పెట్టుబడుల కోసం ఉత్తరాంధ్రా పర్యటన..


Ens Balu
4
Amaravati
2021-01-18 15:01:32

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మరో కొత్త ఒరవడికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న మూడు ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి, సమానాభివృద్ధి దిశగా సాగుతున్నారు. దీనికోసం 19వ తేదీ మంగళవారం, 20తేదీ బుధవారం ఆయన ఉత్తరాంధ్ర పర్యటనకు సన్నద్ధమయ్యారు.  ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెడుతూ ఉత్తరాంధ్రలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యతనిస్తూ విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. అందులో భాగంగా ఆయా జిల్లాలకు సంబంధిచిన ఇన్ ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల శాఖ అధికారులందరితో కలిసి సమావేశమై 'ఈజ్  ఆఫ్ డూయింగ్ బిజినెస్' చర్చించనున్నారు. స్థానికంగా పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు, భూముల కేటాయింపులో పారదర్శకత, పారిశ్రామికవేత్తలకు క్షేత్రస్థాయిలో  ఎదురయ్యే సమస్యలన్నింటిపై సమగ్ర చర్చ జరపనున్నారు. అన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి..వేగం, పారదర్శకతకు పెద్దపీట వేసే వ్యూహంతో పరిశ్రమల శాఖ మంత్రి ముందుడుగు వేస్తున్నారు.