తూర్పుగోదావరి(రాజమహేంద్రవరం) జిల్లా కలెక్టర్ కార్యాలయం, క్యాంపు కార్యాలయం , ఇతర కార్యాలయాల నిర్వహణ పేరుతో నగదు వసూళ్లు చేస్తున్న వారిపై చర్యలు తీవ్రతరంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయం, క్యాంపు కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ పేరుతో నగదు వసూళ్లను జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిణించడం జరుగుతుందన్నారు. ఇటువంటి అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని రావాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, ఉత్తర్వులకు లోబడే పరిపాలన వ్యవస్థ ఉంటుందని మాధవీలత స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి లో అధికారులు, సిబ్బంది విధులను నిర్వర్తించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, మళ్లింపు వంటి అంశాలకు సంబంధించిన ఎటువంటి అవకతవకలకు పాల్పడిన, పాల్పడేందుకు ప్రోత్సహించినా అటువంటి వారి విషయంలో ఉపేక్షించేది లేదని కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. ఉద్దేశ్య పూర్వకంగా జిల్లా యంత్రాంగానికి మచ్చ తెచ్చే విధంగా అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.