మహిళలపై అమానీయమైన ఘటనలకు పాల్పడుతున్న మృగాళ్ళకు కఠిన శిక్షలు అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామంలో అత్యాచారానికి గురై గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వికలాంగ మహిళను గురువారం రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తో కలిసి పరామర్శించారు. బాధిత మహిళకు ధైర్యం చెప్పి, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధిత కుటుంభాన్ని ఆదుకోవటానికి ప్రకటించిన రూ.5 లక్షల చెక్కును మంత్రులు అందించారు. అనంతరం రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చిన్నపిల్లల విభాగంలో చికిత్స పొందుతున్నఏడునెలల చిన్నారిని, విద్యుత్ షాక్ గురై అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న యువకుడు కుటుంబసభ్యులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత విలేకరులతో మాట్లాడుతూ మాట్లాడలేని, వినపడని మహిళ పశువులు కాయటానికి వెళ్ళినప్పుడు ఆమె పై జరిగిన అత్యంత దారుణంగా జరిగిన అత్యాచార సంఘటన సభ్యసమాజం తలదించుకోవాల్సిన పరిస్థితిలో ఉంది అన్నారు. మహిళలపై వేధింపులకు గురి చేస్తున్న వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు అమలు చేసినా మృగాళ్ళు రెచ్చిపోవటం చాలా బాధాకరంగా ఉందన్నారు. అత్యాచారానికి గురైన మహిళ కనీసం తన బాధను సైతం తెలపలేని పరిస్థితిలో చాలా భయపడి పోయి బ్రతకలేను అని ఆవేదన వ్యక్తం చేస్తుందన్నారు. ఘటనకు పాల్పడిన వ్యక్తిపై ప్రాధమిక విచారణ అనంతరం ఇప్పటికే 376 సెక్షను క్రింద కేసు నమోదు చేయటం జరిగిందని, కేసు పూర్తిగా ఎగ్జామిన్ చేయటం జరిగిందని, దీని ప్రకారం నిందితునిపై మరిన్ని సెక్షన్లు క్రింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించం జరుగుతుందన్నారు. మహిళలపై అత్యాచారాలకు, వేదింపులకు పాల్పడుతున్న వ్యక్తులకు కఠినంగా శిక్షలు అమలు చేయటానికే దిశా చట్టంను రూపొందించటం జరిగిందన్నారు. గతంలో అత్యాచార సంఘటనలు జరిగితే దర్యాప్తు సమయం 100 నుంచి 180 రోజలు ఉండేదని, దిశ చట్టం వచ్చిన తరువాత 50 రోజుల్లో పూర్తి చేయటం జరుగుతుందన్నారు.
అత్యాచార ఘటనను రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఆయన బాధిత కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందించాలని సూచించటంతో చెక్కును అందించామన్నారు. బాధితురాలి సోదరుడుకు అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం అందించనున్నామన్నారు. రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ చెవి, మూగ యువతిపై అగంతకుడు దాడి చేసి, హింసించి, అత్యాచారం చేసిన దారుణ సంఘటనకు బాధపడుతూ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జాలీ పడే స్థితిలో ఉన్న వికలాంగురాలిపై సైతం అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే నిందితున్ని కస్టడీలోకి తీసుకోవటం జరిగిదన్నారు. ఇటువంటి దారుణ, కృర సంఘటనలకు పాల్పడే వ్యక్తులను క్షమించేది లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కును అందించామని, బాధితురాలి తమ్మునికి ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు దిశా చట్టంను అమల్లోకి తీసుకువచ్చి దిశా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారన్నారు. మహిళలకు అన్ని వేళల సహాయం అందించేందుకు దిశా యాప్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించటం జరుగుతుందన్నారు. నేరప్రవృత్తి మనస్తత్వంతో చట్టాలంటే భయం లేకుండా మహిళలపై ఆఘాయిత్యాలకు పాల్పడే వారిని ఖచ్చితంగా శిక్షించటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ ముస్తఫా, నగరపాలక సంస్థ మేయరు కావటి శివనాగ మనోహర నాయుడు, ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ప్రభావతి, జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరక్టర్ మనోరంజని, జీజీహెచ్ వైద్యులు పాల్గొన్నారు.