విద్యుత్ సరఫరాలో సాంకేతిక నష్టాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు డిస్కంలు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలోని మంగళవారం ఈస్ట్, సెంట్రల్, సౌత్ డిస్కం సిఎండిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్స్ కో విజిలెన్స్ జెఎండి మల్లారెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో డిస్కంల పనితీరుపై సమీక్షించారు.ఈ సందర్బంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ రంగంలో డిస్కంల పాత్ర కీలకమైనదని అన్నారు. ప్రజలకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్ ను అందించడంలో వారధిగా నిలుస్తున్న డిస్కంలు తమ పనితీరును మరింత మెరుగు పరుచుకోవాలని కోరారు. విద్యుత్ చౌర్యాలను పూర్తిస్థాయిలో అరికట్టడం, ఓవర్ లోడ్, లో ఓల్టేజీ వంటి సమస్యలను నియత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ విషయంలోనూ ట్రాన్స్ ఫార్మర్ లు ఫెయిల్ అయిన వెంటనే డిస్కం అధికారులు తక్షణం స్పందించాలని కోరారు. వారం రోజుల్లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లను మార్చాలని, లేనిపక్షంలో రైతులు పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి ట్రాన్స్ ఫార్మర్ లను మార్చడంలో జాప్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయని అన్నారు. దీనిపై డిస్కం సిఎండిలు దృష్టి సారించాలని, క్షేత్రస్థాయిలో సిఎండిలు పర్యటించడం ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు అర్థం చేసుకుని, నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుందని అన్నారు. ట్రాన్స్ ఫార్మర్ ల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని సూచించారు. ట్రాన్స్ ఫార్మర్ ల ఫెయిల్యూర్ రేటును మరింత తగ్గించాలని అన్నారు. క్వాలిటీ టెస్టింగ్ , సిపిఆర్ఐ డిజైన్లు, నిబంధనల ప్రకారం పరీక్షించిన తరువాతే ట్రాన్స్ ఫార్మర్ ల కొనుగోళ్ళు చేయాలని అన్నారు. ఇందుకోసం మొత్తం రూ.4,113 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు.
'జగనన్న కాలనీలు సీఎం మానస పుత్రికలు'
జగనన్న కాలనీలు సీఎం శ్రీ వైయస్ జగన్ మానస పుత్రికలని, కాలనీలకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించడాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 31 మంది పేదలకు ఇళ్ళస్థలాలు, పక్కాగృహాలను మంజూరు చేశారని, వాటిని అన్ని వసతులను కల్పించాలనే సీఎం గారి లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ దీపాలు, గృహ విద్యుత్ కనెక్షన్లు, మంచినీటి సరఫరాకు విద్యుత్ సదుపాయం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. జగనన్న కాలనీలకు ఫేజ్ -1 కింద 10,067 లేఅవుట్ల లోని 14.80 లక్షల ప్లాట్ లకు రూ.4500 కోట్లతో విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని ఈ పనుల విషయంలో పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు.
కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై అధికారులు మంత్రికి వివరించారు. ఆర్డిఎస్ఎస్ కింద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 59.19 లక్షల స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాల్సి ఉందని, 2023 డిసెంబర్ నాటికి 46.41 లక్షల మీటర్లు భిగించాల్సి ఉందని తెలిపారు. అలాగే 2025 మార్చి నాటికి మరో 12.77 లక్షల మీటర్లను భిగించాల్సి ఉంటుందని తెలిపారు.
సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్క్ కో విజిలెన్స్ జెఎండి మల్లారెడ్డి, డిస్కం సిఎండిలు జె.పద్మాజనార్థన్ రెడ్డి, (సిపిడిసిఎల్) కె.సంతోషరావు (ఇపిడిసిఎల్), హెచ్ హరనాథ్ రావు(ఎస్పిడిసిఎల్), ఇంధన శాఖ డిప్యూటీ సెక్రటరీ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.