పెరుగుతో అపర వ్యాధి నిరోధకత సొంతం..


Ens Balu
8
Visakhapatnam
2021-07-26 02:59:52

కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి రోజుకి 250 గ్రాములు పెరుగుని ఆహారంగా తీసుకుంటే చాలు అంటున్నారు వైద్యులు. పెరుగు తినేవారిలో రోజూ యాంటీబయాటిక్స్‌ వేసుకున్నంతటి  ఫలితం ఉంటుందనీ చెబుతున్నారు. పైగా ఇది స్వాభావికంగా కలిగే రోగనిరోధక శక్తి కాబట్టి ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవంటూ ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వియన్నాలో శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అంతేకాదు.. పెరుగులో పొటాషియమ్, మెగ్నీషియమ్‌ ఎక్కువగా ఉండటం వల్ల అది అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో దోహద పడతాయట. మిగతావారితో పోలిస్తే కొవ్వు అంతగా లేని పెరుగు తినేవారిలో హైబీపీ వచ్చే అవకాశాలు 31% తక్కువగా ఉంటాయని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (ఏహెచ్‌ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రీసెర్చ్‌ సైంటిఫిక్‌ సెషన్స్‌లో పాల్గొన్న కొందరు శాస్త్రవేత్తలు వివరించారు. ఇక మహిళలకు పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు ఇన్నీ అని చెప్పలేం. పెరుగులోని ల్యాక్టోబాసిల్లస్‌ అసిడోఫిల్లస్‌ బ్యాక్టీరియా అనే మంచి బ్యాక్టీరియా వల్ల మహిళల్లో అనేక ఇన్ఫెక్షన్లు నివారితమవుతాయి. అతి ముఖ్యంగా మహిళల యోనిలో పెరిగే హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టించి, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మహిళల ఆరోగ్యాన్ని కాపాడటంలో పెరుగు చాలా కీలకంగా వ్యవహరిస్తుందని చెబుతున్నారు. పెరుగులోని మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను చురుగ్గా పనిచేసేలా చూడటం మాత్రమే కాదు... కడుపులో మంటనూ తగ్గిస్తుంది. అందువల్ల తాజా పెరుగుతో చిలికిన మజ్జిగ తాగగానే కడుపు మంట తగ్గడం మనం గమనిస్తూనే ఉంటాం..ఇంకెందుకు ఆలస్యం సహజ సిద్ధంగా పెరుగుతోనే లభించే రోగనిరోధక శక్తిపెంపొందించుకొని ఆరోగ్యంగా ఉండండి..