2నెలల్లో ద‌ళారుల‌పై 25 కేస్‌లు న‌మోదు..


Ens Balu
4
Tirumala
2021-08-21 17:02:10

శ్రీ‌వారి దర్శన టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌తో సంబంధం క‌లిగి ఉన్నారనే ఆరోపణలపై టిటిడి నిఘా మ‌రియు భద్రాతా విభాగం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు రెండు నెల‌ల‌లో వ్య‌వ‌ధిలో 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 41 మందిని అరెస్టు చేశారు. జూలై మరియు ఆగస్టు నెలల్లో భక్తులకు స్వామివారి దర్శన టిక్కెట్లను అధిక ధరలకు విక్ర‌యిస్తున్న దళారులను టిటిడి విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఇందులో కొంతమంది ప్రజా ప్రతినిధుల నకిలీ లేఖలు, నకిలీ వెబ్‌సైట్లు, ట్రావెల్ ఏజెన్సీలు భక్తులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. భక్తులను మోసం చేయ‌డానికి ప్రయత్నించినందుకు, వారి మనోభావాలు దెబ్బ‌తిసేలా న‌డుచుకున్న ద‌ళారుల‌పై  తిరుమల, తిరుపతిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో టిటిడి విజిలెన్స్ విభాగం అధికారులు ఫిర్యాదులు నమోదు చేశారు. భక్తులు దళారులను నమ్మొద్దని, దర్శనం కోసం నకిలీ వెబ్‌సైట్‌లు,  ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించవద్దని టిటిడి ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించింది. టిటిడి అధికారిక వెబ్‌సైట్ www.tirupatibalaji.gov.in నుంచి మాత్ర‌మే ఆన్‌లైన్ టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి మ‌రోసారి విజ్ఞప్తి చేస్తున్నది. దళారులు, నకిలీ వెబ్‌సైట్ నిర్వ‌హ‌కులు, ట్రావెల్ ఏజెన్సీలపై నేరం రుజువైతే టిటిడి చట్టపరంగా తీవ్రమైన‌ చర్యలు తీసుకుంటుందని హెచ్చరిస్తోంది.