ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం రాత్రి ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న సీఎం కి టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి గారు, ఈవో డాక్టర్ కెఎస్. జవహర్ రెడ్డి గారు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అర్చకులు ముఖ్యమంత్రి కి తలపాగా కట్టి పళ్లెం లో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఉంచారు. ముఖ్యమంత్రి వీటిని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆలయంలో అర్చకులకు అందించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రికి శేషవస్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి కి స్వామివారి తీర్థప్రసాదాలు, ఒంటిమిట్ట రాములవారి చిత్రపటం అందజేశారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రి రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, శ్రీ అవినాష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమరనాథ రెడ్డి, శాసన సభ్యులు మేడా మల్లిఖార్జున రెడ్డి, పి. రవీంద్ర నాథ రెడ్డి, జి. శ్రీకాంత్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, వై ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఉన్నారు. అంతకు ముందు టీటీడీ అథితి గృహం వద్ద టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు.