నడకదారి పైకప్పును ప్రారంభించిన సీఎం..
Ens Balu
3
Tirumala
2021-10-11 12:26:41
తిరుపతిలోని అలిపిరి నుండి తిరుమల జిఎన్సి టోల్ గేట్ వరకు పునర్నిర్మించిన నడకమార్గం పైకప్పును సోమవారం సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ముందుగా అలిపిరి పాదాల మండపం వద్ద ముఖ్యమంత్రికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో సదా భార్గవి కలిసి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అలిపిరి నుంచి తిరుమలకు నడచివెళ్లే మార్గంలో 40 సంవత్సరాల క్రితం పైకప్పు నిర్మించారు. ఈ పైకప్పు అక్కడక్కడా పాడై పునరుద్ధరణ అవసరమైంది. ఈ పరిస్థితుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ రూ.25 కోట్ల విరాళంతో నడకమార్గంలో నూతనంగా పైకప్పు నిర్మించడానికి ముందుకొచ్చింది. అలిపిరి నుండి గాలిగోపురం వరకు 1100 మీటర్ల దూరం కొత్తగా గాల్వాల్యూమ్ రూఫింగ్ షెల్టర్లు నిర్మించారు. గాలిగోపురం నుంచి తిరుమల జిఎన్సి వరకు 3,250 మీటర్ల దూరం కొత్తగా ఆర్సిసి రూఫ్ షెడ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఉపసభాపతి కోన రఘుపతి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎంపీలు గురుమూర్తి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, అదనపు ఈఓ ఏవి.ధర్మారెడ్డి, తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి, రిలయన్స్ సంస్థ ప్రతినిధులు ఎం.సచిన్, ఏవీఎస్ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు.