చిన్నశేష వాహనంపై మురళి కృష్ణుడిగా శ్రీ మలయప్ప..
Ens Balu
0
Tirumala
2020-09-20 16:44:04
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమలి పింఛం, పిల్లనగ్రోవితో మురళి కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయంలోని ధ్వజస్థభం వరకు స్వామివారిని చిన్న శేష వాహనంపై ఏకాంతంగా ఊరేగించారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఈవో అనిల్కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు డిపి.అనంత, శివకుమార్, శేఖర్రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్మోహనాచార్యులు పాల్గొన్నారు.