సమాచారశాఖకి పూర్తిస్థాయి వెబ్ సైట్ ఎక్కడ..?


Ens Balu
2
Tadepalle
2021-01-04 10:33:38

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సమాచార పౌర సంబంధాల శాఖ నేటికీ పూర్తిస్థాయి వెబ్ సైట్ కి నోచుకోలేదు..కేంద్రంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పిఐబీ) మాదిరి అన్ని రాష్ట్రాల్లోనూ సమాచారశాఖ అన్ని జిల్లాలు, అన్ని ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల సమాచారం, జీఓలు తెలియజేయడానికి రాష్ట్రప్రభుత్వం సమాచారశాఖకు ఒక పూర్తిస్థాయి వెబ్ సైట్ ఉండాలి. సదరు వెబ్ సైట్ నుంచే మీడియా, పత్రికలు విషయాన్ని తీసుకోవాలి. రాష్ట్రంలో జరిగే అభివ్రుద్ధి కార్యాక్రమాలు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రుల పర్యటనలు ప్రభుత్వ శాఖల తాజా సమాచారాన్ని ఆ వెబ్ సైట్ లో పొందుపరచాలి. ఈ విధంగానే కేంద్ర ప్రభుత్వం అన్నిప్రభుత్వ శాఖలు, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ఇతర మంత్రిత్వ శాఖలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పీఐబీ వెబ్ సైట్ లో అందుబాటులో వుంచుతుంది. దానిని అన్ని మీడియా సంస్థలు తీసుకొని, వాటికి కొంత సమాచారాన్ని జోడించి ప్రజలకు వార్తల రూపంలో తెలియజేస్తాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయం అటు విద్యావంతులు, ప్రజలు తెలుసుకోవడానికి వీలుపడుతుంది. ప్రభుత్వ శాఖల అధికారులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ ల సమాచారం ఈ వెబ్ సైట్ లో పెట్టడం ద్వారా  మీడియా సంస్థలు కూడా రాష్ట్ర అభివ్రుద్ధికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఈ వెబ్ సైట్ నుంచి సేకరించి ప్రజలకు తెలియజేసే ఆస్కారం వుంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలకు వెబ్ సైట్లు పెట్టినప్పటికీ, ప్రత్యేకంగా రాష్ట్రప్రభుత్వానికి, అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్ల పర్యటనలు, ఇతర అభివ్రుద్ధి కార్యక్రమాల సమాచారం తెలియజేసేందుకు సమాచారశాఖకు మాత్రం నేటికీ పూర్తిస్థాయి వెబ్ సైట్ ను అందుబాటులోకి తేలేదు. అన్నిజిల్లాల్లో జిల్లాకి సంబంధించిన వెబ్ సైట్లు ఉన్నప్పటికీ కనీసం అందులో సైతం సమాచారశాఖ ప్రభుత్వ శాఖలకు చెందిన రోజువారీ సమాచారం గానీ, ప్రెస్ నోట్లుగానీ అందుబాటులో ఉంచడం లేదు. సీఎంఓ ప్రెస్ నోట్లు సైతం కొన్ని మీడియా సంస్థలకే సమాచారం అందుతోంది మంత్రులు పీఆర్వోలు ఉన్నా లేనట్టే.. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అందరు మంత్రులకు వేలకు వేలు జీతాలు వెచ్చించి పీఆర్వోలను ఏర్పాటు చేసింది. వాళ్లంతా మంత్రుల పర్యటనలు, కార్యక్రమాలను టీవి ఛానళ్లకు స్క్రోలింగ్ పాయింట్స్ ఇస్తున్నారు తప్పితే  ప్రతీరోజూ ప్రజల ముంగిటకు వెళ్లే పత్రికలకు న్యూస్ ఫార్మాట్ లో ప్రెస్ నోట్లు మాత్రం పంపడం లేదు. కాదు కాదు పంపడం వచ్చే పీఆర్వోలు లేరు. మంత్రులు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలోని పత్రికలు, మీడియా సంస్థల రిపోర్టర్లను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి అందులో స్క్రోలింగ్ పాయింట్లును మాత్రమే అందిస్తున్నారు. ఇలా చేయడంతో పత్రికలకు సమాచారం పూర్తిస్థాయిలో అందడటం లేదు. వాస్తవంగా రాష్ట్రానికి ఒక శాఖకు మంత్రి అంటే ఆ మంత్రికి సంబంధించిన సమస్త సమాచారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపించాల్సిన అవసరం ప్రభుత్వం మంత్రి దగ్గర ఏర్పాటు చేసిన పీఆర్వోపై వుంది. కానీ మంత్రుల దగ్గర పనిచేసే కొందరు పీఆర్వోలు ఆ నియోజకవర్గానికి, జిల్లాకే పరిమితం అవుతున్నారు. తమకు సంబంధించిన పత్రికల్లో వార్తలొస్తే చాలులే అన్నట్టుగానే మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వంలోని సమాచారశాఖకి పూర్తిస్థాయి వెబ్ సైట్ లేని కొరత, ఇబ్బంది మీడియా సంస్థలకు కొట్టొచ్చిన్నట్టు కనిపిస్తుంది. అదే రాష్ట్రంలో సమాచారశాఖ వెబ్ సైట్ వుంటే అపుడు ఖచ్చితంగా అన్నిశాఖల మంత్రులకు చెందిన సమాచారాన్ని ఇటు డీపీఆర్వోలు, అటు మంత్రుల దగ్గర పీఆర్వోలు ఆ వెబ్ సైట్ లో న్యూస్ ఫార్మాట్ రూపంలో ప్రెస్ నోట్లు పొందు పరచడం వలన రాష్ట్రంలోని అన్ని మీడియా సంస్థలకు సమాచారం తెలిసే అవకాశం వుంది. అటు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సొంత పీఆర్వోలను ఏర్పాటు చేసుకొని వారికి తమ ప్రాంతంలోని నచ్చిన మీడియా సంస్థలకే తమ నేతల సమాచారాన్ని పంపుతుండటం కూడా విశేషం. ప్రభుత్వ శాఖల సమాచారం ఇవ్వని డీపీఆర్వోలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ శాఖల సమాచారాన్ని మీడియాకి ఇచ్చే సమాచారశాఖ అధికారులు రాష్ట్ర విభజన తరువాత జిల్లాలకే పరిమితం అయిపోయారు. వాస్తవానికి పక్కజిల్లాల మీడియా సంస్థలకు సమాచారాన్ని మెయిల్ రూపంలో పంపడం ద్వారా అధికారులు ఒక్క రూపాయి కూడా  ఖర్చు అవదు. కానీ మాజిల్లా అధికారుల సమాచారం మా జిల్లాల్లో వస్తే చాలు పక్కజిల్లాలకు కూడా ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నారు సమాచారశారశాఖ అధికారులు. ఒక్కముక్కలో చెప్పాలంటే మేము పక్కజిల్లాల మీడియాకి ప్రెస్ నోట్లు పంపంమని తెగేసి చెబుతున్నారు. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాలకు చెందిన డీపీఆర్వోలు మాత్రం తమ జిల్లా అధికారుల సమాచారాన్ని అన్ని జిల్లాలకు పంపుతున్నారు. తద్వారా సదరు జిల్లాల్లో జరిగిన అభివ్రుద్ధి కార్యక్రమాలు పక్కజిల్లాలకు కూడా తెలుస్తున్నాయి. ఇదే సమయంలో సమాచారశాఖ ఉన్నతాధికారులు సైతం ఈ విషయం తమకేమీ పట్టదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకు పక్కజిల్లాల మీడియా సంస్థలకు ప్రభుత్వ శాఖల సమాచారం పంపించలేదనే విషయాన్ని ప్రశ్నించకపోవడంతో అధికారులు తాము అనుకున్నదే సాధించినట్టు ఫీలైపోతున్నారు. అందులోనూ సిబ్బంది కొరత కూడా సమాచారశాఖను వేధిస్తోంది. కొత్తగా 13 జిల్లాల్లోనూ ఏపీఆర్వోలను ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నా అందులో ఏ ఒక్కరికీ ప్రెస్ నోట్లు రాయడం చేతకకపోవడంతో వారిని డిపీఆర్వోలు కార్యాలయ పనులకి వినియోగిస్తున్నారు. సమాచారశాఖ ఎలాగూ అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్ సైట్ రూపొందించలేదు. కనీసం జిల్లాల డీపీఆర్వోలను ఆదేశిస్తే..ఆ వెబ్ సైట్ వచ్చేంత వరకైనా రాష్ట్రంలోని అన్ని జిల్లాల సమాచారం అన్ని జిల్లాల్లో ఉండే మీడియాకి తెలుస్తుందనే కోణంలో ఆలోచించకపోవడం గమనార్హం.  అన్ని ప్రభుత్వశాఖలకు ప్రత్యేకంగా వెబ్ సైట్లు, యాప్ లను నిర్మించిన ప్రభుత్వం ఒక్క సమాచారశాఖ విషయంలోనే అన్ని జిల్లాల సమాచారం రాష్ట్రంలోని అన్ని మీడియా సంస్థలకు అందించాలనే కోణంలో ఎందుకు ఆలోచించడం లేదో తెలియడం లేదు.. ఈ విషయంలో రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి మరి..!