విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి సెల్ నెంబర్ సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. కలెక్టర్ మొబైల్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న నెంబర్లకు ఫోన్లు, మెసేజ్ లు పంపి డబ్బులు వసూలు చేసేందుకు తెగబడ్డారు. ఈ విషయం జిల్లాలోని పశుసంవర్ధశాఖ అధికారికి వచ్చిన మెసేజ్ ద్వారా నిరూపితం అయ్యింది. దీనితో వెంటనే కోలుకున్న కలెక్టర్ తన పేరుతో ఎవరైనా మెసేజ్ లు పెట్టినా.. డబ్బులు అడిగినా స్పందించవద్దని. తాను ఎవరికీ ఎలాంటి మెసేజ్ లు పెట్టడం లేదనే విషయాన్ని గుర్తించాలంటూ అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఈ విషయం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజులుగా ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల నెంబర్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయి. స్వయంగా వారే మాట్లాడినట్టు, మెసేజులు పెడుతున్నారు. నేరుగా జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులే పంపారనుకుంటున్న ఇవతలి వారు డబ్బులు పంపుతున్నారు. అయితే ఈ విషయం వెంటనే బయటకు పొక్కడంతో వెంటనే తేరుకుంటున్నారు. ఆపై వీరంతా పోలీసులకు ఫిర్యాదులు చేసి అవతలివారిని అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. అంతా అప్రమత్తం అయ్యారని తెలుసుకుంటున్న హ్యాకర్లు చల్లగా పలాయనం చిత్తగిస్తున్నారు. మీకు కూడా ఎవరైనా అపరచితులు, అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి మంచిగా మాట్లాడితే జాగ్రత్త వహించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ హెచ్చరిస్తున్నారు.