కాకినాడ రూరల్ వాకలపూడిలోని ప్యారీ సుగర్స్ రిఫైనరీ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ పరిశ్రమలో సోమవారం మద్యాహ్నం జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. సోమవారం సాయంత్రం ప్రమాద సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10 రోజుల వ్యవధిలో అదే పరిశ్రమలో మరో మారు ప్రమాదం సంభవించడం శోచనీయమని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు గైకొంటామని కలెక్టర్ తెలిపారు. సోమవారం ప్యారీ సుగర్స్ పరిశ్రమలోని వ్యాక్యూమ్ కంట్రోల్ ప్యానెల్ వ్యవస్థలో జరిగిన ఈ దుర్ఘటనలో గొల్లప్రోలు మండలం, రంగప్పచెరువు గ్రామస్తుడు రాగం ప్రసాద్ (37), కాంట్రాక్ట్ టెక్నిషియన్; కె.గంగవరం మండలం, వట్రపూడి గ్రామస్తుడు పేరూరి సుబ్రమణ్యేశ్వరావు (33), సెంట్రీఫ్యూగల్ ఆఫీసర్ మరణించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వీరికి తక్షణ సహాయంగా వైఎస్ఆర్ బీమా ద్వారా రూ. 5 లక్షలు, వర్క్సమెన్స్ కాంపెన్సేషన్ చట్టం క్రింద రూ. 10 లక్షలు అందజేస్తున్నామని, కంపెనీతో చర్చలు నిర్వహించి మృతుల కుటుంబాలకు న్యాయమైన పరిహార మొత్తాన్ని నిర్ణయిస్తామని తెలిపారు.
గతంలో ఇదే కంపెనీ వేర్ హౌస్ లో జరిగిన ప్రమాదంపై ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీ నివేదిక సమర్పించిందని, వేర్ హౌస్ ను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే సోమవారం సంభవించిన దుర్ఘటనపై కూడా హైపవర్ కమిటీ ఇప్పటికే ఏర్పాటు చేశామని, పరిశ్రమ మూసివేతకు క్లోజర్ ఆర్డర్ జారీచేసి, సేఫ్టీ ఆడిట్ చేపట్టడం జరిగిందన్నారు. ప్రమాదానికి భద్రతా పరమైన లోపాలు కారణమైతే సంస్థపై కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా హైపర్ కమిటీ అధ్యయనంలో సూచించిన భద్రతా పరమైన ఏర్పాట్లను అన్ని పరిశ్రమలలో కచ్చితంగా అమలు పరిచేలా చర్యలు గైకొంటామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఈ పర్యటనలో అడిషనల్ ఎస్పీ పి.శ్రీనివాస్, కాకినాడ ఆర్డీవో బి.వి.రమణ, కాకినాడ డీఎస్పీ భీమారావు, కార్మిక, కాలుష్య నియంత్రణ బోర్డు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.