విజయనగరం జిల్లాలో సెప్టెంబర్ 1వ తారీఖున పాలిటెక్నిక్ ఎంట్రాన్స్ టెస్ట్ జరుగు తుందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఆర్వో ఎం. గణపతిరావు వెల్లడించారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో తన ఛాంబర్లో శనివారం సమావేశమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. జిల్లాలోని 19 కేంద్రాల్లో జరగబోయే పరీక్షకు సుమారు ఆరువేల మంది హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరుగుతుందన్నారు. కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందుగానే చేరుకోవాలని ఈ సందర్భంగా డీఆర్వో సూచించారు. అభ్యర్థుల సౌకర్యార్థం కేంద్రాలకు పరీక్ష రోజు ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని, తాగునీరు వసతి కల్పించాలని, థర్మల్ స్క్రీనింగ్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో పోలీసు శాఖ, విద్యాశాఖ అధికారులు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, లైజెనింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.