ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సి అమలుకు సంబంధించిన వివిధ జిఓలను ప్రభుత్వం జారీ చేసింది.ఈమేరకు బుధవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పిఆర్సి అమలుకు సంబంధించిన సమావేశం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్,జిఏడి కార్యదర్శి (సర్వీసెస్) హెచ్.అరుణ్ కుమార్ ల సమక్షంలో జరిగింది.ఈసందర్భంగా పిఆర్సి అమలుకు సంబంధించిన 8 ప్రభుత్వ ఉత్తర్వులను(జిఓ)జారీ చేసి ఆజిఓల ప్రతులను సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఆర్ధికశాఖ అధికారులు అందచేశారు. ఈసమావేశంలో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ పిఆర్సి అమలుకు సంబంధించి బుధవారం 8జిఓలను జారీ చేయడం జరిగిందని మరో రెండు జిఓలను కూడా బుధవారం రాత్రికి లేదా గురువారం విడుదల చేయడం జరుగుతుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు చెప్పారు.మరికొన్ని జిఓలు త్వరలో విడుదల అవుతాయని అన్నారు.
ఈసమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సి పెండింగ్ అంశాల అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.అదే విధంగా వివిధ పెండింగ్ బిల్లులను కూడా ప్రాధాన్యతా క్రమంలో చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పిఆర్సితో పాటు ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని సకాంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్ రెడ్డి,ఎపి ఎన్జీవో సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు,ఎపి రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు,రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామి రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ,ఇంకా ఆయా సంఘాల జనరల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.