సత్యశోధన దిశగా ముందు కిసాగాలి..
Ens Balu
4
Andhra University
2021-02-24 19:16:37
మానవ జీవితం యాంత్రికంగా మారిపోయిందని, దీని నుంచి బయట పడుతూ సత్యాన్ని గుర్తించే దిశగా జీవనం సాగాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. బుధవారం ఏయూ సెనేట్ మందిరంలో డాక్టర్ పుత్సల రామకృష్ణ రచించిన ‘ జీవించే కళ’ శ్రీ జిడ్డు కృష్ణమూర్తి బోధనల అవగాహనా స్ఫూర్తితో రచించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ అనేక సమస్యలకు మనలోని ‘నేను’ అనే భావనేనన్నారు. దీని నుంచి బయటపడే ప్రయత్నం జరగాలని సూచించారు. జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాలలోని అంశాలను సరళం చేస్తూ తీర్చిదిద్దిన పుస్తకం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. దీనిని జన బాహుళ్యంలోనికి విరివిగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వాన్ని ఆనందమయంగా నిలపడానికి ఇటువంటి పుస్తకాలు ఉపకరిస్తాయని తాను భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా పుస్తక రచయితను వర్సిటీ తరపున సత్కరించారు. పుస్తక రచయిత డాక్టర్ పుత్సల రామకృష్ణ మాట్లాడుతూ నిరాడంబరత, నిస్వార్థతకు ప్రతిరూపంగా, జ్ఞాన మూర్తిగా, ప్రేమమూర్తిగా జిడ్డు కృష్ణమూర్తి నిలుస్తారన్నారు. సామరస్యం, సానుకూల జీవనం అలవరచుకోవడానికి జిడ్డు కృష్ణమూర్తి ప్రవచనాలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. స్వీయ అవగాహనతో మనలో మార్పుకు నాంది పలకాలని సూచించారు. క్రోధాన్ని విడనాడి, ప్రేమ, ఏకత్వం సాధించే దిశగా మన ప్రయాణం సాగాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.