డీ వార్మింగ్ డే విజయవంతం చేయాలి..
Ens Balu
4
Srikakulam
2021-03-02 18:51:21
చిన్నారులలో నులిపురుగు నివారణకు డీవార్మింగు డేను బుధ వారం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డి.ఎం.హెచ్.ఓ) డా.కె.సి.చంద్ర నాయక్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో మంగళ వారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో డి.ఎం.హెచ్.ఓ వివరాలు తెలిపారు. బాల స్వాస్త్య కార్యక్రమం క్రింద మార్చి 3 న డీ వార్మింగ్ డే కార్యక్రమంను నిర్వహిస్తున్నామన్నారు. పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా మార్చి 3న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్ధులకు డీ-వార్మింగ్ మాత్రలు (ఆల్బెండ్జోల్ -400 మి.గ్రా.) నమిలి తినిపించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం చేతులు శుభ్రపరచుకోవడం, పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత కోసం తెలియజేయడం జరుగుతుందని అన్నారు. నులిపురుగుల వలన ఏర్పడే సమస్యలను వివరించాలని ఆదేశించామని పేర్కొన్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం మాత్రలు నమిలి మింగించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్ధులు, అంగన్వాడీ కేంద్రాలలో మొత్తం 5,98,065 మంది చిన్నారులకు డీ వార్మింగ్ మాత్రలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఏ ఒక్కరూ తప్పిపోరాదని తెలిపారు. కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ, ఐ.సి.డి.ఎస్, విద్యాశాఖలు సమన్వయంతో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలను మింగించడం జరుగుతుందని, గ్రామాలలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వఛ్ఛంద సేవా సంఘాలు కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఈ మాత్రలు వేసుకోవడం వలన ఎటువంటి దుష్పరిణామాలు వుండవని తెలిపారు. అయితే కోవిడ్ వాక్సిన్ వేసుకోవలసిన 19 సంవత్సరాల వయస్సుగల పిల్లలు వాక్సిన్ వేసుకున్న తరువాత మాత్రలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎటువంటి ప్రభావం ఉండదని, అయినప్పటికి ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు.
అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.జగన్నాధం మాట్లాడుతూ చిన్నారులలో నులి పురుగులు ఉండటం వలన రక్త హీనత ఏర్పడుతుందన్నారు. తద్వారా ఎదుగుదల సమస్య వస్తుందని, రక్తహీనత కారణంగా వివిధ సమస్యలు ఏర్పడుతుందని చెప్పారు. నులిపురుగులను అరికట్టుటకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీ వార్మింగు డేను నిర్వహిస్తున్నామని తెలిపారు. బహిరంగ మలవిసర్జన కారణంగా నులిపురుగుల సమస్య ఎక్కువగా ప్రభలుటకు అవకాశం ఉంటుందన ఆయన వివరించారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ సమన్వయ అధికారి డా.కె.అప్పారావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.ఎల్.భారతీ కుమారి దేవి, జిల్లా మలేరియా అధికారి వీర్రాజు, డిబిసిఎస్ ప్రాగ్రాం అధికారి డా.రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.