వీపీఎల్ విజేత మాస్టర్ బ్లాస్టర్స్.. రన్నర్స్ ఎవెంజర్స్..


Ens Balu
1
Visakhapatnam
2022-01-29 05:57:19

క్రీడలకు రాజధానిగా విశాఖ మారనుందని నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి అన్నారు. అందుకు అనేక అవకాశాలు, వనరులు కూడా విశాఖకే ఉన్నాయన్నారు. కెఆర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత అక్టోబర్ నుంచి నిర్వహిస్తున్న విశాఖ ప్రీమియర్ లీగ్ సీజన్-2, ట్వంటీ 20 క్రికెట్ పోటీలు శుక్రవారం ముగిసాయి. రైల్వేస్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో మాస్టర్ బ్లాస్టర్స్ విజయకేతనం ఎగురవేసింది. రన్నరనాన్ని ఎవెంజర్స్ కైవసం చేసుకుంది. విజేతలకు నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, పశ్చిమ శాసనసభ్యులు గణబాబు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు, జబర్దస్త్ ఫేమ్ నటుడు రాంప్రసాద్ తదితరులు అతిధులుగా హాజరై బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు ఎం.రాజాను ఘనంగా అభినందించి అతిధులు చేతులు మీదుగా సత్కరించారు. మేయర్ హరివెంకటకుమారి మాట్లాడుతూ కరోనాలో సైతం వీపీఎల్ నిర్వహించడం అభినందనీయమన్నారు. గణబాబు మాట్లాడుతూ కెఆర్ అసోసియేషన్ రెండు సీజన్లు విజయవంతంగా వీపీఎల్ నిర్వహించిందని భవిష్యత్తులో కూడా మెరుగైన క్రీడాకారులను తీర్చిదిద్దే విధంగా ఈ అసోసియేషన్ కృషి చేయాలన్నారు. జబర్దస్త్ రాంప్రసాద్ క్రీడాకారులకు, విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారీ నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. రంగస్థల నటుడు, నందీ అవార్డు గ్రహీత వంకాయల మారుతీప్రసాద్, ప్రముఖ న్యాయవాద మేడిద బాజినాయుడు, డేటాప్రో అధినేత మేడిద రాజశేఖర్తో పాటు అనేక మంది ప్రముఖులు పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిర్వాహకుడు కె.రాజ మాట్లాడుతూ కెఆర్ అసోసియేషన్ తరుపున విశాఖలో మెరుగైన క్రీడాకారులను తీర్చిదిద్దాలని సంకల్పంతోనే వీపీఎలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు సహకరించిన వారందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.