పెద్ద‌శేష వాహ‌న‌సేవ‌లో సీఎం వైఎస్.జగన్..


Ens Balu
10
Tirumala
2022-09-27 16:46:58

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన మంగ‌ళ‌వారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. బుధ‌వారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.

          ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు  నారాయణ స్వామి,  సత్యనారాయణ, మంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  వేణుగోపాలకృష్ణ, మతి రోజా, ఎంపిలు  మిథున్ రెడ్డి,  రెడ్డెప్ప, గురుమూర్తి,  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు  భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి,  బియ్యపు మధుసూదన్ రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు  రాములు,  పోకల అశోక్ కుమార్,  సంజీవయ్య,  మధుసూదన్ యాదవ్,  మారుతి ప్రసాద్,  ప్రశాంతిరెడ్డి, జెఈవో  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు.