17నుంచి జాతీయ ఆర్చరీ పోటీలకు ఎంపికలు


Ens Balu
11
2022-10-15 11:11:36

జాతీయ 42వ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు ఈ నెల 17 నుండి 19 వ తేదీ వరకు పార్వతీపురంలో జరుగుతుందని జిల్లా క్రీడల చీఫ్ కోచ్  ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీల నిర్వహణపై జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో శని వారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో క్రీడల చీఫ్ కోచ్ మాట్లాడారు. జిల్లాలో మొదటి సారిగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ బాలురు, బాలికలు, ఇండియన్ రౌండ్, రికర్వ్ , కాంపౌండ్ పోటీలకు ఎంపికను పార్వతీపురంలో చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు.

 అక్టోబర్ 17 నుండి 19 వరకు పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా అర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా అర్చరీ అసోసియేషన్, చెరుకూరి ఓల్గా అర్చరీ అకాడమీ సంయుక్తంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారని అన్నారు. ఇందులో ఎంపిక అయిన వారు నవంబర్ 3 నుండి 12 వరకు గోవాలో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే జాతీయ పోటీలలో పాల్గొంటారని చెప్పారు. ఎఎఐ నిబంధనల మేరకు ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాల నుండి ప్రతి ఈవెంట్ లో 6గురు బాలురు, 6గురు బాలికలు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. 

17న ఇండియన్ రౌండ్, 18న రికర్వ్,19న కాంపౌండ్ పోటీలకు ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎంపిక జరుగుతుందని ఆయన వివరించారు. ఈ ఎంపిక పోటీలను 17వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, శాసన సభ్యులు అలజంగి జోగారావు ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్ర ఆర్చరీ సంఘం కార్యదర్శి చెరుకురు సత్యనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా ఆర్చరీ సంఘం అధ్యక్షులు డి.టి.గాంధీ, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.రామకృష్ణ, ఎం. మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.