ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చాలి..
Ens Balu
3
Vizianagaram
2021-03-15 20:20:07
విస్తృతమైన అవగాహన కల్పించడం ద్వారా జిల్లాను ఎయిడ్స్ రహితంగా మార్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కోరారు. హెచ్ఐవి, ఎయిడ్స్పై కళాజాతాల ద్వారా ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని ఆయన సోమవారం కలెక్టరేట్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ ఆద్వర్యంలో ఈనెల 15 నుంచి 30 వ తేదీ వరకు కళాజాతా బృందాలతో వీధినాటకాల ద్వారా ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ థియేటర్ ఆర్ట్స్, ప్రతిభా ఆర్ట్స్ బృందాలు, ముందుగానే ఎంపిక గ్రామాల్లో 28 కార్యక్రమాలను నిర్వహించి, ఎయిడ్స్ ఎలా సంక్రమిస్తుందీ, వ్యాప్తి, నివారణా, నియంత్రణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. జిల్లాలో ఎయిడ్స్ కేసులు తగ్గుతున్నాయని, వీటిని పూర్తిగా నివారించడానికి ఇటువంటి ప్రచార కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖాధికారి(ఎయిడ్స్, లెప్రసీ) డాక్టర్ జె.రవికుమార్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పి.బాలాజీ, ఇతర సిబ్బంది, ఎన్జిఓల ప్రతినిధులు పాల్గొన్నారు.