తూ.గో.జి.లో నవోదయకు ఏర్పాట్లు పూర్తి..


Ens Balu
4
Kakinada
2021-08-06 14:03:35

తూర్పుగోదావరి జిల్లాలో ఆగస్టు 11న నిర్వహించబోయే జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జవహర్ నవోదయ 6 వ తరగతి ప్రవేశ పరీక్ష సక్రమ నిర్వహణ నిమిత్తం వైద్య ఆరోగ్య,పోలీస్, పంచాయితీ, ఆర్టీసీ ,విద్య, విద్యుత్ , తదితర శాఖలతో డీఆర్వో సీ.హెచ్.సత్తిబాబు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు 11న జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిమిత్తం పెద్దాపురం జవహర్ నవోదయ స్కూల్ పరిధిలో 39 పరీక్ష కేంద్రాలు ,ఎటపాక పరిధిలో 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో పటిష్టంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష రాసే విద్యార్థులు ఇబ్బందులకు గురికుండా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, పరీక్ష సజావుగా నిర్వహించేందుకు కృషి చేయాలని డీఆర్వో అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జవహర్ నవోదయ ప్రిన్సిపల్ పరశురామయ్య, ఆర్టీసీ .డీఎం, విద్యాశాఖ పరీక్షల ఎగ్జామినర్ వి. రాజశేఖర్,  ఇతర అధికారులు పాల్గొన్నారు.