అనంతలో తెలుసుకో..ఎదుగు..
Ens Balu
2
Anantapur
2021-03-03 16:13:34
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పరిపాలన మరియు కార్యకలాపాలపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన, నిర్ణయ సామర్థ్యం మరియు నాయకత్వ లక్షణాలు వెలికి తీయడానికి, వారిని రేపటి మార్గదర్శకులుగా తయారుచేయడానికి "తెలుసుకో... ఎదుగు..." (Know & Rise) అనే కార్యక్రమంను బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. తెలుసుకో..ఎదుగు..(Know & Rise) కార్యక్రమంలో భాగంగా తొలిరోజు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డి ఈ ఓ, ఎం ఈ ఓలు, ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో విద్యార్థులను జిల్లా కలెక్టర్ భాగస్వాములను చేశారు. అనంతపురం నగరంలోని రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్ కు చెందిన 15 మంది విద్యార్థినీవిద్యార్థులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన సమావేశం ముగిసిన అనంతరం సమావేశంలో ఎలాంటి అంశాలు గమనించారు అనే విషయంపై విద్యార్థులను జిల్లా కలెక్టర్ అడగగా, పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పరిపాలన పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం కల్పించడం, జిల్లా పరిపాలనా యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందనే దానిపై అవగాహన కల్పించడానికి తెలుసుకో..ఎదుగు లో భాగంగా ఇకపై కూడా ఇలాంటి సమీక్షా సమావేశాల్లో ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులను భాగస్వాములను చేసి వారి ఎదుగుదలకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో 8 - 10 తరగతి ఆ పైన ఉన్న విద్యార్థులను అడ్మినిస్ట్రేషన్లో భాగస్వామ్యం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లా స్థాయిలో జరిగే సమావేశాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనేలా చేసి భవిష్యత్తులో వారిని నాయకులుగా, పరిపాలకులుగా, సైంటిస్టులుగా, ఇంజనీర్లుగా, అధికారులుగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థాయిలో జరిగే వివిధ రకాల సమావేశాలు లేదా భవిష్యత్తులో ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ కి విద్యార్థులను భాగస్వామ్యం చేస్తామన్నారు.
ఒక పాఠశాల నుంచి 10 నుంచి 15 మంది విద్యార్థులను వ్యాసరచన పోటీలు లేదా ఇతర రకాల పోటీలు నిర్వహించి ఎంపిక చేసి, ఎంపికైన విద్యార్థులను తెలుసుకో.. ఎదుగు.. అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో జరిగే సమావేశాలకు హాజరయ్యేలా చూస్తామన్నారు. భవిష్యత్తులో జిల్లా కలెక్టరేట్ లో జరిగే సమావేశాలలో, ఇతర అన్ని జిల్లా స్థాయి కార్యక్రమాలలో కూడా విద్యార్థులను భాగస్వాములను చేసే విధంగా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు పిల్లలే రేపటి పౌరులని, వారే కాబోయే పరిపాలకులని, చిన్న స్థాయి నుంచే పరిపాలనలో ఏం జరుగుతోంది అనే విషయాన్ని తెలియజెప్పేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. భవిష్యత్తులో మంచి పౌరులుగా, మంచి అధికారులుగా, పరిపాలకులుగా మార్చేందుకు ఇప్పటినుంచే వారిని జిల్లా స్థాయి సమావేశాలలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాలలో ఈ తరహా కార్యక్రమాలు జరుగుతున్నాయని, తెలుసుకో.. ఎదుగు కార్యక్రమం వల్ల పరిపాలన మీద మంచి అవగాహన కలిగి విద్యార్థులు దేశాన్ని ముందుకు నడిపించగలరన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మున్సిపల్ ఎన్నికలు, ఓటింగ్ ప్రక్రియ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమావేశంలో విద్యార్థులు తెలియజేసిన అంశాలపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ "తెలుసుకో... ఎదుగు.." (Know & Rise) అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఏ.సిరి, అసిస్టెంట్ కలెక్టర్ జి. సూర్య, డీఈవో శామ్యూల్, రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ నాగరాజు, నగరపాలక సంస్థ కమిషనర్ పివిఎన్ఎన్ మూర్తి, సమగ్ర శిక్ష ఏపీసీ తిలక్ విద్యాసాగర్, ఎంఈ ఓ లు, హెడ్మాస్టర్ లు, విద్యార్థులు పాల్గొన్నారు.