20నుంచి వీజెఎఫ్-సిఎంఆర్ స్పోర్ట్స్ మీట్..
Ens Balu
2
Visakhapatnam
2021-09-13 07:10:19
వైజాగ్ జర్నలిస్టుల ఫోరం-సిఎంఆర్ ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ ను ఈనెల 20 నుంచి ఘనంగా నిర్వహించనున్నట్లు ఫోరం అధ్యక్ష కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్.దుర్గారావులు తెలిపారు. సోమవారం విశాఖలోని డాబాగార్డెన్స్ వీజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల క్రీడలకు సంబంధించిన ట్రోఫీలను పాలకవర్గం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ సహకారంతో ఈటోర్నీ నిర్వహిస్తున్నామన్నారు. 20న పోర్టు స్టేడియం వేదికగా జర్నలిస్టుల క్రీడలు ప్రారంభమవుతాయని, పలు వేదికల మీద ఇండోర్ , ఔట్ డోర్ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ టోర్నీకి ఛైర్మన్ గా వీజెఎఫ్ కార్యదర్శి ఎస్.దుర్గారావు వ్యవహరించనున్నారు. జర్నలిస్టులకు సంబంధించి క్రికెట్ తో పాటు షటిల్, చెస్, కేరమ్స్, అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. క్రీడల్లో పాల్గొనదలిచే జర్నలిస్టులు ఈ నెల 18 లోగా తమ జట్ల వివరాలను వీజెఎఫ్ ప్రెస్ క్లబ్, డాబాగార్డెన్స్ కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఈ టోర్నీకి కో చైర్మన్లుగా వీజెఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్.నాగరాజుపట్నాయక్ , టి.నానాజీ , జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, కోశాధికారి పి.ఎన్.మూర్తులు వ్యవహరించనున్నారు. 28న ముగింపు పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు ఉమాశంకర్ బాబును ఘనంగా సత్కరించారు. టోర్నీ విజయవంతానికి తమ అసోసియేషన్ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని ఉమాశంకర్ బాబు చెప్పారు. సమావేశంలో వీజెఎఫ్ కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వరరావు , పి టి ఐ భాస్కర్, ఎమ్ఎస్ఆర్ ప్రసాద్, గయాజ్, డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.