సాంకేతికతపై పట్టు సాధిస్తే ఉత్తమ ఫలితాలు..
Ens Balu
3
Kakinada
2020-12-28 21:42:13
నేటి తరం విద్యార్థులు సాంకేతికతపై పట్టు సాధించి సమాజానికి మేలు చేకూరే విన్నూత ప్రాజెక్ట్లను చేపట్టి పలు సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని ఆంధప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.కె.హేమచంద్రారెడ్డి అన్నారు. సోమవారం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ ప్రాంగణంలో యుసిఇకె కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ (సిఎస్ఈ) విభాగం ఆధ్వర్యంలో అలూమ్ని ఆడిటోరియం లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘‘కంప్యూటర్ విజన్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, స్మార్ట్ డివైజస్ అండ్ నెట్వర్కస్ (సిహెచ్ఎస్ఎన్-2020)’’ అను అంశంపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ కారణంగా వర్చువల్ విధానంలో జరిగే కార్యక్రమంలో వక్తల అభిప్రాయాలను స్వీకరించడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం వుంటుందన్నారు. ఆచార్య కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో బోధనా విధానంలో సాంకేతికపరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. ప్రస్తుతం దేశంలోను మరియు రాష్ట్రంలోను 100శాతం తరగతులు ఆన్లైన్ పద్ధతిలోనే జరుగుతున్నాయన్నారు. సాంకేతిక విద్యలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి క్వాలిటీ గ్రాడ్యుయేట్స్ను సమాజానికి అందించాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందన్నారు. విద్యార్థులకు ముఖ్యంగా స్కిల్ ఓరియంటెడ్ కోర్సులను అందించాలని, పరిశోధనకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు.
ఉపకులపతి ప్రొ.ఎం.రామలింగరాజు మాట్లాడుతూ అధ్యాపకులు, పరిశోధక మరియు ఇంజనీరింగ్ విద్యార్థులు ఇటువంటి సదస్సులలో పాల్గొనడం వలన సబ్జెక్ట్పరంగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సదస్సులో నెట్వర్క్ భద్రతా సంబంధిత అంశాలు, సమాచార డేటా విశ్లేషణ, సమాచార మార్పిడి వంటి తదితర అంశాలపై ఉపన్యాసాలు ఉంటాయన్నారు.
మాజీ ఉపకులపతి ప్రొ.అల్లం అప్పారావు మాట్లాడుతూ కరోనా ప్రబలుతున్న ఇటువంటి సమయంలో అంతర్జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. సాంకేతిక విద్య మరియు సాంకేతిక సేవలలో ఆంధప్రదేశ్ ముందంజలో ఉందన్నారు. అమెరికా వంటి దేశాలలోని మల్టీనేషనల్ కంపెనీలను భారతీయులు తమ సాంకేతిక బలంతో ముందుండి నడిపిస్తున్నారన్నారు. కరోనా వలన విద్యా విధానంలో వచ్చిన సమూల మార్పులు మరియు ఆన్లైన్ పద్ధతిలో బోధన చేయడాన్ని ఒక అవకాశంగా భావించాలన్నారు.
రాయలసీమ యూనివర్శిటీ ఉపకులపతి ప్రొ.ఏ.ఆనందరావు మాట్లాడుతూ ఇటువంటి సదస్సులలో మంచి జర్నల్స్, పేపర్ ప్రజంటేషన్లు ఇచ్చిన అధ్యాపకులు పరిశోధనలో ముందుకు వెళతారన్నారు. కేవలం ఒక విభాగానికి చెందిన అధ్యాపకులే కాకుండా ఇతర విభాగాల అధ్యాపకులు కూడా ఇటువంటి సదస్సులో పాల్గొని సబ్జెక్ట్పై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.
రిజిస్ట్రార్ మరియు సదస్సు జనరల్ ఛైర్ ప్రొ.సిహెచ్.సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ నలుమూలల నుండి 200మందికి పైగా ప్రతినిధులు వర్చువల్ విధానంలో ఈ సదస్సులో పాల్గొన్నారన్నారు.
అనంతరం పరిశోధననలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధ్యాపకులకు యంగ్ రీసెర్చ్ అవార్డు మరియు బెస్ట్ రీసెర్చ్ ఇన్ సైన్స్ & టెక్నాలజీ అవార్డులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సదస్సు సావనీర్ను అతిథులు ఆవిష్కరించారు. రిజిస్ట్రార్ ప్రొ.సిహెచ్.సత్యనారాయణ జనరల్ ఛైర్గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయగా విశిష్ట అతిథులుగా జెఎన్టియుకె ఉపకులపతి ప్రొ.ఎం.రామలింగరాజు , రాయలసీమ యూనివర్శిటీ ఉపకులపతి ప్రొ.ఏ.ఆనందరావు , జెఎన్టియుకె మాజీ ఉపకులపతి ప్రొ.అల్లం అప్పారావు , గౌరవ అతిథులుగా రెక్టార్ ప్రొ.జివిఆర్.ప్రసాదరాజు, యుసిఇకె ప్రిన్సిపాల్ ప్రొ.బి.బాలకృష్ణ వేదికనలంకరించారు. సిఎస్ఈ విభాగాధిపతి డా.డి.హరిత సదస్సుకు కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. జెఎన్టియుహెచ్ నుంచి ప్రొ.ఎల్.ప్రతాప్రెడ్డి, సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ నుండి డా.మాడ్ మా, మలేషియాలోని మల్టీమీడియా యూనివర్శిటీ నుండి డా.ఎన్జి కోక్ వై, బంగ్లాదేశ్లోని రాజ్షాహి యూనివర్శిటీ నుంచి డా.ఫిరోజ్ అహ్మద్లు కీ-నోట్ స్పీకర్స్గా వర్చువల్ (ఆన్లైన్) విధానంలో పాల్గొన్నారు.