స్పోర్ట్స్ స్కూల్స్ కి 11నుంచి ఎంపిక


Ens Balu
2
Vizianagaram
2022-07-05 11:47:15

డా. వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్, క‌డ‌ప నందు 4వ‌ త‌రగ‌తిలో ప్ర‌వేశించేందుకు గాను ఈ నెల 11వ తేదీ నుంచి 26 వ‌ర‌కు మూడు ద‌శ‌ల్లో మండ‌ల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు ఎంపిక ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌ని డీఎస్‌డీవో పి. అప్ప‌ల‌నాయుడు తెలిపారు. ఈ మేర‌కు పూర్తి వివ‌రాల‌తో కూడిన ప్ర‌క‌ట‌న మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి క్రీడా పాఠశాల‌లో 40 సీట్లు అందుబాటులో ఉండ‌గా వాటిలో 20 బాలుర‌కు, 20 బాలిక‌ల‌కు కేటాయించిన‌ట్లు పేర్కొన్నారు. 01.08.2022 నాటికి ఎనిమిదేళ్లు నిండి తొమ్మిది సంవ‌త్స‌రాల వ‌య‌సు దాట‌ని వారు ద‌ర‌ఖాస్తు చేసుకొని ఎంపిక‌ల‌కు హాజ‌రుకావాల‌ని ఆయ‌న సూచించారు. ఎలాంటి వ‌య‌సు స‌డ‌లింపులు ఉండ‌వ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ స్ప‌ష్టం చేశారు. మండ‌ల స్థాయిలో ఈ నెల 11 నుంచి 18వ తేదీ వ‌ర‌కు, జిల్లా స్థాయిలో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వ‌ర‌కు ఎంపిక ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని వివ‌రించారు. మండ‌ల స్థాయి  ప్ర‌క్రియ పూర్తి చేసుకున్న విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని అభ్య‌ర్థుల‌కు ఈ నెల 20వ తేదీన రాజీవ్ స్టేడియంలో ఎంపిక ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన అభ్య‌ర్థుల‌కు తుది ప్ర‌క్రియ ఈ నెల 25, 26 తేదీల్లో గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వ‌విద్యాల‌యంలో ఉంటుంద‌ని వివ‌రించారు. అన్ని మండ‌లాల ఎంపీడీవోలు, ఎంఈవోలు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి స్థానికంగా జ‌రిగే ఎంపిక ప్ర‌క్రియ‌ను పార‌ద‌ర్శ‌కంగా, స‌జావుగా నిర్వహించాల‌ని డీఎస్‌డీవో సూచించారు.