ఫ్యూజన్ ఫుడ్స్ అరాచకాలకు కాలం చెల్లింది..వేలంపాట లేకుండా అప్పనంగా ఇంతవరకూ కాలం గడిపిన ఆ రెస్టారెంట్ ను అదే వేలం పాట నిబంధనలతో ప్రభుత్వం ఆదివారం ఖాళీచేయించింది..అంతేకాదు అక్రమంగా ఎవరు వ్యవహరించినా ఇదే పరిస్థితి వస్తుందనే సంకేతాలు కూడా ఇచ్చారు వుడా అధికారులు...విశాఖలో వీఎంఆర్డీఏ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ను అధికారులు ఖాళీ చేయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడేళ్ల వరకు మాత్రమే లీజు కొనసాగించాల్సి ఉన్నప్పటికీ దశాబ్దాల కాలంగా ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ వీఎంఆర్డీఏ స్థానంలోనే అలాగే కొనసాగుతూ వచ్చేసింది.. 2015 నుంచి 24 వరకు అనుమతులు ఇస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. వాస్తవానికి మూడేళ్లపాటు మాత్రమే అనుమతి ఇవ్వడమే కాక ఆ తర్వాత కొనసాగించాలంటే వేలంపాట వేయాల్సి ఉంది. కానీ ఈ నిబంధనలు పాటించకుండానే తొమ్మిదేళ్ల పాటు తాజాగా అనుమతులు పొంది ఫ్యూజన్ ఫుడ్స్ కొనసాగుతోందన్న ఫిర్యాదుపై వీఎంఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకున్నారు. సామాగ్రిని యజమానికి అప్పగించి ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అతి సన్నిహితుడిగా పేరొందిన హర్ష కుమార్ ఈ ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ నిర్వాహకుడు కావడం విశేషం. ఆ కారణంగానే ఎలాంటి వేలం పాట లేకుండా మూడేళ్లకు ఒకసారి నిర్వహాంచాల్సిన వేలం పాటకూడా పెట్టకుండా 2024 గడువున్నా అధికారులు మాత్రం పాత నిబంధనల ఆధారంగా ఫ్యూజన్ ఫుడ్స్ ను ఖాళీ చేయించారు. ఇక్కడ విశేషం ఏంటంటే సిరిపురం జంక్షన్ వద్ద ఉడా నుంచి లీజుకు తీసుకున్న ఆస్తిని టీడీపీ నేత హర్ష రెండింతల అద్దెకు మరొకరికి ఇవ్వడమే. అంటే ఇక్కడ ప్రభుత్వం ఎంత ఆదాయం కోల్పోతుందో అర్ధమవుతుంది. దీంతో అక్రమ లీజుపై ఉక్కుపాదం మోపిన అధికారులు లీజుదారుడిని ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఈ విషయం విశాఖలో హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాకుండి వుడా నిర్వహించే మిగిలిన షాపుల లీజులను కూడా ప్రభుత్వం మరోసారి తనిఖీలు చేపడుతోంది. ఇలానే మిగిలిన షాపుల్లో కూడా అక్రమాలు జరిగితే వాటిని కూడా ఖాళీ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది..
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు వెమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పార్లమెంటు సభ్యులు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి వస్త్రాలను శనివారం విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకులు, వేద పారాయణదారులు, పోటు కార్మికులు కలిపి మొత్తం 1200 మందికి ఈ వస్త్రాలను అందజేశారు. దీపావళి పర్వదినం రోజున తిరుమలలోని అర్చక నిలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టిటిడి ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను బంగారువాకిలి చెంత నిర్వహించారు. శ్రీ మలయప్పస్వామి, అమ్మవార్ల, విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించారు. స్వామి ,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పార మంగళహారతులు సమర్పించి ప్రసాద నివేదనలు అర్చకస్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు. నూతన పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్టుకు, దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. దీనితో దీపావళి ఆస్థానం పూర్తిఅయినది.అనంతరం తీర్థ, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు. ఈ ఆస్థానంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్, టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బా రెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మా రెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి, డా.నిశ్చిత, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జర్నలిస్టులందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. దీపాల పండుగ దీపావళి సరికొత్త కాంతులను ప్రసరించి చీకటిని పారద్రోలి సరికొత్త కాంతుల జీవితాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. దీపావళి వెలుగులలో కరోనా వైరస్ రక్కసి పూర్తిగా నశించి దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ నూతన అధ్యయనం ప్రారంభం కావాలని గంట్ల ఆశించారు. కరోనా వ్యాప్తి నివారణకు మాస్కే రక్షణ కవచం అని ప్రతి ఒక్క జర్నలిస్టూ గుర్తెరగాలని కోరారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు, చైతన్యాన్ని జర్నలిస్టులు పెద్ద ఎత్తున సహకరించారని, వచ్చే మూడు నెలల కాలంపాటు అదే సహకారం కొనసాగించి కరోనా రహిత రాష్ట్రంగా చేయుటకు నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. మాస్కు ధారణ, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ సబ్బుతోగాని, శానిటైజర్ తోగాని శుభ్రపరచుకోవడం అనే మూడు ప్రాథమిక సూత్రాలను పాటిద్దామని గంట్ల పేర్కొన్నారు. వ్యక్తిగత అనారోగ్యానికి గురికావద్దని, అదే సమయంలో కుటుంబంలో ఉన్న అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క, తాత, అమ్మమ్మ, నాన్నమ్మలకు కరోనా సోకకుండా ఆలోచించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుందాం ... దీపావళి కాంతుల్లో కరోనాను మట్టికరిపిద్దాం .... సరి కొత్త అధ్యయనానికి నాంది పలుకుదామని గంట్లశ్రీనుబాబు పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 13న జరగనున్న జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష ( NTSE ) కొరకు 10వ తరగతి విద్యార్ధులు ఈ నెల 20లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అన్ని గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్ధులే కాకుండా 18 సం.ల లోపు వయస్సు కలిగి దూరవిద్య ద్వారా మొదటిసారి 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులు కూడా ఈ పరీక్షకు అర్హులేనని ఆమె చెప్పారు. పూర్తి వివరాల కొరకు www.bseap.org వెబ్ సైట్ నందు లేదా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని ఆమె ఆ ప్రకటనలో వివరించారు. ఈ అవకాశాన్ని ఆశక్తి వున్న విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇలాంటి పరీక్షలు రాయడం ద్వారా రాబోయే రోజుల్లో పోటీపరీక్షలకు ప్రేరణగా వుంటుందని ఆమె వివరించారు.
తిరుపతిలోని శ్వేత భవనంతోపాటు టిటిడి ప్రాజెక్టులను జెఈవో(విద్య మరియు ఆరోగ్యం) సదా భార్గవి శుక్రవారం తనిఖీ చేశారు. శ్వేత భవనంలో కోవిడ్ - 19పై టిటిడి ఉద్యోగులకు జరుగుతున్న ఆన్ లైన్ అవగాహన తరగతులను పరిశీలించారు. ఆదేవిధంగా శ్వేత భవనంలో గల కేంద్రీయ గ్రంథాలయం మరియు పరిశోధనా కేంద్రం, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, ద్రవిడ వేద నాళాయిర దివ్యప్రబంధ పారాయణ పథకం, పురాణ ఇతిహాస ప్రాజెక్టు, శ్రీనివాస తెలుగు వాఙ్మయ అధ్యయన సంస్థ, దాస సాహిత్య ప్రాజెక్టు, శ్రీనివాస కల్యాణం మరియు ఎస్వీ వైభవోత్సవం ప్రాజెక్టులను తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లో కోవిడ్-19 నేపథ్యంలో అనుసరిస్తున్న విధి విధానాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. జెఈఓ వెంట ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య రాజగోపాలన్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు, శ్వేత సంచాలకులు డా. కె.రామాంజులరెడ్డి తదితరులు ఉన్నారు.
శ్రీకాకుళంజిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ జె నివాస్ దీపావళ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ జిల్లా ప్రజలు అందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. దీపాల పండుగ దీపావళి సరికొత్త కాంతులను ప్రసరించి చీకటిని పారద్రోలి సరికొత్త కాంతుల జీవితాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. దీపావళి వెలుగులలో కరోనా వైరస్ రక్కసి పూర్తిగా నశించి జిల్లాలో నూతన అధ్యయనం ప్రారంభం కావాలని కలెక్టర్ ఆశించారు. కరోనా వ్యాప్తి నివారణకు మాస్కే రక్షణ కవచం అని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని కోరారు. జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు పెద్ద ఎత్తున సహకరించారని, వచ్చే మూడు నెలల కాలంపాటు అదే సహకారం కొనసాగించి కరోనా రహిత జిల్లాగా చేయుటకు నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. మాస్కు ధారణ, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ సబ్బుతోగాని, శానిటైజర్ తోగాని శుభ్రపరచుకోవడం అనే మూడు ప్రాథమిక సూత్రాలను పాటిద్దామని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించామని – విద్యార్ధులు ఉన్నతంగా ఆలోచించి వైరస్ వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యక్తిగత అనారోగ్యానికి గురికావద్దని, అదే సమయంలో కుటుంబంలో ఉన్న అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క, తాత, అమ్మమ్మ, నాన్నమ్మలకు కరోనా సోకకుండా ఆలోచించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుందాం ... దీపావళి కాంతుల్లో కరోనాను మట్టికరిపిద్దాం .... సరి కొత్త అధ్యయనానికి నాంది పలుకుదాం ... అని కలెక్టర్ పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన మంత్రి సంపద యోజన పథకం (PMMSY) కోసం అర్హులైన వారు ఈ నెల 15లోగా APCFSS నవశకం వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని, మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు పి.వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2020-21 నుండి ఐదేళ్ల వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 20 వేల 50 కోట్లు కేటాయించగా, అందులో ఈ ఏడాది జిల్లాకు రూ.7.37 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ పథకం క్రింద ఉప్పినీటి బయో ఫ్లాక్ చెరువుల నిర్మాణం, రిజర్వాయర్లలో చేపపిల్లల స్టాకింగ్, సముద్ర జలాల్లో నది ముఖద్వారాల వద్ద పంజారాలు, ఐస్ పెట్టెతో సహా మోటార్ సైకిళ్లు, అక్వాలో వ్యాధి నిర్ధారణ పరీక్ష, సంచార లేబరేటీరీలు, అక్వాక్లినిక్, కొత్త బోట్లు, వలలు, బ్రతికియున్న చేపల విక్రయ కేంద్రాలు, ఇన్సులేటెడ్ వాహనాలు, చేపల అమ్మకానికి ఐసు పెట్టెతో సహా ఆటోలు, ఇ-రిక్షాలు, రిటైలు చేపల మార్కెట్ నిర్మాణము వంటి యూనిట్లను స్థాపించుకోవచ్చని తెలిపారు. ఇతరులకు యూనిట్ ఖరీదులో 60 శాతం లబ్దిదారుని వాటా కాగా 40 శాతం రాయితీ ఉంటుందని చెప్పారు. షెడ్యూలు కులాలు మరియు తెగలకు చెందిన మహిళలు 40 శాతం లబ్ధిదారుని వాటా కాగా 60శాతం రాయితీ లభిస్తుందని ఆయన వివరించారు. కావున ఆసక్తి గల అర్హులైన వారందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉప్పినీటి బయో ఫ్లాక్ చెరువుల నిర్మాణం సాగు యూనిట్ ఖరీదు రూ.18 లక్షలు కాగా, రిజర్వాయర్లలలో చేపపిల్లల స్టాకింగ్ యూనిట్ ఖరీదు రూ.3 లక్షలని చెప్పారు. సముద్ర జలాల్లో నది ముఖద్వారాల వద్ద పంజారాలు(కేజెస్) యూనిట్ విలువ రూ.5 లక్షలని, రిజర్వాయర్లలో పంజారాలు (కేజెస్) యూనిట్ విలువ రూ.3లక్షలుగా ఉంటుందని తెలిపారు. ఐస్ పెట్టెతో సహా మోటార్ సైకిళ్లు యూనిట్ విలువ రూ.75వేలు, ఆక్వాలో వ్యాధినిర్దారణ పరీక్ష సంచార లేబరేటీరీ/ఆక్వా క్లీనిక్ యూనిట్ విలువ రూ.35 లక్షలుగా ఉంటుందని చెప్పారు. పాత బోటుల స్థానములో కొత్త బోటుల వలల యూనిట్ విలువ రూ.5 లక్షలు కాగా, బ్రతికియున్న చేపల విక్రయ కేంద్రాల యూనిట్ ఖరీదు రూ.20 లక్షలని అన్నారు. ఇన్సులేటెడ్ వాహనాల యూనిట్ ఖరీదు రూ. 20 లక్షలని, చేపల అమ్మకానికి ఐస్ పెట్టెతో సహా ఆటోలు,ఇ-రిక్షాల యూనిట్ ఖరీదు రూ. 3 లక్షలుగా పేర్కొన్నారు. రిటైలు చేపల మార్కెట్ల (హబ్) నిర్మాణం కోసం యూనిట్ ఖరీదు రూ. 100 లక్షలు కాగా, చేపల దుకాణాల (కీయాస్క్) నిర్మాణం కోసం యూనిట్ ఖరీదు రూ. 10లక్షలుగా ఉంటుందని అన్నారు. చేపల అదనపు విలువ జోడించే వ్యాపార కేంద్రాల యూనిట్ ఖరీదు రూ. 50 లక్షలని, ప్రతీ యూనిట్ లబ్ధిదారుల వాటాను బ్యాంకు నుండి రుణంగా పొందవచ్చని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.
దరఖాస్తుదారులు ఆక్వా, మత్స్య రంగమునకు చెందినవారై, తగు శిక్షణ పొంది మంచి నైపుణ్యం కలిగిన వారై యుండాలని అన్నారు. యూనిట్ల మంజూరు కొరకు దరఖాస్తుదారులు 2020 నవంబరు 15వ తేదీలోగా తమ దరఖాస్తులను APCFSS నవశకం వెబ్ సైట్ నందు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఆన్ లైన్ లో దాఖలు చేసుకోవాలని పేర్కొన్నారు. ఫొటోతో కూడిన దరఖాస్తుతో పాటు, వారు కోరు పథకంలోని లబ్ధిదారుల వాటా సొమ్ముకు సంబంధించి బ్యాంకు రుణ మంజూరు పత్రం లేదా బ్యాంకు ఖాతా నందు లబ్ధిదారుని వాటాకు సరిపడు సొమ్ము కలిగియున్న పాసు పుస్తకము, ఇతర అనుమతులు, అవసరమైన పత్రాలు, ప్రోజెక్టు రిపోర్టులు ఆన్ లైనులో అప్ లోడ్ చేయవలసి ఉంటుందని చెప్పారు. ఈ విధముగా అప్లోడ్ చేయబడిన దరఖాస్తులు వివరములను జిల్లా స్థాయి కమిటీ వారు పరిశీలించి ఎంపిక చేయడం జరుగుతుందని, తగిన పత్రాలు లేని దరఖాస్తులు తిరస్కరించబడతాయని ఆయన స్పష్టం చేసారు.జిల్లా స్థాయి కమిటీలో ఎంపిక కాబడిన వెంటనే దరఖాస్తుదారులకు జిల్లా మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని, రూ.50లక్షలకు పైబడిన యూనిట్ల మంజూరుకు రాష్ట్ర స్థాయి కమిటీ వారి ఆమోదం పొందవలసి ఉంటుందని తెలిపారు. ఈ పథకాలు 2021 మార్చి 31లోగా అమలుకావలసి ఉందని ఆయన వివరించారు.
ఆయనను చూస్తే ఎవరూ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అనుకోరు.. ఎవరినోట విన్నా ఆయన ఇండియన్ పీపుల్ సర్వీస్ ఆఫీసర్(దాన గుణ సేవకుడు) అంటారు..ఆ స్థాయిలో ఆ ఐపీఎస్ వ్యవహార శైలి వుంటుంది.. పోలీసు అధికారుల్లో ఐపీఎస్ అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు ఎప్పుడూ చాలా బిజీగా ఉంటారు...కానీ చిత్తూరు జిల్లా తిరుపతి అర్భన్ ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి అలా కాదు.. ఆయనను చూస్తే ఎవరికైనా స్నేహభావం మనసులో ఉద్బవిస్తుంది...ఐపీఎస్ ల్లో కూడా ఇంత మంచి అధికారులు ఉంటారా అనిపిస్తుంది..అంతలా ఆయన సేవా కార్యక్రమాలు చేపడతారు..ఆయన మంచి మనసుకి ఆయన సతీమణి కూడా తోడవడంతో ఆయన నిరుపమాన సేవలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా శుక్రవారం దీపావళి సందర్భంగా “పాస్ మనోవికాస్” ఆశ్రమానికి రూ.వేలు ఆర్ధిక సహాయం చేసి, అక్కడ అనాధపిల్లలతో కుటుంబ సభ్యులతో చాలా సరదగా గడిపారు. ఆయకొచ్చే జీతంలో సగభాగం నిరుపేదల సేవలకే వెచ్చిస్తున్నారంటే ఈ అధికారి దాన గుణం ఎలాంటిదో వర్ణించడానికి మాటలే చాలవు. సంస్థ నిర్వాహకులకు ఆర్ధిక సహాయంతోపాటు ఆశ్రమంలో ఉన్న వారి కోసం బియ్యపు బస్తాలు (10), టవళ్ళు, పండ్లు, పలహారాలు, దీపావళి గిఫ్ట్ పాకెట్స్ మొదలగు వాటిని “లక్షయ ఫర్ నీడ్” టీం వారితో కలసి అందించారు. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా, ఏ అవసరం వచ్చినా తనను కలవాలని నా శక్తి మేర సహకారం అందిస్తానని నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ఇంతటి సహాయం చేసిన రమేష్ రెడ్డి సేవలు ఎప్పుడూ రాష్ట్రంలో మార్గదర్శిగానే మారుతుంటాయి. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రీన్ టపాసులతో దీపావళి జరుపుకోవాలని, పండుగ రోజు రాత్రి 8 గం. నుంచి 10 గం. మధ్య బాణాసంచా కాల్చుతూ పండుగను జాగ్రత్తగా జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు కోవిడ్ నుండి కోలుకున్న రోగులకు పొగ కాలుష్యం వల్ల ఇబ్బందులు కల్గకూడదని వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు దీపావళి జరుపుకోవాలన్నారు. పర్యావరణాన్ని కూడా పరిరక్షించే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ముఖ్యంగా బాణసంచా కాల్చేవారు, దీపాలు వెలిగించే మహిళలూ శానిటైజర్ కు దూరంగా ఉండాలన్నారు. శానిటైజర్ లోని ఆల్కహాల్ వల్ల అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున బదులుగా సబ్బు వాడాలని కోరారు. ప్రజలంతా దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని, ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగునింపాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
చిత్తూరు జిల్లాలో రెండురోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. తిరుపతి అర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, రేణిగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఎయిర్ పోర్ట్ డిప్యూటీ కమాండెంట్ శుక్లా, బిజెపి నాయకులు భానుప్రకాష్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, కోలా ఆనంద్, సామంచి శ్రీనివాస్, సైకం జయచంద్రారెడ్డి, జల్లి మధుసూదన్, అజయ్ కుమార్, కాసరం రమేష్, రేణిగుంట డీఎస్పీ చంద్రశేఖర్, టర్మీనల్ మేనేజర్ లు గోపాల్, శ్యామ్, సి ఐ ఎస్ ఎఫ్ అధికారి భాస్కరరావు, ఆర్.ఐ.జీవన్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రెండు రోజులు తన కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం తిరిగి హైదరాబాదుకి తిరుగు ప్రయాణం అవుతారని అధికార వర్గాలు తెలియజేశాయి..
అనంతపురం జిల్లాలో కరోనా సమయంలో కష్టపడి పని చేసిన వారిని సన్మానించేందుకోసం 'యోధులకు వందనం' కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో 'యోధులకు వందనం' పేరుతో కరోనా సమయంలో కష్టపడి పని చేసిన వారిని సన్మానించేందుకోసం జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కరోనా సమయంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు, అధికారులు, సిబ్బంది రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మానవాళి మనుగడ మొదలయినప్పటి నుంచి అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, సమస్యల కు వ్యతిరేకంగా పోరాడి బ్రతికి బయటపడ్డామని, అందులో కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఛాలెంజ్ గా తీసుకుని కరోనాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రజా ప్రతినిధులు, ఆర్డీటీ, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, ఇతర స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, అధికారులు అంతా జిల్లాను కరోనా నుంచి బయటపడేసేందుకు చాలా కష్టపడి పని చేశారన్నారు. జిల్లాలో కరోనా వచ్చిన మొదట్లో మాస్కులు, పిపి ఈ కిట్లు కూడా లేవని, ఒక టెస్టింగ్ కూడా చేయలేని, ఒక ల్యాబ్ లేని పరిస్థితి ఉండేదని, అలాంటి పరిస్థితి నుంచి మనమే సొంతంగా మాస్కులు తయారు చేసుకోవడం, పిపి ఈ కిట్లు సమృద్ధిగా ఏర్పాటు చేసుకోవడం, ఒక టెస్టు చేయలేని పరిస్థితి నుంచి రోజుకు 10,000 టెస్టులు చేసే పరిస్థితికి ఎదిగమన్నారు. జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని సిద్ధం చేసుకోగలిగామని, జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలలో సదుపాయాలు, ఆక్సిజన్ సప్లై, అవసరమైన సిబ్బంది నియామకం చేసుకున్నామన్నారు.
అన్ని విధాలుగా మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసుకుంటూ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం : అన్ని విధాలుగా మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసుకుంటూ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో చాలావరకు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. కరోనా ను ఎదుర్కోవడంలో రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్, పోలీస్, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది ప్రతి శాఖ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించారన్నారు. కరోనా సమయంలో కష్టపడి పనిచేసిన వారందరికీ మనం సన్మానించాల్సిన అవసరం ఉందని, కరోనా నేపథ్యంలో అందరూ బాగా పని చేసినా అందులో కొంతమందిని ఆయా శాఖల తరపున సన్మానిస్తున్నట్లు తెలిపారు. కరోనా వచ్చిన ప్రారంభంలో పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉండేదని, అటువంటి పరిస్థితి నుంచి ఛాలెంజ్ గా తీసుకుని అనంతపురం జిల్లా మిగతా జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు, దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.
స్వయం సహాయక సంఘాల ద్వారా మాస్క్ లను కుట్టించడం మన జిల్లాలోనే మొదలుపెట్టామని, దానిని ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మూడు మాస్క్ లు ఇవ్వాలని చెప్పి రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించారన్నారు. కరోనా వచ్చిన పాజిటివ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఆస్పత్రిలో ఉన్న సమయంలో పాజిటివ్ రోగులు అనరాదని వారిని కరోనా పాజిటివ్ వచ్చిన వారిగా పిలవాలని చెప్పామని, పాజిటివ్ వచ్చిన వారికి ప్రశాంతత కోసం మన జిల్లాలోనే ముందుగా యోగా, స్పోర్ట్స్, మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోనా వచ్చిన వారు ఆస్పత్రులలో ఉంటె వారి వద్దకు వెళ్లి ధైర్యం నింపే కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. ఎన్జీవోల సహాయంతో ఫుడ్ సెంటర్లను ఏర్పాటు చేసి వర్కర్లకు, బీదవారికి, వలసకూలీలకు 15 లక్షల భోజనాల అందజేయడం లాంటి సదుపాయం కల్పించామన్నారు. కరోనాపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కరోనా సమయంలో ఉపాధి లేకపోగా, ఉపాధి హామీ పథకం కింద ఎక్కువమందికి పని కల్పించి దాదాపు 15 కోట్ల రూపాయలను ప్రతినిత్యం కూలీలకు అందజేయడం జరిగిందన్నారు. అలాగే ఉద్యాన ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఇబ్బంది ఉన్న సమయంలో జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు పండ్ల ఉత్పత్తుల రవాణా కోసం కిసాన్ రైలు తీసుకువచ్చి రైతులకు మేలు చేయడం జరిగిందన్నారు. కరోనా నేపథ్యంలో ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు ఆదర్శంగా పని చేయడం జరిగిందన్నారు. అలాగే పని చేసిన వారికి గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతివారం స్ఫూర్తి అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు.
కరోనా సమయంలో కష్టపడి పనిచేసిన వారి యొక్క శ్రమను గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకోసమే యోధులకు వందనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కింది స్థాయిలో అట్టడుగున ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్, వి ఆర్ ఓ, కానిస్టేబుల్, పంచాయతీ సెక్రెటరీ, వాలంటీర్, ఆశావర్కర్లు, ఏ ఎన్ఎంలు ఇలా ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న వారి కోసం యోధులకు వందనం ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఏ కుటుంబంలో అయితే వారి ఆప్తులను కోల్పోయారో వారికి ఆర్థిక స్వాంతన ఇవ్వడానికి ఆర్థిక సహాయం ఏర్పాటు చేశామని, దాతల ద్వారా ఒక కుటుంబానికి 50 వేల రూపాయల చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. జిల్లాలో డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలో కూడా ఆర్థిక సహాయం అందించేలా చూస్తున్నామని తెలిపారు. కరోనా అన్నది పూర్తిగా సమసిపోలేదని, ప్రజలందరూ ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మనల్ని మనం ఉత్తేజం పొందడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలలో యోధులకు వందనం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం మనలో మరింత స్ఫూర్తిని నింపాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2500 మందికి యోధులకు వందనం కార్యక్రమంలో సన్మానించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, వైద్య శాఖ, పారిశుద్ద్య సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పోలీసు శాఖ నుంచి పలువురు కరోనా సమయంలో వారు ఎదుర్కొన్న అనుభవాలు తెలియజేశారు.
అనంతరం కరోనాతో మరణించిన కుటుంబాల సభ్యులకు ఐదు మందికి ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చొప్పున చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు. తదనంతరం స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులైన ఆర్డిటి ఈడి అన్నే ఫెర్రర్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ రత్నాకర్ తరఫున డైరెక్టర్ గురుమూర్తి, ఆర్డీటీ ఏకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి, సెంటర్ ఫర్ రూరల్ స్టడీస్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ సత్యబాబు బోస్, అనంతపురం సాయి ట్రస్ట్ డైరెక్టర్ విజయ్ సాయి కుమార్ లకు శాలువా కప్పి ప్రశంసా పత్రంలను జిల్లా కలెక్టర్ అందజేశారు. అలాగే వైద్య శాఖ సిబ్బంది, పారిశుద్ద్య కార్మికులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పోలీసు శాఖ నుంచి ఎంపిక చేసి వారికి జిల్లా కలెక్టర్ శాలువా కప్పి ప్రశంసా పత్రం, డ్రెస్ మెటీరియల్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, డిఆర్ఓ గాయత్రి దేవి, డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో శోభా స్వరూపారాణి, డి పి ఓ పార్వతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గ్రంధాలయాలు భవిష్యత్ తరాల అవసరాలను తీర్చే దిశగా పనిచేయాలని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. ఏయూ డాక్టర్ వి.ఎస్ క్రిష్ణా గ్రంధాలయంలో నిర్వహించిన గ్రంధాలయ వారోత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా వీసీ ఆన్లైన్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆకాంక్షలు, అవసరాలు గుర్తించి తదనుగుణంగా గ్రంధాలయాలు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏయూ గ్రంధాలయం ఎందరో విద్యావంతులను, నిపుణులను తీర్చిదిద్దిందన్నారు. వీరంతా దేశ విదేశాలలో స్థిరపడ్డాన్నారు. నేటి తరం యువత పుస్తకాన్ని పక్కనపెట్టి ఫేస్బుక్కు అంకితమైపోతున్నారన్నారు. డిజిటల్ లైబ్రరీలు, పుస్తకాల డిజిటలైజేషన్ ఎంతో కీలకమన్నారు. విద్యార్థులు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు తమకు అవసరమైన సమాచారాన్ని పొందే అవకాశం ఉండాలన్నారు. గ్రంధాలయాధికారి ఆచార్య కె.విశ్వేస్వర రావు మాట్లాడుతూ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ప్రాధాన్యతను వివరించారు. వారోత్సవాలలో భాగంగా ఆన్లైన్లో వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఆన్లైన్ సదస్సులో గ్రంధాలయ సిబ్బంది మాధవరావు, రమాదేవి, హైమావతి, రామలక్ష్మి, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.
విశాఖ వికాసానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. శుక్రవారం బీచ్ రోడ్డులో నిర్వహించిన వుయ్ సపోర్ట్ వైజాగ్ వాకథాన్లో ఆయన పాల్గొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రానికి ఆర్ధిక రాజధానిగా విశాఖ నగరం నిలుస్తుందని ఆయన అన్నారు. పెద్దసంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకుల వాట్సాప్ గ్రూప్ ‘వాక్ విత్ జగన్ గ్రూప్’ సభ్యులు ఎం.పి. విజయ సాయి రెడ్డికి స్వాగతం పలికి ఆయనతో కలసి వాకథాన్లో పాల్గొన్నారు. అనంతరం వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ విశాఖ అభివృద్ధిని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. పరిశుభ్ర, ప్రశాంత విశాఖను నిర్మించే దిశగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. పరిపాలనా రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దడంలో యువత భాగం కావాలన్నారు. భవిష్యత్తులో నిర్వహించే బీచ్ క్లీనింగ్, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలలో ఏయూ జాతీయ సేవా పథకం వలంటీర్లు ముఖ్యభూమిక పోషిస్తారన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి విశాఖ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ఆయన దార్శినిక నిర్ణయాలు భవిష్యత్తులో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుతాయన్నారు. ఏయూ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకుల బృందం గతంలో 2018 సంవత్సరంలో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో ఇంజనీర్స్డే వేడుకలను పురస్కరించుకుని వై.ఎస్ జగన్ మోహన రెడ్డి గారితో యాత్రలో కలసి పాల్గొన్నారు. అదే బృందం నేడు వాకథాన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు.కార్యక్రమంలో వర్సిటీ పాలక మండలి సభ్యులు జేమ్స్ స్టీఫెన్ , డీన్ ఆచార్య టి.షారోన్ రాజు తదితరులు పాల్గొన్నారు.