ఆదర్శనీయమైన వేదవిద్య అందించాలి..


Ens Balu
7
Tirupati
2021-08-21 16:27:47

మ‌న పూర్వీకులు వేదాలలో పొందుపరిచిన అపార‌మైన‌ జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని వేద పాఠశాలలను శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం కిందకు తీసుకురావ‌ల‌న్న దృడ సంక‌ల్పంతో ఉన్న‌ట్లు టిటిడి అదనపు ఈవో ఎవి ధర్మా రెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం  వేదపాఠశాలల కార్యకలాపాలపై అధికారుల‌తో అద‌న‌పు ఈవో సమీక్ష సమావేశం నిర్వ‌హించారు.ఈ సంద‌ర్బంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ టిటిడి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న వేదపాఠశాలలన్నీ దేశంలోని వేద పాఠ‌శాల‌ల‌కు ఆద‌ర్శంగా తీర్చిద్ధిదాల‌న్నది టిటిడి ఆశయమని చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి దేశవ్యాప్తంగా ఉన్న వేద పాఠశాలలన్నింటినీ శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం కిందకు తీసుకువ‌చ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయ‌నికి అనుబంధంగా టిటిడి నిర్వ‌హిస్తున్న అన్ని వేద పాఠ‌శాలలను తీసుకురానున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే విజయనగరం, కోటప్పకొండ పాఠ‌శాలలు పూర్తయ్యాయ‌ని, మిగిలిన పాఠ‌శాల‌లు ఒక నెలలో తీసుకురావ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

నూత‌నంగా ఏర్పాటు చేసిన‌ కమిటీ మరియు వేద విశ్వ‌విద్యాల‌యం వైస్-ఛాన్సలర్ ఆధ్వ‌ర్యంలో ఉమ్మడి సిలబస్, పరీక్షా నమూనా, సర్టిఫికెట్ల జారీ, త‌దిత‌ర అంశాల‌ను విశ్లేషించి స‌మ‌గ్ర‌మైన వేద విద్యా విధానాన్ని రూపొందించాల‌ని వేదపాఠశాలల ప్ర‌ధానాచార్యుల‌ను ఆయ‌న ఆదేశించారు. వేదపాఠశాలల అభివృద్ధి కోసం ప్రతి నెలా క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని  ప్ర‌ధానాచార్యుల‌ను ఆదేశించారు. ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి విద్యార్థి - ఉపాధ్యాయ నిష్పత్తి, వివిధ వేద పాఠశాలలోని ఖాళీలను ఆసక్తి గల వేద పారాయణదార్లు, స్కీమ్ వేద పారాయణదారుల‌తో భర్తీ చేయాలన్నారు.

వేద విశ్వ‌విద్యాల‌యం వైస్-ఛాన్సలర్,  అన్ని వేద పాఠ‌శాల‌ల ప్ర‌ధానాచార్యులు సమన్వయంతో వేద‌ల్లోని ప్రతి మంత్రం యొక్క అర్థం, వివరణ, దాని ప్రాముఖ్యతను తెలియ‌జేస్తూ పుస్త‌కాల‌ను ముద్రించి స‌మాజానికి అందివ్వాల‌న్నారు. " ఇందులోని సారాంశాన్ని వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా, ఒక సాధారణ వ్యక్తి కూడా దాని సారాంశాన్ని సులభంగా అర్థం చేసుకునేలా " రూపొందించాల‌ని చెప్పారు. వేదపారాయణం, పురాణ ప‌ఠ‌ణం, ప్రవచనం మొదలైన నైపుణ్యాలను మెరుగు పరచాలని, వేద విద్యార్ధులను తిరుమల, తిరుచానూరు ఆలయ‌ ఉత్సవాల్లో పాల్గొనే అవ‌కాశాన్ని క‌ల్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.  కుమార అధ్యాపక పథకం, కోవిడ్ నిబంధ‌న‌లు అనుస‌రిస్తూ వేద పాఠశాలల ఎప్పుడు పునః ప్రారంభించాలి, వివిధ వేద పాఠశాలల్లో జ‌రుగుతున్న ఇంజినీరింగ్ పనులపై అద‌న‌పు ఈవో సమీక్షించారు. ఈ స‌మావేశంలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉప కుల‌ప‌తి  సన్నిధానం సుదర్శన శర్మ, రిజిస్ట్రార్ డాక్టర్ కె. తారక రామ కుమార శర్మ, ప్రిన్సిపాల్ ధర్మ వేద విజ్ఞాన పీఠం  కెఎస్‌ఎస్ అవధాని, డెప్యూటీ ఈవో  విజయసారధి, ఎస్వీ ఉన్న‌త వేద అధ్య‌య‌న‌ సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, ఇతర వేద పాఠ‌శాలల ప్ర‌ధానాచార్యులు పాల్గొన్నారు.