"అక్కినేని " "నందమూరి" ల అనుబంధం


Naveen Prasad
3
సినెమా డెస్క్
2020-12-16 20:56:12

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వత ముద్ర వేసుకున్న హీరోలు ఒకరు అక్కినేని ,మరొకరు నందమూరి .ఈ ఇద్దరు కథానాయకులు తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోతారనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగు ప్రేక్షకులకు వీరిద్దరి సినిమాలంటే ఎంతో మక్కువ ఎక్కువ .ఒకరు "ఎన్టీవోడు"గా మరొకరు "నాగ్గాడు" గా తెలుగు ప్రజానీకం హృదయాలలో శాశ్వత ముద్రను వేసుకున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకరు "నటరత్న " , మరొకరు "నటసామ్రాట్" ఒకరు "నందమూరి అందగాడు", మరొకరు "అక్కినేని చక్క నోడు" వీరిద్దరూ కలసి 14 చిత్రాల్లో నటించారు . ప్రపంచ సినీ చరిత్రలోనే సమానస్థాయి కలిగినటువంటి అగ్ర హీరోలు ఒకటీ, రెండు సినిమాలలో నటించడమే గగనం. ఇటువంటి తరుణంలో 14 చిత్రాలలో వీరిరువురూ కలిసి నటించారు. ఇది వీరి మధ్య ఉన్న స్నేహానికి నిదర్శనం . నటనలో నువ్వా ? నేనా ?అనే విధంగా ఎన్టీయార్, ఏఎన్నార్ 14 చిత్రాలలో నటించడం ఎంతో అరుదైన విషయం. మరెంతో అపురూపమైన సంఘటన . వీరు నటించిన చిత్రాల వివరాలను తెలియజేస్తున్నాం . 1950వ సంవత్సరం లో "పల్లెటూరి పిల్ల ", 1950వ సంవత్సరంలో "సంసారం", 1954వ సంవత్సరంలో "పరివర్తన" , 1955వసంవత్సరంలో "మిస్సమ్మ ", 1956వ సంవత్సరంలో "తెనాలి రామకృష్ణ ", 1956వ సంవత్సరంలో "చరణదాసి ", 1957వ సంవత్సరంలో "మాయాబజార్ ", 1958వ సంవత్సరంలో "భూకైలాస్", 1962వ సంవత్సరంలో "గుండమ్మకథ", 1963వ సంవత్సరంలో "శ్రీకృష్ణార్జున యుద్ధం ", 1977వ సంవత్సరంలో "చాణక్య-చంద్రగుప్త", 1978వ సంవత్సరంలో "రామకృష్ణులు", 1981వ సంవత్సరంలో "సత్యం -శివం ",చిత్రాలలో నటించారు . 1954వ సంవత్సరంలో నందమూరి తారకరామారావు హీరోగా నటించిన "రేచుక్క" చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు అతిథి పాత్రను పోషించడం విశేషం . ఈ మహానటుల జీవితంలోఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి . వీరి మధ్య ఉన్న బంధానికి, అనుబంధానికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే .