లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధం..


Ens Balu
3
Srikakulam
2021-03-03 21:25:11

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ అన్నారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలపై జిల్లా స్థాయి మల్టీ మెంబర్ ఏప్రోప్రియేట్ అథారిటీ సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రిజిస్టర్ అయిన కేంద్రాలు మాత్రమే వైద్య పరంగా అత్యవసర సమయాల్లో మాత్రమే ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. రిజిస్టర్ కానీ కేంద్రాలు వైద్య పరీక్షలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయరాదని ఉద్బోధించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారికి మొదటి సారి 3 సంవత్సరాలు జైలు శిక్ష లేదా రూ.10 వేలు వరకు అపరాధ రుసుము లేదా రెండూ ఉంటాయని చెప్పారు. రెండవ సారి అయితే హెచ్చింపు శిక్ష ఉంటుందని తెలిపారు. ఎక్కడా బాలికల జనాభా తగ్గరాదనే ఉద్దేశ్యంతో చట్టం చేయడం జరిగిందని చెప్పారు. నైతిక విలువలు పాటించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏ.ఎన్.ఎం, ఆశా కార్యకర్తల వద్ద గర్భిణీ మహిళల వివరాలు ఉండాలని తద్వారా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించుటకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుటుంబ పరిస్థితులు, సమాజ పరిస్థితుల రీత్యా కొన్ని ప్రాంతాల్లో బాలిక భారం అనే భావంతో జరిగే అవకాశం ఉండవచ్చని, ప్రభుత్వం కల్పించే సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై అవగాహన కలిగించాలని సూచించారు. తద్వారా బాలిక భారం కాదని గుర్తించగలరని పేర్కొన్నారు. చట్టబద్ధమైనది, సమాజాహితమైనది చేయాలని సూచించారు. స్కానింగ్ కేంద్రాలలో పని చేసే ప్రతి ఒక్కరూ విశ్వసనీయత కలిగి ఉండాలని సూచించారు. ప్రజలకు న్యాయ సహాయానికి లీగల్ క్లినిక్ లను ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. అబ్బాయిలను నైతిక బాధ్యతతో ఉండేవిధంగా, సత్ప్రవర్తన కలిగి ఉండేవిధంగా సమాజంలో మార్పు రావాలని ఆయన అన్నారు.         జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేయరాదని  స్పష్టం చేసారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమన్నారు. అన్ని స్కానింగ్ కేంద్రాలు విధిగా తనిఖీ చేయాలని అన్నారు. ప్రోగ్రాం అధికారులకు ఇచ్చిన లక్ష్యాల మేరకు విధిగా తనిఖీలు పూర్తి చేయాలని స్పష్టం చేసారు. నెలవారీ నివేదికను నిర్దేశించిన సమయంలో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. నివేదికలు సమర్పించని కేంద్రాల లైసెన్స్ లను రద్దు చేస్తామని హెచ్చరించారు. పురుష, మహిళా నిష్పత్తి ప్రమాదకర భవిష్యత్తును సూచిస్తున్నాయని పేర్కొన్నారు. వృత్తి పట్ల గౌరవ భావంతో ఉండాలని, వృత్తి ధర్మాన్ని పాటించాలని స్పష్టం చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వాటిపై చర్యలు కఠినంగా ఉంటాయని గుర్తించాలని హెచ్చరించారు.         పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ లింగ వివక్ష ఉండరాదని స్పష్టం చేసారు. లింగ పరంగా అసమతౌల్య పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. తద్వారా సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతాయని అన్నారు. ప్రకృతి సహజసిద్ధతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు. వైద్య కేంద్రాలు సెంటర్స్ ఆఫ్ చేంజ్ గా మాత్రమే ఉండాలని పేర్కొన్నారు. పారదర్శకంగా పనిచేసి సమాజంలో మంచి మార్పుకోసం మాత్రమే పనిచేయాలని సూచించారు. బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. లింగ నిర్ధారణ చట్ట విరుద్ధమని స్పష్టం చేసారు. లింగ నిర్ధారణ చేయడం వలన సమాజానికి చేటు చేస్తున్నారని గుర్తించాలని తెలిపారు. లింగ నిర్ధారణ చేసేవారికి కనీసం మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ సామూహిక బాధ్యతతో పనిచేయాలని కోరారు. ఆసుపత్రిలోనే లింగ నిర్ధారణపై అవగాహన ప్రారంభం కావాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ స్కానింగ్ కేంద్రాలు నివేదికలను సమర్పించాలన్నారు. అదనపు డిఎంహెచ్ఓ డా.బి.జగన్నాథ రావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో 95 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం పురుష, మహిళా జనాభా నిష్పత్తి 933 ఉండగా, చిన్న పిల్లల్లో 927 మాత్రమే ఉందని, 2011లో పెద్దవారి నిష్పత్తి 992 ఉండగా చిన్న పిల్లల్లో 946 మాత్రమే ఉందన్నారు. సీతంపేట, కొత్తూరు, బూర్జ, సారవకోట మండలాల్లో నిష్పత్తి ఆశాజనకంగా ఉందన్నారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డా.కె.సి.చంద్ర నాయక్, వైద్య శాఖ అధికారులు బి.సూర్యారావు, ఎల్.భారతీ కుమారీ దేవి, వీర్రాజు , వైద్యులు తదితరులు పాల్గొన్నారు.