కోవిడ్ వేక్సిన్ ప్రతీ ఒక్కరూ తీసుకోవాలి..


Ens Balu
3
Srikakulam
2021-03-06 13:05:09

శ్రీకాకుళం జిల్లాలో  పెద్దఎత్తున చేపడుతున్న కోవిడ్ వేక్సినేషన్ టీకాను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకొని, కరోనా వైరస్ నుండి విముక్తి పొందాలని శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సీనియర్ సిటిజన్స్ వేక్సినేషన్ లో భాగంగా శనివారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ( రిమ్స్ ) లో శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు దంపతులు కోవిడ్ వేక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కు కూడా వేక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని,  అందులో భాగంగా రిమ్స్ కు వచ్చి వేక్సిన్ తీసుకోవడం జరిగిందని చెప్పారు. జిల్లాలో   మార్చి 1 నుండి 60 ఏళ్లు దాటిన వారికి , 40 ఏళ్లు నిండి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి  కూడా వేక్సిన్ వేసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఇందుకు 105 ప్రభుత్వ ఆసుపత్రులు (పి.హెచ్.సిలు, సి.హెచ్.సిలు )లతో పాటు 9 ఆరోగ్య శ్రీ ట్రస్ట్ గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులు గుర్తించారని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులలో రూ.250/-లు రుసుము వసూలు చేస్తారని,  105 ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వేక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు జరిగాయని వివరించారు. ఇప్పటివరకు మొదటి డోస్ క్రింద ఫ్రంట్ లైన్ వారియర్లు అయిన 16,327 మందికి , రెండవ డోస్ క్రింద 10,687 మందికి వేక్సిన్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. అలాగే  పారిశుద్ధ్య కార్మికులు, ఇతరులకు మొదటి డోస్ క్రింద 18,370 మందికి రెండవ డోస్ లో 1,410 మందికి వేక్సిన్ వేయడం జరిగిందని శాసనసభ్యులు తెలిపారు. అదేవిధంగా పోలీసు శాఖలో పనిచేస్తూ రిస్క్ ఎక్కువ కలిగిన  2,269 మందికి వేక్సిన్ ఇవ్వడం జరిగిందని, అలాగే 60  ఏళ్లు దాటిన   3,126 మందికి,  40-55 ఏళ్లు నిండి వివిధ వ్యాధులతో బాధపడుతున్న  866 మందికి వేక్సినేషన్ చేయడం జరిగిందని తెలిపారు. దీనిపట్ల ఇప్పటికీ కొంతమందికి అపోహలు ఉన్నాయని, తెలిసీ తెలియని వారు అభిప్రాయాలు వ్యక్తం చేయడం, కొంతమందిలో కొన్ని అనుమానాలు, భయాలు ఉండటం వలన ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాలను ఉపయోగించుకోలేని  వారు ఉన్నారని అన్నారు. అటువంటి భయాలను ప్రారద్రోలేందుకే భారత ప్రధాని తొలి డోస్ తీసుకున్నారని, ఆ విషయాన్ని మనందరం తిలకించడం జరిగిందని గుర్తుచేసారు.   కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు , మంత్రులు, వైద్యులందరు తీసుకోవడం జరిగిందని, అయినప్పటికీ ఇంకా భయం ఎందుకని శాసనసభ్యులు ప్రశ్నించారు.  ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక కార్యక్రమం ఇదని, మనదేశంలో కూడా 130 కోట్ల మందికి వేక్సినేషన్ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని, ఇందుకోసం వేలాది కోట్లు ఖర్చుచేసేందుకు సిద్ధమైందని చెప్పారు. తెలిసీ తెలియని అభిప్రాయాలను నమ్మి వేక్సినేషన్ తీసుకోకపోవడం అమాయకత్వం అవుతుందని తెలిపారు. మన జిల్లాలో ఇంత పెద్దఎత్తున  చేపడుతున్న ఈ సౌకర్యాన్ని ప్రతీ ఒక్కరూ  సద్వినియోగం చేసుకోవాలని, ఇంకా టీకా వేసుకోని సీనియర్ సిటిజన్స్, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు గాని ఉంటే తక్షణమే వివరాలు నమోదుచేసుకొని టీకా తీసుకొని వైరస్ నుండి విముక్తి పొందాలని ఆయన సూచించారు. ఇదివరకే మొదటి డోస్ తీసుకున్న వారు 28 రోజుల తర్వాత రెండవ డోస్ తీసుకోవాలని, జిల్లా ప్రజలందరూ టీకాను ఉపయోగించుకోవాలని ఆయన వివరించారు.         ఈ కార్యక్రమంలో అదవపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బగాది జగన్నాధరావు, రాష్ట్రీయ బాల స్వాస్త్వ ఆరోగ్య కార్యక్రమం జిల్లా సమన్వయ అధికారి డా. కె.అప్పారావు, డా. కె.కృష్ణమోహన్, ఆర్.ఎం.ఓ డా. అరవింద్, రిమ్స్ సూపరింటెండెంట్ రామకృష్ణ, వరుదు విజయకుమార్, సాధు వైకుంఠరావు, లుకలాపు గోవిందరావు , ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.