స్టీల్ ప్లాంట్ పనులు మరింత ముమ్మరం చేయాలి..


Ens Balu
5
Velagapudi
2020-10-26 21:20:41

డా.వైఎస్సార్ కడప జిల్లాలోని స్టీల్‌ప్లాంట్‌ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఈ మేరకు ఏపీఐఐసి, పరిశ్రమల శాఖ అధికారులు, మంత్రులు, చైర్మన్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ, కరువు పీడిత ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ది, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్టీల్‌ప్లాంట్‌ను తీసుకొస్తున్నామని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.     కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి 7 ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని.. వాటితో జరిపిన సంప్రదింపుల పురోగతిని సీఎంకు వివరించారు.  స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంపై ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి ఒక సంస్థను ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. అందుకు కనీసం ఏడు వారాల సమయం పడుతుందని అధికారులు తెలియజేశారు. ఆ ప్రక్రియ పూర్తి కాగానే తదుపరి 3-4 వారాల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. కంపెనీల ప్రతిపాదనల స్వీకరణకు ముందు ప్రభుత్వ పరంగా ఏమైనా పనులు మిగిలిఉంటే వాటిని నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అనంతరం కడప నగరానికి సమీపంలో కొప్పర్తి వద్ద ఏర్పాటవుతున్న ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌పై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. క్లస్టర్‌ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. 300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు డిక్సన్‌ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని అధికారులు సీఎంకి వివరించారు. ఆ పెట్టుబడి మరింత పెంచే అవకాశం ఉందని తెలిపారు. డిక్సన్‌తో పాటు మరిన్ని కంపెనీలు కూడా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా చక్కటి ప్రమాణాలతో కొప్పర్తి ఈఎంసీని తీర్చిదిద్దాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఇండస్ట్రియల్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.