భారీ ఆదాయం తెచ్చిపెడుతున్నా చిన్నచూపే..
Ens Balu
2
Singareni
2021-03-03 16:50:51
సింగరేణి నుంచి ఏటా వందల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న కేంద్రం.. సంస్థను మాత్రం చిన్నచూపుచూస్తున్నది. అంత చిన్న సంస్థలతో తమకేం లాభమనేలాగా వ్యవహరిస్తున్నది. బొగ్గు తవ్వకాల ద్వారా ఇబ్బడిముబ్బడిగా లాభాలను గడిస్తూ.. ఇటు కార్మికుల సంక్షేమం, అటు దేశ ప్రతిష్ఠను చాటడంతో సింగరేణి బొగ్గు కంపెనీలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఇటు రాష్ట్రంతోపాటు కేంద్రానికీ భారీగా ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నది. వాస్తవానికి సింగరేణిలో రాష్ట్రవాటా 51శాతం కాగా, కేంద్రంవాటా 49. లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రవాటా అధికంగా కనిపిస్తున్నప్పటికీ ఆదాయం మాత్రం కేంద్రానికే అధికంగా వెళ్తున్నది. పన్నులు, ఇతరత్రా రూపంలో కేంద్రానికే ఎక్కువ మొత్తంలో చెల్లిస్తున్నది. వ్యాట్, సీఎస్టీ, ఎస్జీఎస్టీ, డీఎంఎఫ్టీ, వర్క్స్ కాంట్రాక్ట్ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, రాయల్టీ, డివిడెండ్ను సింగరేణి రాష్ర్టానికి చెల్లిస్తుంది. కేంద్రానికి వచ్చేసరికి.. అడ్వాన్స్ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్, ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ (ఎఫ్బీటీ), డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, డివిడెండ్, స్టోవింగ్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఈడీ), కస్టమ్స్ డ్యూటీ, సెర్వీస్ టాక్స్ ఆన్ జీటీఏ, రెంట్స్ అండ్ అదర్స్, స్వచ్చ్భారత్ సెస్, క్రిషి కల్యాణ్ సెస్, ఐజీఎస్టీ, సీజీఎస్టీ, జీఎస్టీ కాంపన్సేషన్ సెస్, ఇంట్రెస్ట్ ఆన్ జీఎస్, క్లీన్ ఎనర్జీ సెస్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, ఎన్ఎంఈటీ, సంపద పన్ను (వెల్త్ టాక్స్) వంటివాటి కింద ఏటా రూ.వేల కోట్లు చెల్లిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సింగరేణి లాభాలను భారీగా పెంచుకుంటూ పోతున్నది. బాగా పనిచేసేవారి నుంచి బాదుకోవాలనే సూత్రంతో.. కేంద్రం అనేక పన్నుల రూపంలో సింగరేణి నుం చి 2014 తర్వాత ఇప్పటివరకు రూ.17,700 కోట్లు పొందింది. ఇదే సమయంలో రాష్ర్టానికి సింగరేణి చెల్లించిన మొత్తం రూ.15,012 కోట్లు మాత్రమే. కేంద్రం పొందిన ఆదాయంలో దాదా పు రూ.500 కోట్ల వరకు డివిడెండ్ కూడా ఉన్న ది. మొదట్లో రాష్ర్టానికి చెల్లించే మొత్తమే ఎక్కువగా ఉన్నప్పటికీ.. జీఎస్టీ ప్రారంభమయ్యాక కేంద్రానికి చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. సింగరేణి సంస్థ లాభాలను గణనీయంగా పెంచుకోవడం వల్లనే కేంద్రానికి ఆదాయం పెరుగుతున్నది. సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో.. సీఎండీ శ్రీధర్ ఆధ్వర్యంలో సింగరేణి నిర్దేశించుకున్న లక్ష్యాలను దాటి బొగ్గు ఉత్పత్తి చేస్తూ లాభాలు గడిస్తున్నది. అదేస్థాయిలో కేంద్రానికి, రాష్ర్టానికికూడా పన్నులను చెల్లిస్తూ వస్తున్నది. కేంద్ర, రాష్ర్టాలకు కలిపి ఆరేండ్లలో సింగరేణి సంస్థ చెల్లించిన మొత్తం రూ.32,704.39 కోట్లు.