బాలల ఆరోగ్యమే దేశ సౌభాగ్యం..
Ens Balu
4
Srikakulam
2021-03-03 16:06:29
బాలలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం సౌభాగ్యంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అభిప్రాయ పడ్డారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో డీ-వార్మింగ్ మాత్రల పంపిణీ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు డీ వార్మింగ్ మాత్రలు (ఆల్బెండ్ జోల్ 400 మి.గ్రా ) వేసి నమిలి తినిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు 4 లక్షల 42 వేల 328 మంది ఉన్నారని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 1 లక్ష 52 వేల 486 మంది పిల్లలు ఉన్నారని, బడికి వెళ్లని పిల్లలు 3 వేల 251 మంది వెరశి 5,98,065 మంది పిల్లలు ఉన్నారని కలెక్టర్ చెప్పారు. వీరందరికీ ఈ నెల 9 వరకు డీ-వార్మింగ్ మాత్రలను వేయించడం జరుగుతుందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లోని 1 నుండి 2 సం.ల పిల్లలకు సగం మాత్ర (200 మి.గ్రా ), 2 నుండి 5 ఏళ్లు వారికి 1 మాత్ర , 6 నుండి 19 ఏళ్ళు లోపు గల పాఠశాల, కళాశాలలకు వెళ్లని పిల్లలకు అంగన్వాడీ కార్యకర్తల ద్వారా మాత్రలను వేయించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి పాఠశాలలో ఉదయం 08.00 గం.ల నుండి సాయంత్రం 05.00 గం.ల వరకు నిర్దేశించిన ప్రణాళిక పద్దతిలో కార్యక్రమం జరుగుతుందని అన్నారు. మధ్యాహ్నం భోజనం తరువాత ప్రతి విద్యార్థికి 1 మాత్ర నమిలి తినిపించడం జరుగుతుందని తెలిపారు. ఈ మాత్రలు తీసుకోవడం వలన ఏ విధమైన దుష్పరిణామాలు ఉండవని , ఒకవేళ దుష్పరిణామాలు కనిపించినట్లయితే దగ్గరలోని పి.హెచ్.సి వైద్యాధికారిని సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖాధికారి డా.ఎం.సి.చంద్రనాయక్, అదనపు వైద్య శాఖాధికారి డా.బి.జగన్నాథరావు, రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం జిల్లా సమన్వయ అధికారి డా. కె.అప్పారావు, డా.కె.కృష్ణమోహన్, జిల్లా విద్యా శాఖాధికారి కె.చంద్రకళ, సమగ్ర శిక్ష ప్రోజెక్టు అధికారి పైడి వెంకట రమణ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం.వాగ్దేవి, ఇతర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.