సమాచారశాఖ వెబ్ సైట్ లోనూ రాజకీయం..!


Ens Balu
625
visakhapatnam
2024-07-23 04:19:46

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు, సమాచారం మొత్తం అన్ని వర్గాల మీడియాకి అందించేస్తే ప్రభుత్వం చేసే పనులన్నీ ప్రజలకి తెలిసిపోతాయ్.. ప్రభుత్వంలోని సీఎంకి, ఇతర మంత్రులకు మంచి పేరు వచ్చేస్తుంది.. అలాకాకుండా గత ప్రభుత్వంలో మాదిరిగా చిన్న, మధ్య తరహా పత్రికలను తొక్కిపెడితే కేవలం కొన్ని పత్రికలు, ఛానళ్ల ద్వారా మాత్రమే ప్రచారం చేస్తే.. ఏదో అరాకొరా మాత్రమే తెలుస్తుంది. అలా చేస్తే ప్రభుత్వం చేసే మంచి కూడా అన్ని స్థానిక జిల్లా పత్రికల ద్వారా కూడా ప్రజలకు తెలికుండా ఉంటుంది... తద్వారా గత ప్రభుత్వంమే నయం అనుకుంటారు ప్రజలు.. ఆ రీతిగా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలోని కొందరు తేడా.. గత ప్రభుత్వంలోని పెద్దలకు విధేయులుగా ఉండే అధికారులు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టిపెట్టి కూపీలాగుతున్నా..ప్రతీరోజూ కార్యాలయంలో ఏం జరుగుతుందో పిన్ టు పిన్ తెలియజేస్తున్నారట. దానితో  రాష్ట్ర ప్రభుత్వం సమాచారశాఖ వెబ్ సైట్ రూపు రేఖలనే మార్చేయడానికి సిద్దపడి కార్యాచరణ మొదలు పెట్టింది..!

సమాచార పౌర సంబంధాలశాఖ..ప్రభుత్వ కార్యక్రమాలను, మీడియాకు చేరవేసే ఒక ప్రభుత్వ శాఖ..ఈ శాఖ పని కేవలం పత్రికలు, ఛానళ్లకు ప్రభుత్వ సమాచారాన్ని న్యూస్ ఫార్మాట్ లో అందించి.. ప్రభుత్వం ఏం చేస్తున్నది మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలి.. కానీ రాష్ట్ర సమాచారశాఖ కార్యాలయం నుంచి జిల్లా సమాచారశాఖ కార్యాలయం వరకూ కొందరు అధికారులు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ప్రభుత్వ సమాచారం మీడియాకి ఈమెయిల్ ద్వారా, వాట్సప్ గ్రూపుల ద్వారా అందించాలని ప్రత్యేకంగా లేఖల ద్వారా అభ్యర్ధించినా.. వారి ఇంట్లో ఆస్తులు.. డబ్బులు అడిగినట్టుగా తెగ ఫీలైపోతున్నారు.. సమాచారశాఖ మొత్తాన్ని వారే ఉద్దరించేస్తున్నట్టుగా తెగ నొప్పులు పడిపోతున్నారు.. కనీసం ప్రభుత్వ నిబంధనలను, జీఓలను అర్ధంచేసుకోవడం కూడా చేత కానివారు సమాచారశాఖలో అధికారులుగానూ, సిబ్బందిగా ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో..

 ప్రభుత్వ సమాచారం టివీలకు, పత్రికలకు ఎంత ఎక్కువగా అందిస్తే ప్రభుత్వం చేసే పనులు, పథకాలు వివరాలన్నీ అన్ని పత్రికలు, ఛానళ్లు ద్వారా ప్రజలకు చేరుతాయి. దానికి పోయి.. మీకు కనీసం అక్రిడిటేషన్ ఉందా.. మీరు ఎన్నేళ్లుగా ప్రెస్ లో పనిచేస్తున్నారు..ఎక్కడో శ్రీకాకుళంలో పత్రిక ఉంటే రాష్ట్రరాజధానిలోని సీఎం కార్యక్రమాలు మీకెందుకు.. ఇక్కడి ప్రభుత్వ సమాచారం ఇవ్వకూడదు.. వాట్స్ గ్రూపులు నిండిపోయాయి..జిమెయిల్ గ్రూపుల్లో ఖాళీలేదు.. మేము అత్యవసర సమావేశాల్లో ఉన్నాము లాంటి ప్రశ్నలు..సమాధానాలను మాత్రమె చెబుతూ కాలం నెట్టుకొచ్చేస్తున్నారు తప్పితే రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని నడుస్తున్న స్థానిక చిన్న పత్రికలకు సీఎం సమాచారం మాత్రం ఇవ్వడం లేదు.. వాస్తవానికి ప్రధాన పత్రికలతోపాటు స్థానిక పత్రికల ద్వారా కూడా ప్రభుత్వ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళుతుంటాయి. అలాంటి స్థానిక పత్రికలను పూర్తిగా అణగదొక్కి గత ప్రభుత్వం మాదిరిగా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర కార్యాలయ అధికారులు.

ఒకప్పుడు సమాచారశాఖ వెబ్ సైట్ అంటే రాష్ట్ర సమాచారం, ప్రభుత్వ జీఓలు, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలతోపాటు, అన్ని శాఖల మంత్రులు వారి కార్యక్రమాలు, దానికి సంబంధించిన సమాచారం మొత్తం అధికారిక వెబ్ సైట్ లో పొందు పరిచేవారు. కాలక్రమంలో సమాచారశాఖ వెబ్ సైట్ ను పూర్తిగా మార్చేసి..కొంత సమాచారం మాత్రమే పెడుతున్నారు. ఏడాదికి ఒకసారి ప్రెస్ అక్రిడిటేషన్లు దరఖాస్తు చేసుకునందుకు వీలుగా మాత్రమే తయారు చేసి వదిలేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అయితే మరీ దారుణంగా స్థానిక పత్రికలను, జిల్లా పేపర్లను పూర్తిగా అగణ దొక్కేందుకు జీఓనెంబరు 38 లాంటి వాటిని కూడా అమలు చేసి వేల సంఖ్యలో జర్నలిస్టులకు ప్రెస్ అక్రిడిటేషన్లను దూరం చేయగలిగారు. ఇపుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రంలోని పీఐబీ వెబ్ సైట్ తరహాలో వెబ్ సైట్ ని రూపొందిస్తే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సమాచారం అందించడానికి వీలుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగా సమాచారశాఖ వెబ్ సైట్ రూపురేఖలను మారుస్తోంది.

 అయితే ఈ విధానం రాష్ట్ర సమాచారశాఖ కార్యాలయంలోని అధికారులకు పెద్దగా రుచించడం లేదు. ఈ శాఖ వెబ్ సైట్ పూర్తిస్థాయిలో తయారుచేస్తే.. రాష్ట్రప్రభుత్వ సమాచారం మొత్తం రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో ఉన్న అన్ని పత్రికలకు, ఛానళ్లకు, లోకల్ కేబుల్ టివిలకు తెలిసిపోతుందని భావించి జిల్లాల సమాచారం పెట్టకుండా కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలు..అందునా పీడిఎఫ్ ఫార్మాట్ లోనే పెట్టించే విధంగా తమ పంతాన్ని నెగ్గించుకోగలిగారు. గతంలో సమాచారశాఖ వెబ్ సైట్ లో ఏ జిల్లా సమాచారశాఖ కార్యాలయం నుంచి వచ్చే ప్రెస్ నోట్లు, ఫోటోలు, వీడియోలు అన్నీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే విధంగా ఓపెన్ ఫైల్  ఫార్మాట్, మేటర్ కాపీపేస్ట్ ఫార్మాట్ లో కేంద్రప్రభుత్వ సంస్థ పిఐబీ వెబ్ తరహాలోనే ఉండేవి. కానీ ఇపుడు సమాచారశాఖ ఆధ్వర్యంలో కొత్తగా తయారైన వెబ్ సైట్ లో కూడా రాష్ట్ర అధికారులకు అనుగుణంగా మాత్రమే తయారు చేయించుకోవడంలో పై చేయి సాధిస్తున్నారు.

-సమాచారశాఖ వెబ్ సైట్ ఎలా ఉండాలంటే...
రాష్ట్ర సమాచార పౌరసంబంధాలశాఖ తన వెబ్ సైట్ ని కేంద్ర ప్రభుత్వ సంస్త పీఐబి వెబ్ సైట్ తరహాలో కొత్తగా తీర్చి దిద్దుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన సమాచారంతోపాటుగా అన్ని శాఖల మంత్రులకు చెందిన తాజా సమాచారం, కార్యక్రమాలు, ఫోటోలు, వీడియోలు డౌన్ లోడ్ చేసుకునే విధంగా ఉండాలి. త ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న మధ్య తరహా పత్రికలు, ఇతర ప్రధాన పత్రికలు, టివి ఛానళ్లు నేరుగా వెబ్ సైట్ నుంచే డౌడ్ లోడ్ చేసుకునే విధంగా తేదీల వారీగా ఉండాలి. ప్రస్తుతం పీఐబీ వెబ్ సైట్ లో ఆ విధంగానే ప్రధానమంత్రితోపాటు ఇతర మంత్రులశాఖలకు చెందిన తాజా సమాచారాన్ని అన్ని భాషల్లోనూ పొందు పరుస్తున్నారు. ఇక 26 జిల్లాలకు చెందిన డిపీఆర్వోలు, డివిజనల్ పీఆర్వోలు మీడియాకి పంపే సమాచారం కూడా  ప్రతీ జిల్లాలోనూ డిపిఆర్వోకి లాగిన్ ఐడి ఏర్పాటు చేసి ప్రెస్ నోట్లు, వీడియో, యూట్యూబ్ లింక్స్ అన్నీ వెబ్ సైట్ లో జిల్లాల వారీగా అప్లోడ్ చేస్తే మీడియా స్వయంగా డౌన్ లోడ్ చేసుకునేవిధంగా ఉండాలి. ప్రెస్ నోట్లు, ఫోటోలే కాకుండా ఆహ్వానాలు కూడా వెబ్ సైట్ లోని ఏ జిల్లాకి ఆ జిల్లా వారీగా సమాచారం తెలియజేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీడియాకి అనుకూలంగా వుంటుంది.  తద్వారా రాష్ట్ర సమాచారశాఖ కార్యాలయంలో నడుస్తున్న తేడా రాజకీయాలకు తెరపడినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా అన్ని వర్గాల మీడియా కూడా రాష్ట్ర కార్యాలయ అధికారుల చుట్టూ ప్రెస్ గ్రూపులు, ఈమెయిల్ గ్రూపుల్లో మీడియాకి చెందిన ఈమెయిల్ ఐడిలు, వాట్సప్ నెంబర్లు యాడ్ చేయాలని కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే పని కూడా ఉండదు.

-ఏపీఆర్వోల నుంచి డీపిఆర్వోల వరకూ పునశ్చరణ తరగతులు అవసరం
సమాచార పౌరసంబంధాలశాఖలోని చాలా వరకూ డిపిఆర్వోలు, డివిజనల్ పీఆర్వోలు, ఏపీఆర్వోలకు ప్రభుత్వ సమాచారాన్ని న్యూస్ ఫార్మాట్ లో ప్రెస్ నోట్ తయారు చేసే విధానంలో శిక్షణ ఇప్పించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. నేటికీ చాలా జిల్లాల్లోని అధికారులకు ప్రెస్ నోట్ రాయడం కూడా రావడం లేదు. అలాగని అధికారులు నేర్చుకునేందుకు ముందుకి రావడం లేదు. క్రిందిస్థాయిలోని ఏపీఆర్వోలు, డివిజనల్ పీఆర్వోల మీదనే భారం మొత్తం నెట్టేస్తున్నారు. దీనితో కార్యాలయంలోని ఇతర పనులతోపాటు, డిపిఆర్వోలు, డివిజనల్ పీఆర్వోలు చేసే పనులు కూడా ఏపీఆర్వోలు చేయడం వలన దారుణంగా నలిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దానికితోడు ఈశాఖలో పెద్ద మొత్తంలో అధికారులు, సిబ్బంది ఉద్యోగ విరమణలు చేయడంతో ఉన్నవారిపైనే పనిభారం మొత్తం పడిపోతున్నది. గత ప్రభుత్వ హాయంలో ఏపీఆర్వోలను నియమించినా వారికి సమాచారశాఖకు సంబంధించిన ఏ పనిచేయడం చేతకావడం లేదు. కనీసం ప్రెస్ నోటు రాసే విధానం కూడా ఏపీఆర్వోలకు రాకపోవడంతో వారిని కార్యాలయంలోని ఇతర పనులకు డిపిఆర్వోలు వినియోగించుకోవాల్సి వస్తున్నది. కొందరు ఏపీఆర్వోలకు, ఇతర విభాగాల్లోని వారికి పదోన్నతులు రాకపోవడం వలన కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రెస్ అండ్ మీడియాకి ప్రెస్ నోట్లు పంమన్నా, ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నెంబర్లు గ్రూపుల్లో యాడ్ చేయమంటే ఎక్కడ లేని రాజకీయం చేసే ఈశాఖలో అధికారులు... అదే మీ శాఖ పనులు మీరు చేయడం లేదని ప్రశ్నిస్తే మాత్రం ఎక్కడలేని కోపాలు వచ్చేస్తున్నాయి. 

అలాగని రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్లు కూడా వీరి వ్యవహారాలపై దృష్టి సారించడం లేదు. కొన్ని పత్రికలు వీరు చేసే పనులకు చక్కభజనలు చేస్తున్నా.. ప్రశ్నించేవారు మాత్రం ఎప్పటికప్పుడు సమాచార పౌర సంబంధాల శాఖ యొక్క విషయాలను బహిర్గతం చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో మీకు ప్రెస్ అక్రిడిటేషన్లు రాకుండా ఆపేస్తామని.. ప్రెస్ నోట్లు పంపమని.. దిక్కున్న చోట చెప్పుకోమని చెప్పే అధికారులకు అల్లూరి ఆశయసాధనే ఈరోజు దిన పత్రిక ద్వారా తెలియజేసేది ఒక్కటే.  ఇకపై సమాచారలోని జరిగే ప్రతీ పని, వ్యవహారం, వ్యాపకం, తేడాతనం, అనధికారిక వ్యవహరాలు, చేయని పనులకు పెట్టే దొంగ బిల్లులు, డీజిల్ పెట్రోలు ఖర్చులు, ఒక వర్గం మీడియాకే ప్రకటనలు ఇచ్చి ఇతర మీడియాకి ఇవ్వని వైనంపై ఎప్పటికప్పుడు వార్తలు రాస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్నాం. సమాచారశాఖ ద్వారా మీ మా పత్రికకు ప్రెస్ అక్రిడిటేషన్లు పెట్టకపోయినా బ్రతిమిలాడేది లేదు. మీ చుట్టు తిరేగేది అంతకంటే లేదు. వాస్తవాలు ఏ విధంగా బయటకు తీయాలో ఆవిధంగానే బయటపెడతామని కూడా ముందుగానే చెబుతున్నాం. ఇక్కడ కావాల్సింది.. జరగాల్సింది ఒక్కటే.. ఒక మంచి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నది. ఆ విషయం సమాచారశాఖ ద్వారా అన్ని వర్గాలకు తెలియాలి. 

ఆ విషయంలో గత ప్రభుత్వంలోని వారికి కోవర్టులుగా ఉంటాం.. కూటమి ప్రభుత్వ ప్రచారాలాను తమస్థాయిలో పెద్దగా బయటకు వెళ్లనీయమంటే కుదరదని కూడా తెలియజేస్తున్నాం.  ఇకపై అన్నీ ముందుగా చెప్పే చేస్తామని హింట్ ఇస్తున్నాం. కూటమి పరిపాలన సమాచారశాఖ అన్ని జిల్లాల్లోనూ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిందే. లేదంటే మాత్రం వారి స్టైల్ లోనే రాజకీయాలతోనే లోన జరిగే వ్యవహారాలన్నీ బయటకు వచ్చి ప్రభుత్వం దృష్టికి కూడా ప్రత్యేక కథనాల రూపంలో తీసుకెళతామని కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని పత్రికలు, మీడియాకి, ఛానళ్లకి ఎందుకు సమాచారం ఇవ్వరో కూడా చూస్తాం. రాష్ట్రప్రభుత్వం కొత్తగా తయారు చేస్తున్న సమాచారశాఖ వెబ్ సైట్ ద్వారా మొత్తం సమాచారం అన్నివర్గాలకు, అన్నిజిల్లాల్లోని పత్రికలు, ఛానళ్లకు తెలిసేలా రూపొందిస్తారని భావిస్తున్నాం. లేకపోతే ఏ విధంగా తీసుకురావాలో.. ఆవిధంగానే తీసుకొస్తామని బల్లగుద్ది మరీ చెబుతున్నాం. సమాచార శాఖ మీ సొంత జాగీరు కాదు. ప్రజలకు మీడియా ద్వారా ప్రభుత్వ సమాచారం అందించాల్సిన బాధ్యత, అవసరం ఉందనేది తేడా అధికారులు, సిబ్బంది గుర్తించాల్సిందే. లేదంటే మాత్రం ఏం జరుగుతున్నా.. అక్షరాలతో సహా పక్కాగా ప్రత్యేక వార్తలు అందించే విషయంలో ఎక్కడా తగ్గేదే లేదని ముందుగానే తెలియజేస్తున్నాం..!