60 ఏళ్ళు దాటిన వారికి కోవిడ్ వాక్సిన్..


Ens Balu
2
Srikakulam
2021-02-28 21:21:38

శ్రీకాకుళం జిల్లాలో 60 ఏళ్ళు దాటిన వారందరికీ నేటి నుండి కోవిడ్ వాక్సిన్ వేయడం జరుగు తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు సంయుక్త కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసారు. ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కోవిడ్ వాక్సిన్  మూడవ దశలో భాగంగా సోమవారం నుండి అందుబాటులోకి వచ్చిందని, దీనిని సంబంధిత వయస్సు ప్రజలందరూ తప్పనిసరిగా వినియోగించు కోవాలని జె.సి కోరారు. జిల్లాలో 60 ఏళ్ళు దాటిన వారితో పాటు 45 - 50 సం.లు కలిగి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి కూడా కోవిడ్ టీకా వేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో గల 105 ప్రభుత్వ ఆసుపత్రులైన  ప్రాధమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ , ఏరియా మరియు జిల్లా ఆసుపత్రులలో టీకా ఉచితముగా ఇచ్చేందుకు ఏర్పాటు చేయటం జరిగగిందని జె.సి వివరించారు. వీటితో పాటు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ అనుబంధ ఆసుపత్రులయిన జెమ్స్ఆసుపత్రి-రాగోలు, గొలివి ఆనుపత్రి, శ్రీకాకుళం బగ్గు సరోజినీదేవి ఆసుపత్రి- శ్రీకాకుళం, కిమ్స్ సాయి శేషాద్రి ఆసుపత్రి-శ్రీకాకుళం, పి.వి.యస్ రామ్మోహన్- పొందూరు, సిందూర ఆసుపత్రి శ్రీకాకుళం, జి.ఎమ్ఆర్ వరలక్ష్మి కేర్- రాజాం, అమృత ఆసుపత్రి-రాజాం, నెఫ్రోప్లస్  (రిమ్స్) ఆసుపత్రి - శ్రీకాకుళంలో టీకా వేయడం జరుగుతుందని తెలిపారు. అయితే  డోసు ఒక్కింటికి రూ.250/-లు సాధారణ రుసుము  చెల్లించి కోవిడ్ వాక్సిన్ ను పొందవలసి ఉంటుందని చెప్పారు. కోవిడ్ టీకా కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కోవిన్- 2.0 యాప్ నందు సోమవారం నుండి నమోదు చేసుకునేందుకు అవకాశము కల్పించబడిందని తెలిపారు. యాప్ లో పైన పేర్కొన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వివరాలు ఉంచబడ్డాయని, అంతే కాకుండా ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా నమోదు చేసుకొనే అవకాశాన్ని కల్పించబడినట్లు జె.సి స్పష్టం చేశారు. యాప్ లో సదరు ఆసుపత్రుల వివరములతో పాటు సమయాన్ని అనుసరించి టీకా పొందేందుకు వీలుగా నమోదు చేసుకోవచ్చని, ఈ వివరాలు నమోదు జరిగిన వెంటనే సమయాన్ని కేటాయిస్తూ ఫోన్ కు సంక్షిప్త సమాచారం వస్తుందని జె.సి వివరించారు. కోవిన్ యాప్ లో ముందస్తుగా వివరాలు నమోదు చేయకున్నప్పటికి టీకా పొందే సౌలభ్యం ఉందని, దీనికిగాను సంబంధిత కేంద్రం లో ఆ రోజు  టీకా వేయుంచుకొనే వారు తక్కువ మంది ఉంటే తక్షణమే తమ వివరాలు నమోదు చేసుకొని టీకా తీసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. 45 - 50 ఏళ్ళు పైబడి 20 రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు సదరు కోవిడ్ పొందుటకుగాను టీకా పంపిణీ కేంద్రానికి వెళ్లి అక్కడి సిబ్బందికి రిజిస్టర్ వైద్యులు ఇచ్చిన సంబంధిత దీర్ఘకాలిక వ్యాధి. ధ్రువీకరణ పత్రము చూపించాలని, 60 ఏళ్ళు దాటిన వారికీ వైద్యుల ధ్రువీకరణపత్రము అవసరము లేదని, వయస్సును గుర్తించేందుకు జనవరి 1, 2022 ను ప్రామాణికముగా తీసుకునేందుకు గుర్తింపు కార్డు లో ఏదో ఒకటి అనగా ఆధార్ కార్డు, ఫోటో తో కూడిన ఓటర్ కార్డు, బైపింగ్ లైసెన్సు కార్డు, పాస్ పోర్ట్ , ఫోటో తో ఉన్న ఫించన్ కార్డు లేదా జాతీయ జనాభా నమోదు కార్డు చూపించి వాక్సిన్ పొందవచ్చని జె.సి స్పష్టం చేశారు. గర్భిణీలు, బాలింతలు, ఎలర్జీ సమస్యలు ఉన్నవారు కోవిడ్ టీకా పొందేందుకు అనర్హులని జె.సి తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన  ఆ ప్రకటనలో కోరారు.