టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు సాధించాలి..


Ens Balu
1
Kakinada
2021-07-22 14:05:21

టోక్యో-2020 ఒలింపిక్స్ లో పాల్గొంటున్న మన దేశ, రాష్ట్ర , జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయ పతకాలతో, ఆరోగ్యంగా తిరిగి స్వదేశానికి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి తెలిపారు. గురువారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులును ఉత్సాహపరిచే విధంగా  జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
"సెల్ఫీ" స్టాండ్ ను జాయింట్ కలెక్టర్లు కీర్తి చేకూరి(అభివృద్ధి),జి.రాజకుమారి (ఆసరా&సంక్షేమం) లతో కలిసి కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో జరగబోయే ఒలింపిక్స్ గత సంవత్సరం జరగాల్సి ఉన్న  కరోనా వైరస్ కారణంగా వాటిని వాయిదా వేసి ప్రస్తుతం 2021సంవత్సరంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. భారతదేశం నుంచి ఈ ఒలింపిక్స్ లో సుమారుగా 18 క్రీడాంశాల్లో  మనదేశ నుంచి 100 మంది క్రీడాకారులు విజయం సాధించే లక్ష్యంతో పూర్తి సన్నద్ధతో టోక్యోకు ప్రయాణమయ్యారన్నారు. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి ముగ్గురు క్రీడాకారులు పి.వి.సింధు, ఆర్.సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్) ఆర్.రజిని (హాకీ) క్రీడాకారులు ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ మొదటిసారిగా ఒలింపిక్స్ లో  బ్యాడ్మింటన్ పోటీలో పాల్గొనడం మన జిల్లాకు గర్వకారణమన్నారు. మన దేశం, రాష్ట్రం, ముఖ్యంగా మన జిల్లా నుండి పాల్గొన్న క్రీడాకారులు అందరూ కరోనా బారిన పడకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ పోటీలలో పాల్గొని,విజేతలుగా పతకాలు సాధించి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులందరికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.  టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా పోటీల్లో పాల్గొంటున్న వారందరికీ ఉత్సాహం,ఉత్తేజ పరచుటకుగాను స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రీడామైదానంలోను ,తుని, అమలాపురం, సామర్లకోట క్రీడా ప్రాంగణములలో  సెల్ఫీ స్టాండ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని సెట్రాజ్ సీఈవో ఎం.భానుప్రకాష్ తెలిపారు. స్థానిక క్రీడాకారులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సెల్ఫీ దిగి, షేర్ చేసి క్రీడాకారులను ప్రోత్సహించవలసిందిగా ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.