అంతర్జాతీయ ప్రమాణాల విద్యకు ప్రయత్నం..
Ens Balu
0
Srikakulam
2021-03-02 18:56:23
అంతర్జాతీయ ప్రమాణాల విద్యకు ప్రయత్నం జరుగుతుందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. జిల్లాలో నాడు - నేడు పనులు బాగా జరుగుతుందని అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మనబడి నాడు - నేడు పై విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మంగళవారం సమీక్షించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ మురపాక, చిలకపాలెంలో పనులు పరిశీలించామని, పనులు చక్కగా జరుగుతున్నాయని అన్నారు. మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 15,715, జిల్లాలో 1249 పాఠశాలల పనులు పూర్తి కావాల్సిందే నని స్పష్టం చేసారు. ప్రతి అంశం కంప్యూటరీకరణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జాగ్వార్ వంటి ఉన్నత నాణ్యత గల వస్తువులను ఉపయోగించడం జరుగుతుందని చెప్పారు. చిన్నారుల ప్రాథమిక హక్కులను నాడు - నేడు పనుల ద్వారా కాపాడుతున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 4.30 లక్షల మంది ప్రభుత్వ బడులలో ఈ ఏడాది చేరారని చెప్పారు.
నాడు - నేడు పనులు మైండ్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాద్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్చుతున్నారని, నెల్లూరు జెసి, పార్వతీపురం ఐటిడిఏ పిఓ తన పిల్లలను చేర్పించారని అన్నారు. నాడు - నేడు పనుల ప్రభావం స్పష్టంగా, దీర్ఘకాలం ఉండాలని, దాని ప్రభావం విద్య, విద్యాబోధనపై ఉండాలని ఆయన సూచించారు. దీనికి నిజమైన, వాస్తవ ఫలితాలు కనిపించాలని అన్నారు. పౌరులకు ప్రామాణిక విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని రాజశేఖర్ తెలిపారు. నాడు- నేడు పనులతో బడుల రూపురేఖలు మారుతున్నాయని, చిన్నారుల బంగారు భవితకు గట్టి పునాదులు పడుతున్నాయని చెప్పారు. పాఠశాలల్లో చెడిపోయిన బల్లలు, కుర్చీలు తదితర సామాగ్రితో నూతన వస్తువులు తయారు చేసి ఉపయోగించే విధంగా చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ 36 మండలాల్లో పనులు పరిశీలించడం శుభ సూచకమని పేర్కొన్నారు. నాడు - నేడు పనులు సివిల్ పనులు మాత్రమే కాదని సామాజిక భాగస్వామ్యం అని వివరించారు. పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలు క్రియాశీలక భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో నాడు నేడు పనుల్లో రూ.10.67 కోట్లు ఖర్చు చేయని నిధులు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. మరుగుదొడ్లు, తాగునీరు పనులను పూర్తి చేయడంలో ఎటువంటి జాప్యం చేయరాదని పేర్కొన్నారు. ఎం.ఇ.ఓలు, ఏ.ఇలు సమన్వయంతో పనిచేసి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ మరుగుదొడ్లు, మరమ్మతులు దాదాపు పూర్తి అయ్యాయన్నారు.పెయింటింగ్ పూర్తి చేయుటకు మరిన్ని బృందాలను నియమించాల్సి ఉందని తెలిపారు. స్థానిక అధికారులతో పర్యవేక్షణ చేయడం జరుగుతుందని, మండల ప్రత్యేక అధికారులు కూడా పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని పాఠశాలల్లో ఒకే రకమైన డిజైన్ ను తీసుకోవడం జరిగిందని చెప్పారు. మరుగుదొడ్లకు వాటర్ ప్రూఫ్ డోర్లను వినియోగిస్తున్నామని, గ్రానైట్ ఫ్లోరింగ్ ను ఏర్పాటు చేసామని వివరించారు. ఇందుకు గ్రానైట్ సంఘం సహకరించిందని తెలిపారు. పనుల వలన ఎం.పి.పి పాఠశాలల రూపురేఖలు బాగా మారాయని వివరించారు. కొన్ని పాఠశాలల పనులకు అంచనాలు మరలా తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరుగుదొడ్ల నిర్వహణకు స్వచ్ఛత ఖాతాలో చేర్చాలని సూచించారు. రెండవ, మూడవ విడతలలో మరింత సమర్థవంతంగా చేస్తామని చెప్పారు.
నాడు నేడు ప్రభుత్వ సలహాదారు మురళి మాట్లాడుతూ కొన్ని చోట్ల మరుగుదొడ్లు ఇంకా పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ కు అనుసంధానం చేయవచ్చని అన్నారు. ఏ గోడలపై ఏ రకమైన పెయింటింగ్ లు, బొమ్మలు వేయాలో సూచించడం జరిగిందని ఇంకా మంచి విధానం ఆచరించవచ్చని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో పనులు చక్కగా చేశారని ప్రశంసించారు.
ఈ సమావేశంలో సమగ్ర శిక్షా అభియాన్ ఎస్.పి.డి వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, ఏ.పి.ఇ.డబ్ల్యు. ఐ. డి.సి ఎం.డి రాజేశ్వర రెడ్డి,విద్యా శాఖ ఆర్.జె.డి నాగేశ్వరరావు, జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్ర కళ, సమగ్ర శిక్షా అభియాన్ ఏపిసి పి.వి.రమణ, ఇంజినీరింగ్ అధికారులు భాస్కరరావు, జి.మురళి, వి.వెంకట కృష్ణయ్య, మండల విద్యా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.