సీపీఐ ఎంఎల్ పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్(ఎంసిసి) 2004లో విలీనం జరిగి సిపిఐ (మావోయిస్టు) గాఏర్పడి 2022 సెప్టెంబర్ 21వ తేదీకి 18 సంవత్సరాలు అయ్యింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 21 నుండి 27 వరకు వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కరపత్రాలు వెలువడ్డాయి. మావోయిస్టుల వార్షికోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పిలుపు ఇచ్చారు. దీంతో పోలీసు యంత్రాంగం ఏవోబీ వ్యాప్తంగా అప్రమత్తమైంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు సరిహద్దు రాష్ట్రం ఒడిశాలోని మల్కనగిరి, కోరాపుట్లతో పాటు ఛత్తీస్గఢ్లోని పోలీసు యంత్రాం గమంతా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మారుమూల ప్రాంతాల్లో కూంబింగ్ చర్యలను విస్తృతం చేయడంతో పాటు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లు, ఆవుప్పోస్టులు, ఒడిశాలోని కటాఫ్ ఏరియాలోని అవుట్ పోస్టుల్లో రెడ్ అలెర్డ్నుప్రకటించింది. మావోయిస్టు కార్యకలా పాలను నిరోధించడమే లక్ష్యంగా ఏవోబీ వ్యాప్తంగా ఇప్పటికే ప్రత్యేక పోలీసు బలగాలు గాలింపు చర్యల్లో నిమగ్నమైంది. ఏవోబీ వ్యాప్తంగా అదనంగా పోలీసు బలగాలను మోహరించారు. మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో వాహనాల తనిఖీలను పోలీసులు విస్తృతం చేశారు.
మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ ఏజెన్సీ ప్రాంతాలకు తిప్పే నైట్ హాల్ట్ సర్వీసులను వారం రోజుల పాటు రద్దు చేసింది. అటు మన్య ప్రాంత వాసులు కూడా సాయంత్రం ఐదులోపుగానే వారి పనులను చక్కబెట్టుకొని ఇళ్లకు చేరుకుంటున్నారు. మావోల హిట్ లిస్టులో వున్న కొందరు ప్రజాప్రతినిధులు మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. మరోవైపు ప్రజాప్రతినిధుల వాహనాలకు భద్రత పెంచడంతో పాటు వారి ఏజెన్సీ పర్యటనలన్నీ రద్దు చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఎలాంటి సంఘటనలైనా ఎదుర్కొనేందుకు ప్రభావిత ప్రాంతాల పోలీస్ స్టేషన్లను అన్ని జిల్లాల ఎస్పీలు, డిఎస్పీలు అప్రమత్తం చేశారు.