యువతను ప్రోత్సహిస్తూ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న రీజినల్ స్కిల్ కాంపిటీషన్కు విశాఖ నగరం ఆతిధ్యం ఇవ్వనుంది. ఏపి, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక,తమిళనాడు,కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన యువత ఈ పోటీలలో భాగమవుతున్నారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వహణపై ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్, హెచ్పిసిఎల్ జిఎం(హెచ్ఆర్) కె.నగేష్ బుధవారం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డితో సమావేశమై చర్చించారు. కార్యక్రమాలను ఆంధ్రవిశ్వవిద్యాలయం వేదికగా జరపాలని నిర్ణయించారు. నవంబరు 30 నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు పోటీలు ఏయూ కన్వెన్షన్ సెంటర్, ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంతో పాటు పలు ప్రాంతాలలో ఏకకాలంలో నిర్వహించాలని నిర్ణయించారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపి స్కిల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఇ, ఎస్డిఐ, ఏయూ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించడం జరుగుతోందని వివరించారు. ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు, యువతకు అధికంగా ఉపయుక్తంగా కార్యక్రమాల నిర్వహణ ఉండాలన్నారు. ఈ కార్యమ్రాన్ని సుమారు 50 వేల మంది వరకు సందర్శించే అవకాశం ఉందని, విభిన్నరాష్ట్రాలనుంచి నిపుణులు, ఉన్నతాధికారులు వస్తారని, వీటికి అనుగుణంగా ఏర్పాట్లు జరగాలన్నారు. కార్యక్రమ నిర్వహణకు ప్రత్యేకంగా వివిధ కమిటీలు ఏర్పాటు చేయాలని, తక్షణం ఏయూలో కార్యక్రమ నిర్వహణకు ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్సిటీ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఏపిఎస్ఎస్డిసి ఇడి డి.వి రామకోటి రెడ్డి, ఎస్డిఐ, ఏపిఎస్ఎస్డిసి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వీసీ ప్రసాద రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి నగేష్ సత్కరించారు.