అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన చివరి పోరులో విజయనగరం రెవెన్యూ డివిజన్ జట్టు విజయం సాధించింది. చివరి ఓవర్లో కొట్టిన రెండు సిక్స్ లు , ఆటను మలుపు తిప్పాయి. ఆఖరి ఓవర్లో కలెక్టరేట్ జట్టు రెండు వికెట్లు తీసినప్పటికీ, 13 పరుగులు సమర్పించడంతో విజయం దక్కలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన కలెక్టరేట్ జట్టు, నిర్ణీత 15 ఓవర్లలో 109 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన విజయనగరం డివిజన్ జట్టు ఆఖరి బంతికి 110 పరుగులు చేసి విజయం సాదించింది. కెప్టెన్ గా వ్యవహరించిన ఆర్డీవో భవానీ శంకర్ ఆల్రౌండ్ ప్రతిభ చూపించగా, శ్రీనివాసరావు 40 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఉదయం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో పార్వతీపురం రెవెన్యూ డివిజన్, విజయనగరం రెవెన్యూ డివిజన్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విజయనగరం, నిర్ణీత 15 ఓవర్లలో 127 పరుగులు చేయగా, తరువాత బ్యాటింగ్ కి దిగిన పార్వతీపురం జట్టు 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫైనల్ పోటీలో జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జిసి కిషోర్ కుమార్, డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ కూడా బరిలోకి దిగారు. జాయింట్ కలెక్టర్ జె.వెంకటరావు గ్యాలరీలో ఉండి క్రీడాకారులను ప్రోత్సహించారు. రెవెన్యూ అసోసియేషన్ నాయకులు తాడ్డి గోవింద, గొట్టాపు శ్రీరామ్మూర్తి, రమణరాజు తదితరులు పాల్గొన్నారు.