అనకాపల్లి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కుతుండగా ముగ్గురు ప్యాసింజర్లు జారిపడి తీవ్ర గాయాలపాలయ్యారు. ట్రైన్ నుంచి జారిపడిన వారిలో అనకాపల్లి మండ లం మూలపేట గ్రామానికి చెందిన అల్లం శంకర్, చోడవరానికి చెందిన జనపరెడ్డి దాక్షాయిని, అనకాపల్లికి చెందిన కరణం అన్నపూర్ణ ఉన్నారు. వీరిలో అల్లం శంకర్, దాక్షా యినిల పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖలోని ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ మరో ప్రయాణికురాలు అనకాపల్లికి చెందిన కరణం అన్నపూర్ణ స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. అనకాపల్లి నుంచి తాడేపల్లిగూడెం వెళ్లేందుకు ఆరుగురు స్టేషన్ కు వచ్చారు. ఖాళీగా ఉన్న బోగీల కోసం వెతుకుతుండగా రైలు నెమ్మదిగా కదిలింది. ఆ వెంటనే ముగ్గురు రైలెక్కారు. మరో ముగ్గురూ ఎక్కేలోగా రైలు స్పీడందుకోవడంతో ఒకరి వెనుక ఒకరు చొప్పున ముగ్గురూ పడిపోయారు. రైలెక్కిన ఆ ముగ్గురూ కూడా తర్వాత స్టేషన్లో రైలు దిగి వెనక్కి వచ్చినట్టు తెలిసింది. తీవ్ర గాయాల పాలైన ఇద్దరూ విశాఖ లోని కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసును ప్రభుత్వ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.