నెల రోజుల్లో వేక్సినేషన్ పూర్తిచేస్తాం..


Ens Balu
1
Tadepalle
2021-06-05 14:36:44

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే నెల రోజుల్లో 45 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ వేక్సినేషన్ పూర్తి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అమరావతిలోని తన చాంబర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 50 శాతానికి 45ఏళ్లు నిండిన వారికి ఒక వ్యాక్సిన్ వేశామని, రాబోయే నెల రోజుల్లో మిగిలిన వారందరికీ పూర్తి స్థాయిలో టీకాలు వేస్తామని చెప్పారు.  సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు పెంచిన స్టయిఫండ్ ను గతేడాది సెప్టెంబర్ నుంచి వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 88,441 శాంపిళ్లు పరీక్షించగా, 10,373 కరోనా కేసులు నమోదయ్యాయని, 80 మంది మృతి చెందారని తెలిపారు. శుక్రవారం 85,311 శాంపిళ్లు పరీక్షించగా,, 10,413 కరోనా కేసులు నమోదయ్యాయని, 83 మంది మృతి చెందారని వెల్లడించారు. గత రెండ్రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు 10 వేలకు అటు ఇటుగా నమోదవుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నానికి 1,774 ఐసీయూ బెడ్లు, 8,164 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. శుక్రవారం చూస్తే 1,664 ఐసీయూ బెడ్లు, 8,186 ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలోనూ రోజు రోజుకూ కరోనా బాధితుల సంఖ్య తగ్గుతూ వస్తోందన్నారు. శనివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొవిడ్ కేర్ సెంటర్లలో 12,247 మంది చికిత్స పొందుతున్నారన్నారు. 3,247 మంది డిశ్ఛార్జి కాగా, 1,248 మంది వివిధ ఆసుపత్రుల్లో అడ్మిషన్ పొందారన్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం రోజువారీగా 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించగా, కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో గడిచిన 24 గంటల్లో 406 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్, శుక్రవారం 356 మెట్రిక్ టన్నులను డ్రా చేశామన్నారు. రాష్ట్రంలో 1,460 బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించామన్నారు. 104 కాల్ సెంటర్ కు వస్తున్న ఫోన్ కాల్స్ సంఖ్య కూడా రోజు రోజుకూ తగ్గుతోందన్నారు. గడిచిన 24 గంటల్లో 3,061 ఫోన్ కాల్స్ రాగా, శుక్రవారం 3,351 కాల్స్ వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హోం ఐసోలేషన్ లో ఉన్న 24,706 మంది కరోనా బాధితులతో టెలీ కాల్ మెడిసిన్ సెంటర్ ద్వారా వైద్యులు ఫోన్ చేసి మాట్లాడారన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులతో పాటు మరణాల రేటు కూడా తగ్గుముఖం పడుతోందన్నారు.