అధిక ఫీజుల వేధింపులపై ఏకమవ్వండి..
Ens Balu
1
Vijayawada
2021-01-22 15:36:25
ఆంధప్రదేశ్ లో ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజుల కోసం యాజమాన్యాలు పీడిస్తున్న సమయంలో తల్లిదండ్రులంతా ఏకం కావాలని పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ పిలుపునిచ్చింది. కమిషన్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా వివిధ పాఠశాలలు, కళాశాలలు తనిఖీ చేస్తున్నట్టు ఏపి ఎస్హెచ్ ఆర్ అండ్ యం ఛైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు తెలిపారు. స్థానిక ఆర్ అండ్ బి భవనాల సముదాయంలో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఛైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ కనీస స్థాయిలో నిర్వహణ లేని 25 పాఠశాలలు, 50 కళాశాలలు పై కఠినమైన చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం కేవలం 70 శాతం ట్యూషన్ ఫీజులు వసూలు చేయవలసి ఉండగా, కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏడాది గత ఏడాది ఫీజులు ఆధారంగా 70 శాతం ఫీజులు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే కొన్ని యాజమాన్యాలు గత ఫీజులను అధికంగా పెంచి వసూలు చేస్తున్నాయన్నారు. ఫీజుల వసూల విషయంలో ట్యూషన్ ఫీజులు, ఇతర ఫీజులు అన్ని కలిపి విద్యార్థుల తల్లిదండ్రులపై విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. యాజమాన్యాలు తల్లిదండ్రులను భయపడుతున్న సంఘటనలను కూడా తమ దృష్టికి వచ్చాయన్నారు. కళాశాలలు, పాఠశాలలు ప్రభుత్వ మార్గదర్శకాలు పట్టించుకోకుండా తల్లిదండ్రులపై విద్యార్ధులపై ఇబ్బందులకు గురి చేసే సంఘటనలు జరిగితే వాటి గుర్తింపును రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అటువంటి సంఘటనలపై క్రిమినల్ కేసులు కూడా ఆయా యాజమాన్యాలపై తీసుకునేందుకు వెనుకాడబోమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులందరు సంఘటతమై ఇంతకంటే ఎక్కువ ఫీజులు చెల్లించలేమని యాజమాన్యాలకు తెలియజేస్తూ సందేశం పంపాలన్నారు.
కమిషన్ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి 70 శాతం వరకు మాత్రమే ఫీజు వసూలు చేసేందుకు అనుమతించామని ఇది సముచితమైన సిఫార్సు అని ఛైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 360 కళాశాలలు, పాఠశాలలు తనిఖీలు చేశామన్నారు. ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా అన్నీ ఇస్తున్నట్లు పేర్కొంటూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. తమ తనిఖీ బృందానికి పలు పాఠశాలలు, కళాశాలలు తనిఖీ సందర్భంగా విద్యార్థులు తమ బాధలు తెలియజేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు ఏకమై అధిక ఫీజుల విషయమై ఒక త్రాటి పైకి వచ్చి ఇంతే చెల్లిస్తామని ఆయా యాజమాన్యాలకు తెలియజేయాలని ఛైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు కోరారు.
వైస్ ఛైర్మన్ విజయశారదరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు పిర్యాదులు వస్తున్నందున క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టామన్నారు. మొదటి సంవత్సరంలోనే రెండు సంవత్సరాల ఫీజులు వసూలు చేస్తూ బోధన , ఇతర వసతులు లేకపోయినా ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. వేరే కళాశాలకి వెళ్ళే ఆలోచనా ఉన్న టిసీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నరన్నారు. పశువుల దొడ్డి కన్న హీనంగా తరగతిగదులు హస్టల్స్ నిర్వహణ ఉంటోందన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలు చదివే కళాశాలలు, పాఠశాలలు, వసతిగృహాలను తనిఖీ చేయలన్నారు. చాలా యాజమాన్యాలు ఫీజుల వసూలు సంబంధించి రికార్డులను సమర్పించడం లేదని ఈ విషయంపై ఏదోరకంగా దాటవేసే ధోరణి అవలంభిస్తూన్నారన్నారు. ఎక్కౌంటెంట్లును అందుబాటులో ఉంచడం లేదన్నారు. తనిఖీ బృందాలకు యాజమాన్యాలు సహకరించడం లేదన్నారు. కమిటి సభ్యులు మాట్లాడుతూ కొన్ని క్యాంపస్లో రూ.2లక్షల నుండి 5 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలను ముమ్మరంగా చేపడతామన్నారు. ఇంటర్ బోర్డు ద్వారా ప్రభుత్వం నిర్ధేశించిన కోర్సులు బొధించవలసి ఉండగా అనుమతి లేని వాటిని కూడా పాఠ్యాంశాలుగా చేరుస్తున్నారన్నారు. కమిషన్ సూచనలమేరకు ఫీజుల వసూల విషయంపై వాటి వివరాలు గ్రామ సచివాలయలు వద్ద ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే తగిన సిఫార్సులు చేస్తూ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు సిద్దంగా ఉందని సభ్యులు తెలిపారు. వాటి వివరాలను కూడా కమిషన్ వెబ్ పోర్టల్ లో ప్రదర్శిస్తామన్నారు.
ఈ సమావేశంలో ఏపి ఎస్హెచ్ ఆర్ అండ్ యం కమిటి సభ్యులు, వివి నారాయణ రెడ్డి, సిఏఈ ప్రసాద్ ఈశ్వరయ్య, అజయ్కుమార్లు పాల్గొన్నారు.