రూ.1.50లక్షల ఆషిస్ ఆయిల్ స్వాధీనం..
Ens Balu
9
Nathavaram
2021-10-07 07:25:49
విశాఖజిల్లా నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద లక్ష యాభై వేల రూపాయల విలువైన 1. 510 లీటర్ల ఆషిస్(గంజాయి నుంచి తీసిన ఆయిల్) తో ముగ్గురు వ్యక్తులను నర్సీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఏఎస్పీ మణికంఠ చందోలు గురువారం నాతవరం పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా అందిన సమాచారం మేరకు బుధవారం ఉదయం గన్నవరం మెట్ట వద్ద పోలీసులు మాటు వేసినట్లు తెలిపారు. ఆ సమయంలో బైక్ వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి బైక్ ను వెనక్కి తిప్పి పారిపోతుండగా వెంటపడి పోలీసులు వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వీరిలో చంద్రరావు అనే వ్యక్తి చేతిలో ఉన్న బ్యాగ్ ను తనిఖీ చేయగా అందులో 1. 510 కిలోల హాషిస్ ఆయిల్ లభ్యమైనట్లు చెప్పారు. పట్టుబడిన ముగ్గురులో చంద్రరావు, చంటిబాబు చింతపల్లి మండలానికి చెందిన వారు కాగా విశ్వేష్ పడాల్ జి. మాడుగుల మండలానికి చెందిన వాడుగా పెర్కొన్నారు. వీరిని విచారించగా చింతపల్లి మండలం గొప్పిగుడుసుల గ్రామంలో గంజాయి నుంచి హాషిస్ ఆయిల్ తయారు చేస్తున్నట్లు వారు వెల్లడించారని తెలిపారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి దాడి చేసి తయారీ మెషనరీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హాషిస్ ఆయిల్ ను తునిలో ఒక వ్యక్తికి విక్రయించేందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం ఎనిమిది మంది నిందితులను గుర్తించగా ఇంతవరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఒక బైక్, రెండు సెల్ ఫోన్లు, హాషిస్ ఆయిల్ ను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నర్సీపట్నం రూరల్ సీఐ శ్రీనివాసరావు స్థానిక ఎస్ఐ శేఖరం పాల్గొన్నారు.