వరలోనే వీటిని ప్రకటించనుంది.