రాష్ట్ర ప్రభుత్వ నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టే ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రి సేకరణకు మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని.. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఉదయం కలెక్టరేట్లోని కోర్టుహాల్లో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరితో కలిసి కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి.. ఇళ్ల నిర్మాణ సామగ్రి సేకరణపై జిల్లా స్థాయిలో ఏర్పాటైన టెండర్ కమిటీ (డీఎల్టీసీ) సమావేశం నిర్వహించారు. 40 ఎంఎం, 20 ఎంఎం హెచ్బీజీ మెటల్, కాల్చిన మట్టి ఇటుకలు, ఫాల్-జీ ఇటుకలు, ఆర్సీసీ రింగ్ వెల్స్, కవర్స్ తదితర సామగ్రి సరఫరాకు ఇప్పటి వరకు చేపట్టిన టెండర్ ప్రక్రియ, బిడ్డర్ల వివరాలు, కోట్ చేసిన మొత్తాలపై చర్చించారు. సామగ్రి సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేయాలని కలెక్టర్.. సూచించారు. ఈ ప్రక్రియపై తహశీల్దార్లు, ఎంపీడీవోలకు అవసరమైన సూచనలు ఇవ్వాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు జరిగే లేఅవుట్లలోనే నిర్మాణ సామగ్రి తయారీ జరిగేలా ఆయా యూనిట్ల యాజమాన్యాలతో మాట్లాడాలని సూచించారు. దీనికి సమాంతరంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలతో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే ఔత్సాహికులతోనూ సమావేశాలు నిర్వహించాలని పరిశ్రమల శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ చర్యల వల్ల తక్కువ ధరకు అత్యంత నాణ్యమైన సామగ్రి అందుబాటులోకి వస్తుందన్నారు. యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన స్థలం కేటాయింపు వంటి ఏర్పాట్లపై దృష్టిసారించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ జి.వీరేశ్వర ప్రసాద్, గ్రామీణ నీటి సరఫరా సూపరింటెండింగ్ ఇంజనీర్ టి.గ్రాయత్రీదేవి, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, లేబర్, మైన్స్ అండ్ జియాలజీ, ఏపీఎస్హెచ్సీఎల్ విభాగాలకు చెందిన అధికారులు హాజరయ్యారు.
తూర్పుగోదావరి జిల్లాలో అక్వా అనుమతుల కొరకు అందిన అర్హమైన ధరఖాస్తులపై మండల స్థాయి కమిటీలు త్వరితగతిన పరిశీలన పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టు హాలులో అక్వా రంగ అనుమతుల జారీపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో నిబంధనలను పాటిస్తూ అన్ని అర్హతలు కలిగిన 118 అక్వా ధరఖాస్తులకు కమిటీ ఆమోదించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో 884 ధరఖాస్తులు ఇంకా పెండింగ్ ఉన్నాయని, వీటిని మండల కమీటీల్లోని వ్యవసాయ, మత్స్య, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పరిశీలన సత్వరం పూర్తి చేసి జిల్లా కమిటీ ఆమోదానికి పంపాలని ఆదేశించారు. అక్వా చట్టాలు, నిబంధనలు, అనుమతుల జారీ విధివిధానాలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అమలాపురంలో వర్కుషాపు నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మిశ, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, మత్యశాఖ జెడి పి.వి.సత్యన్నారాయణ, జడ్పి సిఈఓ ఎన్ వివి సత్యన్నారాయణ,వ్యవసాయ శాఖ జెడి కె.వి.ఎస్.ప్రసాద్, డిడి రామారావు, పర్యావరణ ఇంజనీరు ఎ.రామారావు నాయుడు, గ్రౌండ్ వాటర్ డిడి పి.ఎస్.విజయ కుమార్, కమిటీ సభ్యులు సిహెచ్.వి.సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో జరగునున్న పంచాయతీ ఎన్నికలు పోలింగుతో పాటు కౌంటింగు నిర్వహణ లో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని జిల్లా కలక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలక్టరు మాట్లాడుతూ 9వ తేదీన అనకాపల్లి, 13 తేదీన నర్సీపట్నం డివిజన్లలో జరుగనున్న ఎన్నిక ప్రక్రియలో అధికారులు, సిబ్బంది ప్రణాళికాయుతంగా, నిబంధనల ప్రకారం విధులను నిర్వహించాలన్నారు. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు గావించాలన్నారు. పోలింగు కేంద్రాలలో అవసరమైన మౌళిక సదుపాయాలు ఫర్నిచర్, కరెంటు, శానిటేషను, మంచినీరు, మెడికల్ కిట్స్, బోజన సదుపాయాలు తదితర ఏర్పాట్లను నోడల్ అధికారులు తనిఖీ చేయాలన్నారు. పోలింగు అధికారులు, సహాయ పోలింగు అధికారుల రేండమైజేషను నిర్వహించాలని తెలిపారు. అన్ని మండలాలకు ఓటర్ల లిస్టులను పంపించాలని, పోస్టల్ బ్యాలెట్ బట్వాడా చేయాలని తెలిపారు. ఈ విషయంలో జిల్లా పరిషత్, ముఖ్యనిర్వహణాధికారి మండల అభివృద్ది అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అవసరమైన ఏర్పాట్లు చెయ్యాలని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు,, సిబ్బంది హాజరు, రిజర్వ్ సిబ్బంది ఏర్పాటుపై చర్చించారు. నోడల్ అధికారులు వారికి కేటాయించిన అంశాలపైన, ఎన్నికలకు సంబంధించి ప్రతి పోలింగు స్టేషనుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిగావించాలని, ఈ విషయంలో ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా తగుచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు స్పష్టంచేసారు. ప్రతి పోలింగు స్టేషనులో మౌళిక సదుపాయాలు కల్పించాలని, అభ్యర్థుల లిస్టు, ఓటరు లిస్టు, పోలింగు ఏరియా వివరాలు ప్రదర్శించాలని తెలిపారు. పోలింగు మెటీరియల్ ను మండలంలో సబ్-ట్రెజరీలో భద్రపరచాలని ఈ విషయంపై ట్రెజరీ డిపార్టుమెంటు ఉప సంచాలకులతో చర్చించి ఏర్పాట్లు చేయాలని, సబ్-ట్రెజరీ వారీ మ్యాపింగు చేయాలన్నారు. పోలింగు సిబ్బంది, మెటీరియల్ రవాణాకు అవసరమైన ఏర్పాట్లపై డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమీషనరు, ఆర్.టి.సి.రీజనల్ మేనేజరును వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి అందిస్తున్న రెండవ విడత శిక్షణలో ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాలను విశదీకరించాలన్నారు.
సచివాలయ సిబ్బందిని సేవలను వినియోగించుకోవాలన్నారు. అందుకు గాను మండల అభివృద్ది అధికారులకు సర్కులర్ జారీ చేయాలని తెలిపారు. కౌంటింగు పూర్తి అయిన పిదప రిటర్నింగు అధికారి సంతకం తో గెలుపొందిన సర్పంచ్, మెంబర్స్ కు ధృవపత్రం జారీచేయాలని తదుపరి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని తెలిపారు. స్టేజ్-1, స్టేజ్-2 రిసెప్షన్ కౌంటర్స్ ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన సిబ్బంది, మెటీరియల్ సిద్దం చేసుకోవాలని అన్నారు. పారదర్శకత కొరకు వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ లను నియమించాలన్నారు. సున్నిత, అతి సున్నిత పోలింగు కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్ ను తప్పక నియమించాలని అన్నారు.
పోలింగు సిబ్బంది, భద్రతా సిబ్బంది కలిసే విధులకు వెళ్లాలని, బస్సులు వెళ్లని ప్రాంతాలకు చిన్నవాహనాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టరు రవాణా శాఖ అధికారుల ను ఆదేశించారు. మద్యం అమ్మకాలు, బెల్టుషాపులు, దొంగసారా నియంత్రణకు చర్యలుతీసుకోవలసినదిగా ఎక్సయిజ్ సూపరిండెంట్ కు, పోలింగురోజుల విద్యుత్ అంతరాయం కలుగకుండా చూడాలని ఎలక్టికల్ సూపరింటెండెంట్ ఇంజనీరుకు, పోలింగు కేంద్రాలను అవసరమైన మందులు, పి.పి.ఇ.కిట్లు, పంపవలసినదిగా జిల్లా వైద్యఆరోగ్యశాధికారికి ఆదేశించారు. మరుగుదొడ్లు లేని పోలింగు కేంద్రాలలో తాత్కాలిక ఏర్పాట్లు చేయవలసినదిగా సంబంధిత అధికారులను అదేశించారు.
ఎన్నికల సిబ్బందికి అవసరమైన బోజన ఏర్పాట్లు చేయాలని, పోలింగు స్టేషనుకు 200 మీటర్ల లోపు ఎటువంటి ప్రచారం కార్యక్రమాలు చేపట్టకుండా చూడాలని అదికారులకు జిల్లా కలక్టరు అదేశించారు. జాయింటు కలెక్టరు ఎం.వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అనకాపల్లి డివిజనులో 78 హైపర్ సెన్సిటివ్, 104 సెన్సిటివ్ పోలింగు స్టేషన్లు ఉన్నాయని వెబ్ కాస్టింగ్, వీడియో గ్రాఫర్, మైక్రో అబ్జర్వర్ లను నియమించినట్లు, పోలీసు బందోబస్తు పెంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింటు కలక్టర్-2 అరుణ్ బాబు, జాయింటు కలెక్టరు (ఆసరా) గోవిందరావు, నోడల్ అధికార్లు హజరయ్యారు.
కేంద్ర బడ్జెట్లో మౌళిక వసతుల కల్పనకు అధిక నిధులు కేటాయించారని ఇది శుభ పరిణామమని ఆర్జియుకెటి చాన్సలర్ ఆచార్య కె.సి రెడ్డి అన్నారు. శనివారం ఉదయం ఏయూ అర్ధశాస్త్ర విభాగంలో కేంద్ర బడ్జెట్పై ఏర్పాటు చేసిన చర్చా వేదికలో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆచార్య కె.సి రెడ్డి మాట్లాడుతూ మౌళిక వసతుల కల్పనలో భాగంగా రహదారులు, పోర్టుల నిర్మాణాలు జరుగుతాయన్నారు. తద్వారా పెట్టుబడులు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు శుభ పరిణామమన్నారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ ఉత్పత్తులను ఎగుమతులు చేయడం, అదే సమయంలో విదేశీ వస్తువులను దిగుమతి చేసుకోవడం రెండూ జరగాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి, విద్య రంగాలపై సైతం కేంద్ర బడ్జెట్ దృష్టి పెట్టిందన్నారు. సాహసోపేతంగా ఈ బడ్జెట్ రూపకల్పన నిలచిందన్నారు. విశ్రాంత రెక్టార్ ఆచార్య ఏ.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ అసమానతలు తొలగిస్తూ, అవకాశాలు కల్పించే విధంగా బడ్జెట్ రూపకల్పనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు, యువతకు కేంద్ర బడ్జెట్ మరింత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. టాక్సులకు సంబంధించిన చట్టాలలో తరచూ మార్పులు చేయవద్దని సూచించారు. అర్ధశాస్త్ర విభాగాధిపతి ఆచార్య ఎం.ప్రసాద రావు మాట్లాడుతూ దేశ ఆర్ధిక రంగం మెల్లగా పుంజుకుంటోందన్నారు. ఉపాధి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఆచార్యులు సి.సాంబ మూర్తి, చార్టెడ్ అకౌంటెంట్ ఆకుల చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణాజిల్లా, గన్నవరం(మం), సూరంపల్లి లో ఉన్న భారత ప్రభుత్వ సంస్థ Central Institute of Petrochemicals Engineering & Technology (CIPET) కళాశాలలో SC నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనతో కూడిన ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు మేనేజర్ (ప్రాజెక్ట్) & హెడ్ చింతా శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఈయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ రంగంలో 6 నెలల పాటు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణను భోజన, వసతి సదుపాయాలతో అందించి ప్లాస్టిక్స్, అనుబంధ సంస్థలలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలను, Apron, Safety Shoes, Training Kit లను CIPET అందిస్తామన్నారు. 6 నెలల శిక్షణకు గాను నెలకు రూ.500/- చొప్పున మొత్తం రూ. 3,000/- ప్రోత్సాహక స్టయిపెండ్ అందిస్తామని తెలిపారు. 18 – 30 సం.లు. మధ్య వయస్సు కలిగి, 10 వ తరగతి/ I.T.I. / Diploma పాస్ (లేక) ఫెయిల్ విద్యార్హత గల నిరుద్యోగ SC యువత ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతపురం జిల్లాలో CIPET ప్రతినిధి ఆర్.శ్రీను February 08, 09 తేదీలలో నిరుద్యోగ యువతకు అందుబాటులో ఉంటారని వివరించారు. ఆసక్తి గల అభ్యర్ధులు 6300147965 నెంబరులో వారిని సంప్రదించి, పై శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణకు తుదిగా ఎంపికైనవారు వెంటనే విజయవాడలో CIPET కళాశాలకు రిపోర్ట్ చేయాలని చింతా శేఖర్ సూచించారు.
విజయనగరం జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా ఓటర్లకు ఫోటోతో కూడిన ఓటర్ స్లిప్పులను పంపిణి చేయడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. ఆయా గ్రామాల్లో పోలింగ్ కు ముందే గ్రామంలో పనిచేసే ప్రభుత్వ సిబ్బంది సహకారంతో పోలింగ్ కు ముందు రోజు వీటిని పంపిణి చేయనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ పంపిణీ చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీ వల్ల ఓటర్ తాను ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాల్సి వుంటుందో సులువుగా గుర్తిస్తారనీ, పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది కూడా ఓటర్ స్లిప్పు ఆధారంగా ఓటర్ జాబితా లో ఓటర్ పేరును, క్రమ సంఖ్య ను గుర్తించే అవకాశం ఉంటుందనీ పేర్కొన్నారు. అయితే ఫోటో ఓటర్ స్లిప్ తీసుకు వెళ్ళడం తప్పనిసరి కాదని, ఓటరు స్లిప్ లేకపోయినా ఫోటోతో కూడిన ఓటర్ గుర్తింపు కార్డు లేదా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన ఏదైనా గుర్తింపు కార్డు ఆధారంగా ఓటు వేసేందుకు అనుమతిస్తారనీ పేర్కొన్నారు. పోలింగ్ జరిగే రోజున కూడా ఓటర్లకు పోలింగ్ స్లిప్పులు జారీ కోసం ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.
శివరాత్రి సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామికి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆలయ ఈవో పెద్దిరాజు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, సివి ఎస్వో గోపీనాథ్ జెట్టీలను ఆహ్వానించారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఈవోపెద్దిరాజు వీరిని కలసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక, శ్రీ కాళహస్తీశ్వర స్వామి ప్రసాదాలు,క్యాలెండర్ ను అందించి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించి శాలువతో సత్కరించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు టిటిడి అధికారులను ఆహ్వానించడం ఆనవాయితీ వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా టిటిడి ముఖ్య అధికారులతోపాటు చైర్మన్ ను కూడా ఆహ్వానించినట్టు ఈఓ తెలియజేశారు.
అపోహలు వీడి ఆరోగ్యవంతులుగా ఉన్న ఫ్రంట్ లైన్ వర్కర్లు కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ కోరారు. శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా ప్రధాన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకోవడం జరిగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా మొదటి విడతలో హెల్త్ కేర్ వర్కర్లకు, రెండవ విడతలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రాధాన్యతా క్రమంలో జరుగుతుందని తెలిపారు. కోవిడ్ సమయంలో హెల్త్ కేర్ వర్కర్లు మరియు ఫ్రంట్ లైన్ వర్కర్ల సేవలను గుర్తించి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతున్నదని తెలిపారు. ఆరోగ్య సమస్యలు లేని హెల్త్ కేర్ వర్కర్లు మరియు ఫ్రంట్ లైన్ వర్కర్లు ఈ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెసి (అభివృద్ధి) వి.వీరబ్రహ్మం, డి ఎం అండ్ హెచ్ ఓ మరియు డి సి హెచ్ ఎస్ లు డా. పెంచలయ్య, డా. సరళమ్మ, హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. అరుణ్ కుమార్, అపోలో అడ్మినిస్ట్రేటర్ నరేష్ కుమార్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ డా. మహేష్, ఇతర డాక్టర్లు మరియు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులు రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు గరిష్ట పరిమితికి లోబడి మాత్రమే ఖర్చు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు అనంత శంకర్ (ఐఎఫ్ఎస్) తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వ్యయ పరిశీలకులుగా నియమితులైన అనంత శంకర్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ మరియు జిల్లా సమాచార కేంద్రాన్ని శుక్రవారం మధ్యాహ్నం సందర్శించి మండలాల వారీగా నియమింపబడిన మండల వ్యయ పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులందరూ తమ ఎన్నికల వ్యయాన్ని నిర్దేశించిన రేట్ల ప్రకారం స్క్రూటినికి సమర్పించాలన్నారు. లేని పక్షంలో తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులౌతారని ఆయన అన్నారు. ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్ధులు చేసే ఖర్చు పరిశీలనకు బృందాలనూ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అభ్యర్ధుల ఖర్చులకు సంబంధించి వివరాలను పేజీకి ఒక్క రూపాయి చొప్పున సంబంధిత రిటర్నింగ్ అధికారికి చెల్లించి ఎవరైనా పొందవచ్చన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురిచేయకుండా, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు అధికారులందరూ కృషి చేయాలన్నారు. ఓటర్లకు బహుమతులు, ఇతర ప్రలోభాలు పంచకుండా కమ్యూనిటీహాల్లు, కళ్యాణ మండపాలలో తనిఖీలు నిర్వహించాలని ఆయన తెలిపారు. అనుమతి, తగిన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తరలించరాదని, దీనిపై జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారాలకు వాహనాలు వినియోగించరాదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే కంట్రోల్ రూమ్ నెంబర్ కు 8106149123, 8106721345కు ఫోన్ చేసి తెలుపవచ్చన్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనల పాటిస్తూ జరిగేలా అభ్యర్ధులందరూ సహకరించాలని వ్యయ పరిశీలకులు అనంత శంకర్ కోరారు.
ఈ సమావేశంలో ఆయనతో పాటు కంట్రోల్ రూమ్ ఎక్సెపెండిచర్ నోడల్ అధికారి బి.చంద్రరావు, కంట్రోల్ రూమ్ ఇన్ చార్జి కె.శ్రీరమణి ఇతర అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం నగరంలోని జడ్పీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టరు గంధం చంద్రుడు పరిశీలించారు. మండలాల వారీగా ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీపుల్ ఫ్రెండ్లీ, ఓటర్ ఫ్రెండ్లీ, ఉద్యోగుల ఫ్రెండ్లీగా ఎన్నికలు జరగాలన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని గతంలో లేని విధంగా, ఉద్యోగులకు ఇబ్బందులు లేని విధంగా చేపట్టామన్నారు. మండలాల వారీగా ఎన్నికల సామగ్రిని వేరు చేయడం, మండలాల నుంచి వచ్చిన అధికారులు కూర్చున్న చోటే సామగ్రిని అందించడం, అధికారుల భోజన వసతుల గురించి ప్రత్యేక చొరవ తీసుకుని భోజనం, మంచి నీళ్లు, పండ్లతో కూడిన ప్యాకేజ్డ్ ఆహారాన్ని అందించడం వంటి చర్యలు చేపట్టామన్నారు. వృద్ధుల పింఛన్ కార్యక్రమంలో ఇంటివద్దకే అధికారులు వెళ్లి పింఛను అందించినట్టుగా ఎన్నికల సామగ్రిని అధికారుల వద్దకే తెచ్చి ఇస్తున్నామన్నారు. ఇదే పద్ధతిని మండలాల్లో కూడా అధికారులు అనుసరించాలన్నారు. గ్రామ పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వారీగా సామాగ్రిని వర్గీకరించి సంబంధిత ఉద్యోగుల వద్దకే సామాగ్రిని చేర్చాలన్నారు. మండలాల్లోనూ ఉద్యోగులకు ప్యాకేజ్డ్ ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. ఎటువంటి చిన్న సమస్య కూడా రాకుండా సామాగ్రి పంపిణీ జరగాలన్నారు.
ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులు ఎన్నికల బాధ్యతలను గుర్తించి వ్యవహరించాలన్నారు. ఎన్నికల విధులు, నిబంధనలపై అవగాహన పెంచుకుని సక్రమంగా పని చేయాలన్నారు. పోలీసు వారి సహాయం తీసుకుని మండల స్థాయిలో ఎన్నికల సామాగ్రికి నిరంతర భద్రత కల్పించాలన్నారు.
ఎన్నికల సామాగ్రిని మండలాలకు తరలించి పోలింగ్ ముందు రోజు వాటిని సంబంధిత గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామన్నారు. అంతవరకూ సాధారణ సామాగ్రిని స్ట్రాంగ్ రూముల్లోను, సున్నితమైన విషయాలకు సంబంధించిన సామాగ్రిని ట్రెజరీలోనూ భద్రపరుస్తామని తెలిపారు. పీపుల్ ఫ్రెండ్లీ, ఓటర్ ఫ్రెండ్లీ, ఉద్యోగుల ఫ్రెండ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
తొలివిడత ఎన్నికల్లో 6 మంది సర్పంచులు, 715 మంది వార్డు మెంబర్ల ఏకగ్రీవం
ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్నికలకు సంబంధించిన గణాంకాల వివరాలు తెలియజేశారు. జిల్లాలో కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాలకు సంబంధించిన 169 గ్రామ పంచాయతీలకు జరుగుతున్న తొలివిడత ఎన్నికలలో 6 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 163 పంచాయితీలలో 469 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారన్నారు. అదే విధంగా 169 మండలాల్లోని మొత్తం 1714 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, 715 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. 987 వార్డులలో 2030 మంది వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్నారన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పోలింగ్ ప్రక్రియకు అవసరమైన జాగ్రత్తలను చేపట్టామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జేసీలు నిశాంత్ కుమార్(రెవెన్యూ), గంగాధర్ గౌడ్(ఆసరా & సంక్షేమం), జడ్పీ సీఈవో శోభా స్వరూప రాణి, డీపీవో పార్వతమ్మ, సీపీవో ప్రేమ్ చంద్, డీఎస్పీ మురళీధర్ లు పాల్గొన్నారు.
అంగన్వాడీ పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శుక్రవారం నగరంలోని రుద్రంపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రం-1 ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ప్రతిరోజు చిన్నారులకు గుడ్లు అందించాలని, చిన్న సైజులో కాకుండా పెద్ద సైజు గుడ్లను ఇవ్వాలన్నారు. వరుసగా కొన్ని రోజులు అంగన్వాడీ కేంద్రానికి చిన్నారులు రాకపోతే వారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలన్నారు. కరోనా నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిన్నారులకు అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిన్నారుల హాజరు పట్టికను తనిఖీ చేశారు. చిన్నారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీరు ఏం నేర్చుకుంటున్నారు అని అడిగి తెలుసుకుని బాగా ఆడుకోవాలని సూచించారు. ప్రతిరోజు కోడిగుడ్లను తినాలని, కరోనా నేపథ్యంలో చిన్నారుల అంతా ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని, జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం చిన్నారుల తల్లులతో కూడా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు గుడ్లు ఇస్తున్నారా, గర్భవతులకు ప్రతినెలా పౌష్టికాహారం అందిస్తున్నారా అంటూ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో లో ఐసిడిఎస్ పిడి విజయలక్ష్మి, సిడిపిఓ శ్రీదేవి, అంగన్వాడి టీచర్, హెల్పర్, చిన్నారులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చు వివరాలను ప్రతిరోజు తప్పనిసరిగా నమోదు చేయాలని గ్రామ పంచాయతీ ఎన్నికల ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ రామకృష్ణ (ఐఎఫ్ఎస్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, కర్నూలు) పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని జిల్లా పరిషత్తు కార్యాలయం సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆడిట్ ఆఫీసర్ లకు అభ్యర్థుల ఎన్నికల ఖర్చు పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నిర్ణయించిన ఖర్చు కన్నా అధికంగా ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్లకు పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు చేయకుండా చూడాలన్నారు. సర్పంచ్ అభ్యర్థి 10 వేల ఓటర్లు పైగా ఉండే పంచాయతీలో 2 లక్షల 50 వేల రూపాయలను, 10 వేల కన్నా తక్కువ మంది ఓటర్లు ఉన్న పంచాయతీలో ఒక లక్షా 50 వేల రూపాయలు ఖర్చు చేసేలా, వార్డ్ మెంబర్ కు సంబంధించి 10 వేల మంది ఓటర్లకు పైగా ఉండే చోట 50 వేల రూపాయలు, 10 వేల మంది ఓటర్ల కన్నా తక్కువ ఉన్న చోట 30 వేల రూపాయలు ఖర్చు చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించిందని తెలిపారు. అభ్యర్థులు ఎవరు నిర్ణయించిన ఖర్చు కన్నా అధికంగా ఖర్చు పెట్టకుండా చూడాలన్నారు. అభ్యర్థుల ఖర్చుల వివరాల నమోదుకు సంబంధించి ప్రతి ఒక అభ్యర్థికి ఒక రిజిస్టర్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల్లో పోస్టర్స్, బ్యానర్స్, వెహికల్స్, మీటింగులు లాంటివి ఏర్పాటుచేసిన వాటిని ప్రతి ఒక అభ్యర్థి కి ఒక రిజిస్టర్ ని ప్రారంభించి, అన్ని రకాల ఖర్చు వివరాలను నమోదు చేయాలన్నారు. ఎవరు ఎంత ఖర్చు చేశారో తప్పనిసరిగా రిజిస్టర్ లో రాయాలని, అభ్యర్థులెవరూ ఓటర్లను ప్రలోభపెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిజాయితీగా జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల్లో సమర్థుడినే గెలిపించేలా చూడాలని, అధికారులంతా జోనల్, రూట్ ఆఫీసర్లను, ఫ్లయింగ్ స్క్వాడ్లను మానిటర్ చేసుకుని పని చేయాలన్నారు.
ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ఖర్చుపై ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉండాలని, ప్రస్తుతం మొదటి విడత ఎన్నికల పోలింగ్ కు సమయం తక్కువగా ఉందని, కేటాయించిన బాధ్యతలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అభ్యర్థి నామినేషన్ వేసినప్పటినుంచి కౌంటింగ్ జరిగే వరకూ జాగ్రత్తలు తీసుకోవాలని, అభ్యర్థుల ఖర్చు కు సంబంధించి అన్ని రకాల రిపోర్టులను పక్కాగా నమోదు చేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తో సమావేశం ఏర్పాటు చేయాలని, ఎన్నికల కమిషన్ సూచించిన ఖర్చునే ఖర్చు చేసేలా వారికి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ లు వెంకట్రాముడు, సుబ్బారావు, లైజన్ ఆఫీసర్ వెంకటశివారెడ్డి, ఆడిట్ ఆఫీసర్ లు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో రెండో దశ పంచాయతీ పోరుకు నేడు నగారా మోగనుంది. రెండో విడత ఎన్నికలకు సంబంధించి శనివారం నుంచి నామినేషన్ల పర్వం మొదలుకానుంది. విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఉన్న మొత్తం 248 గ్రామ పంచాయతీలకు జిల్లా ఎన్నికల అధికారులు నేడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ఫేజ్-3 ప్రకారం జిల్లాలోని విజయనగరం డివిజన్లో ఈ నెల 17న గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరగనున్నాయి. విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఉన్న 9 మండలాల్లోని 248 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. సంబంధిత గ్రామ పంచాయతీలకు సంబంధించి శనివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రతీ నాలుగైదు పంచాయితీలకు కలిపి నిర్దేశించిన క్లస్టర్లలో నామినేషన్లను స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు. రెండో దశ ఎన్నిక జరిగే ప్రాంతాన్ని 38 జోన్లుగా, 82 రూట్లుగా విభజించారు. స్టేజ్- 1లో మొత్తం 89 మంది ఆర్ఓలు, 89 మంది ఏఆర్ఓలు, స్టేజ్-2లో 248 ఆర్వోలు, 2643 మంది పిఓలు, 3459 మంది ఓపిఓలు ఎన్నికల విధులు పాల్గొంటారు. వీరంతా దశల వారీగా ఇప్పటికే శిక్షణ పొందారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
రెండో దశలో ఎన్నిక జరగనున్న మండలాల పరిధిలో 2,402 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 66 సమస్యాత్మక, 56 అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు 122 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. అలాగే ఆయా ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియతోపాటు, ప్రచారం, ఓటింగ్ మొదలగు వివిధ దశలను 87 మంది వీడియో గ్రాఫర్లద్వారా వీడియో రికార్డింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రక్రియ సాగేది ఇలా _..!
6వ తేదీ నుంచి రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటలు వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 8వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది_ . 9వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. అభ్యర్థులు అప్పీల్ చేసుకొనేందుకు 10వ తేదీ సాయంత్రం 5 గంటలు వరకు గడువుంది. అప్పిలేట్ అధికారి వారి అప్పీళ్లను 11వ తేదీన పరిశీలిస్తారు. 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలు వరకూ నామినేషన్లను ఉపసంహరించుకొనే అవకాశం ఉంది. ఆ తరువాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ 9 మండలాల్లో 2,402 పోలింగ్ కేంద్రాల ద్వారా 17వ తేదీ ఉదయం 6.30 నుంచి 3.30 గంటలు వరకూ ఎన్నిక జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, విజేతను ప్రకటిస్తారు. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. ఈ 248 పంచాయితీల్లో మొత్తం 4,13,508 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,07,278మంది కాగా, మహిళా ఓటర్లు 2,06,208 మంది, ఇతరులు 22 మంది ఉన్నారు.
మండలాల వారీగా బరిలో నిలిచే పంచాయతీలు
1. భోగాపురం-22
2. చీపురుపల్లి-19
3. డెంకాడ-27
4. గరివిడి-31
5. గుర్ల-42
6. మెరకముడిదాం-29
7. నెల్లిమర్ల-28
8. పూసపాటిరేగ-28
9. విజయనగరం-22
మీ రేషన్- మీ ఇంటికే కార్యక్రమం క్రింద జిల్లాలో ప్రారంభించిన ఇంటింటికీ రేషన్ సరుకుల సరఫరా సజావుగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ ఆదేశించారు. ఈ కొత్త విధానం అమల్లో ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రేషన్ సరఫరా వాహనాల యజమానులు (ఎండియు), రేషన్ డీలర్లు, పౌర సరఫరాల అధికారులతో తొలి సమన్వయ కమిటీ సమావేశం జాయంట్ కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం జెసి ఛాంబర్లో జరిగింది. ముందుగా ఎండియు ప్రతినిధులు మాట్లాడుతూ తమ సమస్యలను వివరించారు. రేషన్ డిపోలనుంచి సరుకులను తూకం వేయడం, వాటిని తమ వాహనాల్లో లోడ్ చేసుకోవడం, ఇంటింటికీ వెళ్లి తూకం వేసి ప్రజలకు పంపిణీ చేయడం చాలా కష్టంగా ఉందని చెప్పారు. ఇంతా చేసినా, తమ కష్టానికి తగిన వేతనం గిట్టుబాటయ్యే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ ఛార్జీల రూపంలో ఇస్తామన్న రూ.3వేలు ఏమాత్రం సరిపోవని చెప్పారు.
రేషన్ డీలర్ల సంఘం నాయకులు బుగత వెంకటేశ్వర్రావు, సముద్రాల రామారావు మాట్లాడుతూ, తమకు అంతంత మాత్రపు ఆదాయమే వస్తోందని, చాలామంది పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఇలాంటి స్థితిలో తాము కూలీలను పెట్టుకొనే స్థోమత లేదని అన్నారు. కేవలం గౌరవం, గుర్తింపు కోసమే చాలామంది రేషన్ డిపోలను నిర్వహిస్తున్నామని చెప్పారు. తమకు ప్రభుత్వం నుంచి కోట్లాదిరూపాయల కమిషన్ బకాయి రావాల్సి ఉందని అన్నారు. కరోనా కాలంలో 18 విడతలుగా ఉచిత రేషన్ను సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అనంతరం జెసి కిశోర్ మాట్లాడుతూ, కొన్నిచోట్ల ఎండియు వాహనాలను ఆపివేయడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏ కొత్త వ్యవస్థను ప్రారంభించినా, మొదట్లో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయని, అవన్నీ క్రమక్రమంగా సమసిపోతాయని చెప్పారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, సమస్యలు ఉత్పన్నం అయినా వ్యవస్థ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎండియు ఆపరేటర్లు, రేషన్ డీలర్లు సర్దుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కొత్తలో కష్టమైనా, ఆ తరువాత పని సులువుగా ఉంటుందన్నారు. ఎండియు వాహనాల యజమానులకు భవిష్యత్తు బాగుంటుందని భరోసానిచ్చారు. ఏదైనా సమస్యలు ఉంటే, తమకు తెలియజేయాలని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జెసి హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరా అధికారి ఏ.పాపారావు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ వరకుమార్, విజయనగరం తాశీల్దార్ ఎం.ప్రభాకరరావు, తూనికలు కొలతల శాఖాధికారులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్న స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్.వి.రమణకుమారి తెలిపారు. శుక్రవారం ఆమె ఛాంబరులో గర్భస్థ పిండ లింగ నిర్థారణ నిషేద చట్టంపై జిల్లా సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు చదలవాడ ప్రసాదు మాట్లాడుతూ జిల్లాలో అనుమతిలేని స్కానింగ్ కేంద్రాలు నడుపుతున్నట్లు తన దృష్టిలో వుందని తెలుపగా అలాంటి సెంటర్లను వెంటనే రద్దు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. జిల్లాలో 14 ప్రభుత్వ స్కానింగ్ సెంటర్లు, 69 ప్రైవేటుస్కానింగ్ సెంటర్లు వున్నాయని, మరో 4 దరఖాస్తులు ఆన్ లైన్ లో అందాయని తెలిపారు. ఎవరైనా స్కానింగ్ సెంటరు కోసం ఆన్ లైన్ లోనే తగు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని వాటిని పరిశీలించి అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం అందిన 4 దరఖాస్తులను ఆమోదించడం అయినదని, త్వరలోనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. కమిటీ సభ్యులు న్యాయవాది ఉపాధ్యాయుల రవిశంకర్ మాట్లాడుతూ అన్ని స్కానింగ్ కేంద్రాలు, సభ్యులను కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తే ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయుటకు వీలవుందన్నారు. గర్బస్థ లింగ నిర్థారణ చట్టంపై ప్రజలకు, వైద్యులకు అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచారం గావించాలన్నారు. ఏ ఒక్క కేంద్రంలోగాని లింగ నిర్థారణ పరీక్షలు జరిగిన, వెల్లడించిన ఆ కేంద్రాన్నిరద్దు చేయడంతో పాటు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో సభ్యులు డిప్యూటి డిఎం అండ్ హెఓ డా. చామంతి, పిఎన్డిటి కౌన్సిలరు పవన్ ఆశిష్, ఘోష ఆసుపత్రి స్త్రీల వైద్యలు డా. ఉషారాణి, డివిజనల్ పౌర సంబంధాల అధికారి ఎస్. జానకమ్మ, పిల్లల వైద్యులు డా. అప్పలనాయుడు, నేచర్ కౌన్సిలరు దర్గ, డెమో సబ్బలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.