కెజిబీవీ విద్యార్ధుల సమస్యలు పరిష్కరించాలి..
Ens Balu
1
Srikakulam
2021-03-12 20:27:15
కె.జి.బి.విలలో చదువుతున్న విద్యార్థుల సమస్యలు తెలుసుకొని తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ కె.జి.బి.వి సెక్టోరియల్ అధికారులను ఆదేశించారు. కెజిబివిల నిర్వహణపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేకంగా బాలికల విద్య కోసమే కె.జి.బివిలు స్థాపించబడ్డాయని, వీటికి కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుందని అన్నారు. ప్రతీ 10 మంది విద్యార్థులకు ఒక టీచింగ్ లేదా నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 32 కెజిబివిలు ఉండగా అందులో 21 కెజిబివిలు ఇంటర్మీడియట్ వరకు విద్యను అందిస్తున్న సంగతిని కలెక్టర్ గుర్తుచేశారు. ప్రతీ కెజిబివిలో సిబ్బంది పూర్తిగా ఉన్నారని కలెక్టర్ చెప్పారు. బాలికల విద్య కోసం ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ కొన్ని కె.జి.బి.విలలో సమస్యలు తలెత్తుతుండటం విచారకరమని అన్నారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించడం సెక్టోరియల్ అధికారులపై ఉందని అన్నారు. కెజిబివిలోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే విద్యార్థులు నష్టపోయే అవకాశముందని తెలిపారు. కాబట్టి విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులతో పాటు ప్రామాణిక విద్యను అందించాలని సూచించారు. ప్రతీ కెజిబివి విద్యార్థులు ఐఐటీ, ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎంపికయ్యేలా వారిని తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతీ కెజిబివిలో గల విద్యార్థుల కదలికలను నిత్యం గమనిస్తూ ఉండాలని, వారికి ఏదైనా సమస్య తలెత్తితే సరియైన సమయంలో ఆ సమస్యను పరిష్కరించాలని సూచించారు. తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రహరిగోడలు లేని పాఠశాలలకు ప్రహరిగోడలు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని,అందుకు అవసరమైన సామగ్రి ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ కె.జి.బి.వి ఒక ఆదర్శ పాఠశాల కావాలని, ఆదిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకుసాగాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, సమగ్ర శిక్ష ప్రొజెక్ట్ అధికారి పైడి వెంకటరమణ, జిల్లా విద్యాశాఖాధికారి కుసుమ చంద్రకళ, ఉప విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, సమగ్ర శిక్ష ఉపకార్యనిర్వాహక ఇంజినీర్ వెంకట కృష్ణయ్య,జిల్లాలోని కెజిబివి సెక్టోరియల్ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.