రాష్ట్రంలో క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు నూతన క్రీడా పాలసీని త్వరలో ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్నట్లు మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు తెలిపారు. ముసాయిదా క్రీడా పాలసీ సిద్దమైందని, ముఖ్యమంత్రి ఆమోదంతో త్వరలో అది చట్టరూపం దాల్చనుందన్నారు. గ్రామీణా ప్రాంతాల్లో ఎంతో మంది ప్రతిభగల క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలుగా దాగిఉన్నారని, వారందరినీ ప్రోత్సహించడంతో పాటు పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు ఈ పాలసీ ఎంతగానో దోహదపడుతుందన్నారు. సి.ఎస్.ఆర్. క్రింద క్రీడా ప్రాంగణాల అభివృద్ది, క్రీడాకారుల దత్తత కార్యక్రమాన్ని కూడా ఈ పాలసీలో ప్రతిపాదించడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో మూడు అంతర్జాతీయ స్థాయి స్టేడియంలను అభివృద్ది పర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 13 జిల్లాల్లో 15 క్రీడా ప్రాంగణాలను అభివృద్ది పరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఖేల్ ఇండియా పథకంలో భాగంగా నాగార్జున యూనివర్సిటీ గ్రౌండును అభివృద్ది పర్చామని, విశాఖ జిల్లా కొమ్మాదిలో కూడా క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ది పర్చనున్నట్లు ఆయన తెలిపారు. క్రీడా కారులను ప్రోత్సహించేందుకు వైఎస్ఆర్ క్రీడా పురస్కారాలను అందజేయడం జరుగుచున్నదని, గత రెండున్నర్ర ఏళ్లలో సుమారు రూ.6 కోట్ల మేర నిధులను వెచ్చించడం జరిగిందన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సిందుకు విశాఖ నడిబొడ్డున రెండు ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందని, త్వరలో బ్యాడ్మింటన్ అకాడమీని ఆమె ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఒలింపిక్స్ లో పురస్కారాన్ని సాదించిన హాకీ క్రీడాకారిణి రజనీకి సుమారు రూ.85 లక్షల నగదును ప్రభుత్వం అందజేసిందని, ఆమె తమ్మునికి జాబ్ ను కూడా ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఏ.పి.టి.డి.సి. చైర్మన్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రతకు, భద్రతకు, ఆనందానికి, ఆహ్లదానికి కేంద్రాలుగా పర్యాటక హాటళ్లను తీర్చిదిద్దుతామని, అవకాశం ఉన్నచోట్ల ఫ్లోటింగ్ రెస్టారెంట్లను, రోప్ వేలను ఏర్పాటు చేస్తామని, ట్రైక్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తామని, ఉభయ గోదారి జిల్లాల్లో దీవులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ది పరుస్తామని, ప్రస్తుతం ఉన్న పర్యాటక ప్రాంతాలకు అదనంగా మరి కొన్ని కొత్త ప్రాంతాలను గుర్తిస్తామని అన్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో నూతన క్రీడా పాలసీని త్వరలో అమల్లోకి తెస్తామని, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా ప్రాంగణాలను, మౌలిక వసతునలు పెద్ద ఎత్తున కల్పిస్తామని అన్నారు. సి.ఎస్.ఆర్. క్రింద క్రీడల అభివృద్దికి కృషిచేస్తామని, ఒడిస్సా, తమిళనాడు రాష్ట్రాల తరహాలో ఆంద్రప్రదేశ్ లో కూడా ఒక ప్రత్యేక క్రీడను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి, యువజన శాఖ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.రజత్ భార్గవ్ , ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ సి.ఇ.ఓ. ఎస్.సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.